సిరా న్యూస్;
మనదేశంలో విద్యా వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. ఎంత డబ్బు పెడితే అంత చదువు కొనుక్కోవచ్చనే ఆలోచనలో తల్లిదండ్రులు ఉన్నారు. పేద, మధ్య తరగతి తల్లిదండ్రులు సైతం తమ పిల్లల చదువుల కోసం ఆస్తులు తెగనమ్మి కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. వ్యాపారాత్మకమైన విద్యలో విలువలకు చోటు లేకుండా పోయింది. మార్కులు, ర్యాంకులకే ప్రాధాన్యత ఉంది. కానీ అమెరికా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా విధానం చాలా బాగుంటుంది. పూర్తిగా ఉచితం కావడం, విద్యా ప్రమాణాలు బాగుండటంతో ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. అమెరికాలో పారిశ్రామిక విప్లవం అనంతరం అనేక రంగాల్లో బాగా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా విద్యారంగంలో ఆ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మార్పులే ప్రపంచ ఆర్థిక శక్తిగా అమెరికా ఎదగడానికి దోహదపడ్డాయి.అమెరికా మొత్తం బడ్జెట్లో విద్యకు సుమారు 8.5 శాతం అంటే 90 బిలియన్ డాలర్లకు పైగా వెచ్చిస్తున్నారు. అమెరికాలో కిండర్ గార్డెన్ నుంచి 5వ తరగతి వరకు ఎలిమెంటరీ స్కూల్ పేరుతో పిలుస్తారు. 6, 7, 8 తరగతులను మిడిల్ స్కూల్ అని.. 9, 10, 11, 12 తరగతులను హైస్కూల్ అని అంటారు. హైస్కూల్ చదువు వరకు ప్రభుత్వం ఉచిత విద్యను అందజేస్తుంది. తర్వాత కాలేజీ విద్య కొనసాగింపు చాలా ఖరీదైన వ్యవహారం బాగా మార్కులు తెచ్చుకోగలిగితే స్కాలర్ షిప్ల రూపంలో ఆర్థిక వనరులు సమకూరుస్తారు. మిషనరీ స్కూల్స్ కూడా ఉంటాయి, అలాగే రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణలో కమ్యూనిటీ కాలేజీలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం నామమాత్రపు ఫీజులుంటాయి. ఒక్కో క్లాస్కు 25 నుంచి 30 మంది వరకు విద్యార్థులు ఉంటారు. అమెరికాలో బాలబాలికలిద్దరూ కలిసే చదువుకుంటారు. అందరూ కలిసి భోజనం చేసేందుకు పెద్ద డైనింగ్ హాల్ ఉంటుంది. ఇక్కడ పేద పిల్లలకు ఉచితంగా ఆహారం అందజేస్తారు. మిగిలిన వారు నగదు చెల్లించాల్సి ఉంటుంది. మంచి ఆరోగ్యకరమైన పౌష్టికాహారం అందజేస్తారు. అన్ని ప్రాంతాలకు ఉచిత బస్సు సౌకర్యం ఉంటుంది. తల్లిదండ్రులు, టీచర్లు, పిల్లలను అనుసంధానం చేస్తూ ఒక యాప్ ఉంటుంది. అందులో విద్యార్థి హాజరు, మార్కులు, ప్రవర్తనా తీరులాంటి అనేక అంశాలు పొందుపరుస్తారు.ఒక జాతిని సామాజికంగా, ఆర్థికంగా నడిపించే శక్తి విజ్ఞానానికి, నైపుణ్యానికి మాత్రమే ఉందన్న వాస్తవాన్ని గ్రహించిన అమెరికా ఆ దిశగా పయనించింది. అమెరికాలోని డేకేర్స్, ప్రైవేటు పాఠశాలల్లో భారీ ఫీజులుంటాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం చాలా అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణం, అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయి. ఆయా స్కూల్స్ లో ఉన్న విద్యాప్రమాణాలు, విద్యా బోధన, ఇతర సౌకర్యాలు ఆధారంగా వాటికి ఒకటి నుంచి పది పాయింట్ల వరకు రేటింగ్ ఇస్తారు. ఏ ప్రాంతంలో నివసిస్తున్న వారు ఆ ప్రాంతంలో ఉన్న పాఠశాలల్లోనే చేర్పించాలి. ఇక్కడ విలువలతో కూడిన విద్య, నైపుణ్యం సంపాదించి బతకడం నేర్పిస్తారు. పిల్లలు కూడా ఇష్టంగా స్కూళ్లకు వెళతారు. కానీ మన పాఠశాలల్లో పిల్లలను వాస్తవ ప్రపంచానికి దూరంగా పెంచుతున్నాం. పుస్తక ప్రపంచంలో ఉంచి బట్టీ చదువులకు అలవాటు చేస్తున్నాం. బడికి ఎప్పుడైనా వెళ్లి చదువుకోవచ్చు, కానీ మంచి పౌరుడిగా ఎదగడానికి పసి వయసులోనే బీజం పడాలి. కానీ ఆ కోణంలో ఆలోచించలేక పోతున్నాం. బడ్జెట్ లో విద్యారంగానికి అరకొర నిధులు కేటాయిస్తున్నారు. ఈ ఏడాది మొత్తం బడ్జెట్ లో 2.5 శాతం.. అంటే లక్షా 12 వేల కోట్లు కేటాయించారు. ఆ నిధుల్లో కూడా ఎక్కువ భాగం సద్వినియోగం కావడం లేదు. మార్కులే కొలమానంగా భావిస్తూ, వాటి సాధనే జీవిత లక్ష్యంగా బోధిస్తున్నారు.అంతిమంగా పరీక్షల్లో సంపాదించే మార్కులనే మనం విద్యకు ప్రామాణికంగా తీసుకోవడంతో పిల్లలపై మానసిక ఒత్తిడి పెరుగుతోంది. దీంతో పొరపాటున పరీక్షల్లో తప్పితే జీవితమంతా వ్యర్థమైనట్లు, ఓడిపోయినట్లుగా భావిస్తున్నారు. వీటివల్ల వారిలో ఆత్మనూన్యతాభావం పెరిగి మానసిక క్షోభతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. భారతీయుల్లో సహజంగా ఉండే కష్టపడే గుణం, నేర్చుకునే తపన, పోటీతత్వం తదితర కారణాలతో వారు బాగా రాణిస్తూ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. కరోనా సమయంలో ఆన్ లైన్ విద్యావిధానానికి గిరాకీ పెరిగింది. మనదేశంలో ఉన్న విద్యావంతులు దీనిని అవకాశంగా మలచుకుని అనేక దేశాల్లో విద్యార్థులకు బోధిస్తున్నారు. అమెరికాలో పౌరసత్వం ఉన్న భారతీయులు సైతం ఇక్కడి స్కూళ్లలోని విశృంఖలత్వం, నేరప్రవృత్తి, కట్టుబాట్లు లేని సాంప్రదాయాలతో తమ పిల్లలు ఎక్కడ చెడిపోతారోనని భయపడుతున్నారు. దీంతో మాతృదేశంలోని స్కూళ్లలో చేర్పించేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇటీవల కాలంలో అది పెరిగిపోయింది.లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి ఎక్కువ మార్కులు, ర్యాంకులు సాధించడం కంటే నైతిక విలువలు, సృజనాత్మకతతో కూడిన విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. పిల్లలు వర్తమానంలో జీవించడానికి అలవాటు చేయాలి. వారికి ఏ రంగంలో ఆసక్తి ఉందో ఆయా రంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దాలి. పిల్లల ఆసక్తిని గమనించకుండా తల్లిదండ్రుల ఇష్టాఇష్టాలను వారిపై రుద్దే ప్రయత్నం చేయకూడదు. పిల్లలను ఇతరులతో పోల్చడం, వారిని పదేపదే విమర్శించడం వల్ల వారిలో ఆత్మనూన్యతా భావం పెరిగి.. తోటి విద్యార్థుల పట్ల ద్వేషం పెరుగుతుంది. విద్యాబోధన అంటే కేవలం సంపాదన అనే దృక్పథంతో చూడకూడదు. సమాజ శ్రేయస్సే లక్ష్యంగా, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేలా ఉండాలి. ఆత్మవిశ్వాసాన్ని, జ్ఞాపకశక్తిని, సామాజిక స్పృహను పెంచడం ద్వారా వారిలో చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.