సిరా న్యూస్,ఖమ్మం;
రాజకీయ అనుభవజ్ఞులతో పాటు అసలు రాజకీయం తెలియని వ్యక్తులు సైతం కాంగ్రెస్ ఎంపీ టిక్కెట్ కోసం అర్రులు చాస్తున్నారు. ఇప్పటికే అధిష్టానం వద్ద దరఖాస్తుల గడువు ముగిసే నాటికి ఖమ్మం స్థానం నుంచి పోటీచేసేందుకు 12 మంది ఆశావహులు “ఒక్క చాన్స్ ప్లీజ్..” అంటూ దరఖాస్తు చేసుకున్నారు.ఖమ్మం నుంచి గతంలో పోటీ చేసి కేంద్ర మంత్రి పదవిని అలంకరించిన మాజీ మంత్రి రేణుకా చౌదరి, డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ తో పాటు అసలు రాజకీయఅనుభవమే లేని బడా వ్యాపార వేత్త వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా దరఖాస్తు చేసుకున్నారు.రాష్ట్ర కాంగ్రెస్లో సీనియర్ నేత వి.హనుమంతరావు సైతం ఖమ్మం పార్లమెంట్ కు పోటీ చేసేందుకుఉవ్విళ్లూరుతున్నారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో హెల్త్ డైరెక్టర్ గా పని చేసిన మాజీ అధికారి గడల శ్రీనివాసరావు కూడా ఎంపీ టిక్కెట్ కోసం దరఖాస్తు చేశారు. ఈయన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగుడెం స్థానం
నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపి ఒక దశలో కేసీఆర్ కాళ్ళు మొక్కేందుకు సైతం వెనుకాడలేదు.మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు, మద్ది శ్రీనివాస్ రెడ్డి, నాగ సీతారాములు, వక్కలగడ్డసోమ చంద్రశేఖర్, వక్కలగడ్డ రూప ఖమ్మం ఎంపీ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. ఒక్క స్థానం కోసం 12 మంది పోటాపోటీ గా దరఖాస్తు చేసుకున్న పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు.రాష్ట్రంలోవేగంగా మారుతున్న రాజకీయ పరిస్థితులు ఖమ్మం ఎంపీ టిక్కెట్ స్థాయిని అమాంతం పెంచేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది స్థానాల్లో తొమ్మిదింటిలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించడమే ఇందుకుకారణంగా స్పష్టమవుతోంది.మొత్తం 12 దరఖాస్తుల్లో ఆరింటిని పక్కన పెట్టేసి మిగిలిన ఆరు దరఖాస్తుల్లో అభ్యర్థిని ఎంపిక చేసే విషయాన్ని పరిశీలించాలని జిల్లా కాంగ్రెస్ నుంచి సూచనప్రాయ సందేశం అధిష్టానానికివెళ్లినట్లు తెలుస్తోంది.
మొన్నటి ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మహా ప్రభంజనమే సృష్టించింది. ఈ నియోజక వర్గాల్లో అందరు అభ్యర్థులు పాతిక వేల పైచిలుకు
మెజారిటీతోనే విజయం సాధించారు. దీంతో ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ సీటు ఎవరికి దక్కినా వారు గెలవడం నల్లేరుపై నడకే కానుంది.ఖమ్మం కాంగ్రెస్ లో టిక్కెట్ కోసం పోటాపోటీ నెలకొనగా బీఆర్ఎస్ లో ఇందుకు
భిన్నమైన వాతావరణం నెలకొంది. ఎలాగూ గట్టెక్కే పరిస్థితి లేని నేపధ్యంలో గులాబీ పార్టీలో ఆశావహులు కాదు కదా అసలు సిట్టింగ్ అభ్యర్ధే పోటీ చేసేందుకు అనాశక్తి చూపుతున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ
జరుగుతోంది.2019లో జరిగిన ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా నామా నాగేశ్వరరావు తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి రేణుకా చౌదరిపై విజయం సాధించారు. అయితే తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మంలో కాంగ్రెస్ గాలి బలంగావీచిన క్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందడం ఆషామాషీ విషయం కాదు.దీంతో సిట్టింగ్ ఎంపీ నామా కూడా పోటీకి ఉత్సాహం చూపడం లేదని ప్రచారం జరుగుతోంది. అయితే మొన్నటి ఎన్నికల తర్వాత జరిగినబీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ స్థాయి సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షిగా మళ్లీ ఖమ్మం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేది నామానే అని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఓటమి చవి చూడాల్సి వచ్చే ఈ స్థానంనుంచి ఆయన తెలివిగా తప్పించుకునే ఎత్తు వేస్తున్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.నామా స్థానంలో ఒక బీసీకి టిక్కెట్ ఇచ్చి బలి చేసేందుకు పార్టీ పెద్దలు సమాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికేఎంపీ స్థాయి హోదాలో ఉన్న ఆ బీసీ నాయకుడి బలహీనతను ఆసరాగా చేసుకుని పార్లమెంట్ టిక్కెట్ ను అతనికి కేటాయించే యోచన చేస్తున్నట్లు తాజా పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఈమేరకు ఎన్నడూ లేనిది బీసీకార్డును బయటికి తీసి “ప్లే” చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. జనరల్ స్థానమైన ఖమ్మం ఎంపీ స్థానంలో గెలిచే అవకాశం ఉన్న ఏ ఒక్క సందర్భంలోనూ బీసీకి అవకాశం ఇవ్వకపోవడం గమనించాల్సిన విషయం తెలిసిందే.