సీట్లపై పీటముడి వీడేది ఎప్పుడు

 సిరా న్యూస్,ఏలూరు;
పొత్తు రాజకీయాలు టీడీపీ-జనసేన నాయకులకు తలనొప్పిగా మారుతున్నాయా? సీట్ల సర్దుబాటులో రెండు పార్టీలు కుస్తీ పడుతుంటే.. ముచ్చటగా మూడో పార్టీ చేరి పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాదా? సీట్లపై పీటముడి వీడేది ఎప్పుడు? ఎన్నికలకు సిద్ధమయ్యేది ఎప్పుడు?టీడీపీ-జనసేన పొత్తు రెండు పార్టీల్లోని ఆశావహులకు టెన్షన్‌గా మారుతోంది. పొత్తుల్లో ఎవరి సీటు త్యాగం చేయాలో తెలియని పరిస్థితుల్లో నేతలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ బలంగా ఉన్న గోదావరి జిల్లాలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. జనసేన పొత్తుతో టీడీపీలో బలమైన నేతలు తమ సీట్లు త్యాగం చేయాల్సిన పరిస్థితి రావడం.. అధిష్టానం ఏ విషయంపైనా క్లారిటీ ఇవ్వకపోవడంతో భవిష్యత్‌పై బెంగ పెట్టుకుంటున్నారు టీడీపీలోని ముఖ్యనేతలు.పొత్తుల్లో ఉంగుటూరు, భీమవరం స్థానాలను జనసేన కోరుకుంటున్నదనే వార్తలు టీడీపీలో హీట్‌ పుట్టిస్తున్నాయి. భీమవరంలో జనసేనాని పవన్‌ పోటీ చేయనుండటంతో ఆ సీటుపై పెద్దగా పేచీ లేకపోయినా, ఉంగుటూరులో టీడీపీలో ప్రధాన నేత సీటుకు ఎర్త్‌ పెట్టేలా జనసేన పావులు కదుపుతుండటంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది.ఉంగుటూరులో టీడీపీ ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు వ్యవహరిస్తున్నారు. ఈయన ప్రస్తుతం ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు చూస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన వీరాంజనేయులుకు 61 వేల ఓట్లు వచ్చాయి. అవే ఎన్నికల్లో ఈ స్థానం నుంచి జనసేన తరఫున పోటీ చేసిన పత్సమట్ల ధర్మరాజుకు కేవలం 10వేల ఓట్లు వచ్చాయి. ఇప్పుడు పొత్తుల్లో భాగంగా ఉంగుటూరును తమకు కేటాయించాలని జనసేన ప్రతిపాదిస్తుండటంతో టీడీపీలో అలజడి పెరిగిపోతోంది.ఇరు పార్టీల మధ్య పొత్తులపై అవగాహన కురిరిన తర్వాత రెండు పార్టీల నేతల సమన్వయంతోనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, సీటు వరకు వచ్చేసరికి రెండు పార్టీల మధ్య అభద్రత కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఓడిన మరునాడు నుంచే ప్రజలకు అందుబాటులో ఉన్న తనను పొత్తుల్లో ఎక్కడ తప్పిస్తారోనని మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు టెన్షన్‌ పడుతున్నారు. ఇదే సమయంలో తమ పార్టీ గ్రాఫ్‌ బాగా పెరిగిందని, పొత్తుల్లో ఉంగుటూరు తమకే కేటాయించాలని జనసేన నేత ధర్మరాజు వాదిస్తున్నారు. ఈయన కూడా గత నాలుగున్నరేళ్లుగా సామాజిక సేవ కార్యక్రమాలతో నియోజకవర్గ ఓటర్లకు దగ్గరవడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది.ఇక ఈ రెండు పార్టీలతో జట్టుకట్టే ప్రయత్నాల్లో ఉన్న బీజేపీ కూడా ఉంగుటూరు సీటుపై కర్చీఫ్‌ వేసేందుకు సిద్ధమవుతుండటంతో మరింత వేడి పెరిగింది. ఉంగుటూరుకు చెందిన బీజేపీ మహిళా నేత, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాలతీరాణి కూడా టికెట్‌ ఆశిస్తున్నారు. టీడీపీతో పొత్తు కుదిరితే ఉమ్మడి జిల్లాలో ఒక పార్లమెంట్‌, ఒక అసెంబ్లీ సీటును బీజేపీకి కేటాయించాస్తారని.. ఆ ఒక్క అసెంబ్లీ సీటు ఉంగుటూరేనని అంటున్నారు మాలతీరాణి.దీంతో పొత్తు రాజకీయం స్థానిక టీడీపీ పెద్దలకు తలనొప్పిగా మారింది. ఏ విధంగా చూసుకున్నా, జనసేన, బీజేపీ నేతలకన్నా, టీడీపీయే ఉంగుటూరులో స్ట్రాంగ్‌గా ఉన్నందున అధిష్టానం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు టీడీపీ నేతలు. ఈ పరిస్థితుల్లో పొత్తు ఎత్తుల్లో టీడీపీ అధి నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..? ఉంగుటూరు నియోజకవర్గాన్ని ఏ పార్టీకి కేటాయిస్తుందనేదే హాట్‌టాపిక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *