Government negligence on payment of dues will not be tolerated : బకాయిల చెల్లింపుపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సహించం

-ఏపీ జేఏసీ నేతలు టి.నరసింహారెడ్డి, మాదన విజయ కుమార్, సి.రామచంద్రారెడ్డి

సిరా న్యూస్,బద్వేలు;
ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఏపీ జేఏసీ బద్వేలు తాలూకా కన్వీనర్ టి.నరసింహారెడ్డి, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు మాదన విజయకుమార్, ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సి.రామచంద్రారెడ్డి లు హెచ్చరించారు.

ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించాలని, 12వ పిఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ జెఏసి రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో బద్వేలు తాలూకా జేఏసీ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు ధరించి బద్వేల్ మండలం తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా టి.నరసింహారెడ్డి, మాదన విజయ కుమార్, సి.రామచంద్రారెడ్డి లు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల జగన్ సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఉద్యోగుల పక్షపాతిగా ఉంటామని, ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో చెల్లిస్తామని, తాము అధికారంలోకి వచ్చిన వారంలోపే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని (సిపిఎస్) రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ఎన్నికలకు ముందు నమ్మబలికి, అధికారంలోకి వచ్చాక ఉద్యోగులను నట్టేట ముంచారని వారు ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒరిగిందేమీ లేదన్నారు. సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పి సిపిఎస్ కంటే దుర్మార్గపూరితమైన జిపిఎస్ విధానాన్ని అమలు చేశారన్నారు. ఉద్యోగులకు మెరుగైన వేతనాలను అమలు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల జీతాల్లో కోత విధించి చరిత్రకెక్కిందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించకపోగా ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ అవసరాల కోసం దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్, ఏపీజిఎల్ఐ సొమ్ములను సైతం ఉద్యోగులకు తెలియకుండానే ప్రభుత్వం కాజేసి తమ అవసరాల కోసం వాడుతుందని ఆరోపించారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏ, పిఆర్సీ , సరెండర్ లీవ్, మెడికల్ రీయంబర్స్మెంట్ తదితర బకాయిలను సంవత్సరాల కాలంగా చెల్లించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు.
గత ఏడాది జులై మాసం నుండి నూతన పిఆర్సీని అమలు చేయాల్సి ఉన్నా, కమిషన్ ను నియమించి చేతులు దులుపుకున్నారే తప్ప విధివిధానాలు రూపొందించి, అమలు చేసిన పాపాన పోలేదన్నారు. ఒకపక్క ఉద్యోగులను అడుగడుగునా వంచిస్తూనే మరో ప్రక్క తమది ఉద్యోగుల పక్షపాతి ప్రభుత్వమని ప్రభుత్వ పెద్దలు ప్రకటించుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం వద్ద తాము దాచుకున్న సొమ్ముల కోసం కూడా ఉద్యోగులు ఎదురుచూడాల్సి రావడం దుర్మార్గమన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వం సంఘాలను చర్చలకు పిలిపించి “చాయ్ బిస్కెట్ల” సమావేశం నిర్వహిస్తున్నదే తప్ప సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలను తక్షణం చెల్లించాలన్నారు. దీంతోపాటు పెండింగ్ డిఏ లను చెల్లించాలని, 12వ పిఆర్సీని అమలు చేయాలని, అంతవరకు 30 శాతం మధ్యంతర భృతిని చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ పోరాటం మరింత తీవ్రతరమవుతుందని, అందుకు ప్రభుత్వం తగు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో తాలూకా అధ్యక్షులు ఆర్.అమర్నాథరెడ్డి, ఉపాధ్యక్షులు బి.మల్లికార్జునరావు, ట్రెజరర్ వి.శివరామిరెడ్డి, పెన్షనర్స్ అసోసియేషన్ తాలూకా అధ్యక్షులు డాక్టర్.మీనాక్షి రెడ్డి, సెక్రటరీ కత్తి బ్రహ్మయ్య, ట్రెజరర్ సి.గంగన్న, యుటిఎఫ్ బద్వేలు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.దేవానందం, కె.సుధాకర్, ఎస్టీయూ బద్వేల్ మండల అధ్యక్షులు ఎస్.రమేష్ రాజా నాయకులు పిచ్చయ్య, మాబు హుస్సేన్, ఎం.క్రిస్టఫర్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
నిరసన కార్యక్రమం అనంతరం బద్వేలు మండల డిప్యూటీ తహసిల్దార్ చంద్ర శేఖర రావుకు వినతి పత్రం సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *