రిమోట్ తో కాటాను నియంత్రిస్తున్న వ్యాపారులు
పట్టుకొని దేహశుద్ధి చేసిన రైతులు
సిరా న్యూస్,ఖమ్మం;
ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతన్నలకు ఏదో ఒకచోట దగా జరుగుతూనే ఉంది. రాత్రి పగలు కష్టపడి పండించిన మిర్చి పంటలు సరిగా దిగబడి లేక దిగాలు పోయిన రైతన్నలు,పండించిన పంటను అమ్మేందుకు వెళ్లి చివరకు వ్యాపారుల చేతిలో మోసపోతున్నారు. తాజాగా రైతులను మిర్చి కాటా వేస్తూ రైతులను మోసం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
చండ్రుగొండ మండల పరిధిలోని బెండల పాడు గ్రామంలో మిర్చి కాటాను రిమోట్ కంట్రోల్ తో నియంత్రిస్తూ హైటెక్ మోసానికి పాటుపడుతున్న ఇద్దరు వ్యాపారులను రైతులు పట్టుకున్నారు. తల్లాడ మండలం మల్లారం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యాపారులు గత నాలుగు రోజులుగా మండల పరిధిలోని బెండలపాడు బాలికుంట గ్రామాల్లో మిర్చికి క్వింటకు 19వేల రూపాయలు చెల్లించి రైతులు వద్ద నుండి కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో మిర్చి విక్రయించిన రైతులకు వ్యాపారులపై అనుమానం వచ్చింది. రోజు లాగానే గ్రామంలోకి మిర్చి కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యాపారులు ఓ రైతు వద్ద మిర్చి కొనుగోలు చేసి 25.53 క్వింటాలు అయినట్టు రైతుకు రసీదు ఇచ్చి ఆ మిర్చీని ఒక ట్రాలీ ఆటోలో లోడ్ చేసుకొని తరలిస్తున్న క్రమంలో అనుమానం వచ్చిన రైతులు ఆ ట్రాలీ ఆటోను ఓ వే బ్రిడ్జి వద్ద తూకం వేయించగా ఆ తూకంలో 31.10 క్వింటాలు రావడంతో దాదాపు 5 క్వింటాలు పైగా అధికంగా ఉండటంతో గమనించిన రైతులు వ్యాపారులను నిలదీశారు. ట్రాలీ డ్రైవర్ ట్రాలీని వదిలిపెట్టి పారిపోవడంతో ఆ ట్రాలీని వ్యాపారులను రైతులు గ్రామానికి తరలించారు. వ్యాపారులపై చేయి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న చండ్రుగొండ పోలీసులు బెండలపాడు గ్రామానికి చేరుకొని మిర్చి వ్యాపారులను అదుపులో తీసుకొని స్టేషన్ తరలించి విచారణ చేపట్టారు.