విశ్రాంత ఉద్యోగుల సంఘం
ప.గో.జిల్లా మహాసభ డిమాండ్
సిరా న్యూస్,తాడేపల్లిగూడెం;
ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు అందరికీ హయ్యర్ పింఛను మంజూరు చేయాలని , కనీస పింఛను మొత్తాన్ని పదివేల రూపాయలకు పెంచాలని ఆర్టీసి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (411 /2014) ప.గో.జిల్లా రీజనల్ మహాసభ డిమాండ్ చేసింది.మహాసభ తీర్మానాలను ,ఎన్నికైన నూతన కార్యవర్గ వివరాలను అసోసియేషన్ రీజనల్ అధ్యక్షుడు ఓసూరి వీర్రాజు, కార్యదర్శి ఆర్.ఎస్. కుమార్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
తాడేపల్లిగూడెం సిపాయిపేట భవననిర్మాణ కార్మికసంఘం కార్యాలయంలో ఆదివారం జరిగిన రీజినల్ మహాసభకు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఓసూరి వీర్రాజు అధ్యక్షత వహించారని ఆ ప్రకటనలో తెలిపారు.అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.వి.ఆర్.కే.రాయ్, ప్రధానకార్యదర్శి కే.ఆర్.ఆంజనేయులు, కార్యనిర్వహక అధ్యక్షుడు ఏ.నరసింహారావు, ఉపాధ్యక్షుడు జి.విష్ణు, ఎ.ఐ.టి.యు.సి.రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.సోమసుందర్ రిటైర్డ్ ఆర్టీసి ఉద్యోగుల సమస్యలపై మాట్లాడారనీ, విశ్రాంత ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరినట్లు ఆ ప్రకటనలో వివరించారు.
విశ్రాంత ఆర్టీసి ఉద్యోగులకు సంస్థ ఇప్పటివరకూ రెండేళ్ళకు ఒకసారి గుర్తింపు కార్డును జారీ చేస్తున్నదని, వృద్దాప్యంలో ఉన్న విశ్రాంత ఉద్యోగులు తమ కార్డును రెన్యువల్ చేయించుకోవడం ఇబ్బందిగా ఉందని ,అందువల్ల వారికి ఒకేసారి జీవితకాలపు గుర్తింపు కార్డు ఇవ్వాలని మహాసభ విజ్ఞప్తి చేసింది.
మరణించిన ఉద్యోగుల మట్టి ఖర్చుల నిమిత్తం ప్రస్తుతం ఇస్తున్న 25 వేల రూపాయల మొత్తాన్ని ఆర్టీసి విశ్రాంత ఉద్యోగులకు కూడా వర్తింప చేయాలని, విశ్రాంత ఆర్టీసి ఉద్యోగులకు ఇచ్చిన బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని సూపర్ లగ్జరీ బస్సులలో అనుమతించాలని , విశ్రాంత ఆర్టీసి ఉద్యోగులకు తెల్ల రేషన్ కార్డు మంజూరు చేసి , ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అంద చేయాలని మహాసభ డిమాండ్ చేసినట్లు వారా ప్రకటనలో వెల్లడించారు.
రీజనల్ కమిటీకి అధ్యక్షునిగా ఓసూరి వీర్రాజు, ఉపాధ్యక్షులుగా జి.వెంకటరావు, కార్యదర్శిగా ఆర్.ఎస్.కుమార్, కోశాధికారిగా వి.డేవిడ్, కార్యవర్గ సభ్యులుగా జి.మహంకాళి, పి.శంకరరావు, కే.ఆశీర్వాదం, కే.పాపారావు, ఏ.రామకృష్ణ, సి.హెచ్. రత్నాకరరావు, బి.గాంధీ రావు ఎన్నికయ్యారని ఆ ప్రకటనలో తెలిపారు.