budjet : బడ్జెట్ కు మంత్రి మండలి ఆమోదం

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ అసెంబ్లీ కమీటీ హాల్‌లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. మూడు నెలల కోసం రూపొందించిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై చర్చించి దాన్ని ఆమోదించింది. ఇప్పుడు ఈ బడ్జెట్‌ను మధ్యాహ్నం 12 గంటలకు ఉభయ సభల్లో ప్రవేశ పెట్టనున్నారు. శాసన సభలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసన మండలిలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ చదవనున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి దాదాపు 3 లక్షల కోట్ల అంచనాలతో ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారని సమాచారం. ఆరు గ్యారంటీలతోపాటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రధానంగా దృష్టి పెట్టి కేటాయింపులు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రవేశ పెట్టే బడ్జెట్‌పై సోమవారం ఉభయ సభల్లో చర్చిస్తారు. అయితే ఇది తాత్కాలిక బడ్జెట్ అని ఇందులో పూర్తి స్థాయి కేటాయింపులు ఉండబోవంటున్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ జూన్ లో ప్రవేశ పెట్టనున్నారు.బడ్జెట్‌కు ముందు మీడియాతో మాట్లాడిన ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క… బడ్జెట్‌లో అన్ని అంశాలు ఉంటాయన్నారు. ఎన్నికల టైంలో పార్టీ ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు. ఆస్తులు.. అప్పులతో పాటు .. కేంద్రం నుంచి వచ్చే ఆదాయంపై కూడా సభలో స్పందిస్తానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *