సిరా న్యూస్, కుందుర్పి
రేపు వైఎస్ జగన్మోహన్రెడ్డి సభ
* లక్షలాది మందితో భారీ బహిరంగ సభ
* సభ వేదిక ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
శంఖారావంలో భాగంగా రాప్తాడులో ఈనెల 18న నిర్వహించనున్న సిద్ధం సభకు వైఎస్సార్సీపీ నాయకులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ వేదిక నుంచే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్సీపీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు. గురువారం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, ఆయన సోదరులు తోపుదుర్తి రాజశేఖర్రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డి సభావేదిక ఏర్పాట్లను పరిశీలించారు.50 నియోజకవర్గాల నుంచి జిల్లా చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాయలసీమ జిల్లాలైన అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో పాటు లక్షల సంఖ్యలో పార్టీ శ్రేణులు ‘సిద్ధం’ సభకు హాజరు కానున్నారు. ఇప్పటి వరకు 25కి పైగా పార్కింగ్ ప్రాంతాలు గుర్తించారు. కార్యకర్తలకు దగ్గరగా వెళ్లి సీఎం జగన్ అభివాదం చేయడానికి వీలుగా సుమారుగా కిలో మీటరు విస్తీర్ణంతో ప్రత్యేక స్టేజీలను ఏర్పాటు చేస్తున్నారు.సభ జరిగే 110 ఎకరాల విస్తీర్ణాన్ని పూర్తిగా చదును చేసి సభా ప్రాంతాన్ని ముస్తాబు చేశారు. సభా ప్రాంగణం వేనుక భాగంలో సీఎం హెలీ ప్యాడ్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. హెలీ ప్యాడ్ దగ్గర నుంచి సభ ప్రాంగణం దగ్గరకు తారు రోడ్డు పనులు సాగుతున్నాయి. సభ ప్రాంగణాన్ని మ్యాట్తో కప్పి ముస్తాబు చేశారు. అలాగే రైల్వే బ్రిడ్జి దగ్గర బ్రిడ్జి పనులు జరుగుతుండడంతో బ్రిడ్జి కింద తారుతో డబుల్ రోడ్డు వేశారు. అనంతపురం రూరల్, అర్బన్ డీఎస్పీలు వెంకటశివారెడ్డి, ప్రసాద్రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.