MINISTER SEETHAKKA: జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు
* గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
* మంత్రి దనసరి అనసూయ సీతక్క

* కేస్లాపూర్లో నాగోబా దర్బార్
*  ప్రత్యేక పూజలు చేసిన ప్ర‌జా ప్ర‌తినిధులు, అధికారులు
*  అల‌రించిన సాంస్కృతిక కార్యక్ర‌మాలు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. సోమవారం ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా దర్బార్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ముందుగా నాగోబా ఆలయంలో ఆదిలాబాద్ ఎంపీ, స్థానిక ఎమ్యెల్యే, కలెక్టర్, ఎస్పీ, పిఓ లతో కలిసి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  పూజారులు,  మెస్రం వంశీయులు అతిథులకు శాలువాలు, నాగోబా చిత్రపటాలతో సత్కరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా నిర్వహించిన దర్బార్ లో పాల్గొని మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం ఆదివాసి, గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధికి బాటలు వేస్తుందని అన్నారు. ఎంతో చరిత్ర కలిగి అక్షరంలో అగ్రభాగాన ఉన్న ఆదిలాబాదు జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషిచేయాలని సూచించారు. గిరిజన ఆరాధ్య దైవం, కొంగు బంగారం, ఇలవేల్పు నాగోబా దేవతను భక్తి శ్రద్దలతో పాటు ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా ఈ జాతర నిర్వహించుకోవడం జరుగుతుందని, ఇదే స్పూర్తితో చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేయాలని అన్నారు. ఐటిడిఎ ద్వారా యువతకు వృత్తి నైపుణ్య శిక్షణలు అందించి స్వయం ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే గిరిజన ఆవాసాలకు రహదారులు, వంతెనల నిర్మాణం, విద్యా, వైద్యం, వ్యవసాయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా 60 కోట్ల రూపాయల వ్యయంతో నీటి శుద్ధి కేంద్రం పనులకు ఇటీవల శంఖుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమ ప్రాధాన్యతనిస్తూ సంక్షేమం, అభివృద్ధి కొరకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని ప్రర్యాటక ప్రదేశాలను అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. దర్బార్ సందర్బంగా వచ్చిన ప్రజాఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.ఆదిలాబాదు పార్లమెంట్ సభ్యులు సోయం బాపూరావు మాట్లాడుతూ, ఆదివాసి యువత ఉన్నత చదువులు చదివేలా సౌకర్యాలు కల్పించాలని అన్నారు. విద్యుత్, అటవీ, పోడు పట్టాల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. పివిటిజి కుటుంబాలకు పిఏం జన్మన్ పథకం అమలు చేయడం జరుగుతుందని, అర్హులందరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ కోరారు.ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ,  గిరిజన ప్రజల సమస్యల పరిష్కారానికి నాగోబా దర్బార్ ను ఆనవాయితీగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. నాగోబా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విద్య, వైద్యం, గిరిజన అభివృద్ధి, సంక్షేమాన్ని నిధులు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఉట్నూర్ లో సిహెచ్సి ఆసుపత్రిలో టి-డయాగ్నస్టిక్ హబ్ కేంద్రాన్ని ప్రారంభంచుకోవడం జరిగిందని తెలిపారు.జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్ మాట్లాడుతూ, జాతర ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, పారిశుద్యం, త్రాగునీరు, విద్యుత్ సరఫరా లో అంతరాయం కలుగకుండా నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నామని తెలిపారు. విద్యా, వైద్యం, వ్యవసాయం, విద్యుత్, రహదారులు, త్రాగునీరు, పోడుభూములు సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించడం జరిగిందని అన్నారు. దర్బార్ లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఐటిడిఏ పిఓ ఖుష్బూ గుప్తా స్వాగతోపన్యాసం చేస్తూ, గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు తీసుకుంటున్న వివరాలను ఆమె వివరించారు. ఎస్పీ గౌస్ అలాం మాట్లాడుతూ, జాతర నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలున్న పోలీస్ లను నేరుగా సంప్రదించాలని ఈ సందర్బంగా ఎస్పీ పేర్కొన్నారు.  అంతకుముందు వివిధ ఆదివాసీ నాయకులు వారి సమస్యలను విన్నవించారు. సాంసృతిక కార్యక్రమాలు, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుల ప్రదర్శనలు ఆహ్వానితులను ఎంతగానో అలరించాయి. ఈ దర్భార్ లో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *