సిరా న్యూస్, జైనథ్:
సాంగ్వి లిఫ్ట్ ఇరిగేషన్: నిర్మించారు… వదిలేశారు…
+ నిరుపయోగంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్
+ రూ. 6.13 కోట్ల ప్రజాధనం నీళ్లపాలు
+ చేన్లకు నీళ్లందించాలని వేడుకుంటున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని సాంగ్విSగ్రామ సమీపంలో పెన్గంగ నది ఒడ్డున రూ. 6.13 కోట్ల వ్యయంతో నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిరుపయోగంగా మారింది. 2009లో అప్పటి ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్మాణానికి శాఖాపరమైన అనుమతులు ఇచ్చింది. కానీ తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు వంటి కారణాలతో ప్రాజెక్ట్ మూలనపడింది. తరువాత 2014–15లో ప్రాజెక్ట్ నిర్మాణ పనులు జోరందుకున్నాయి. అప్పటి మంత్రి జోగు రామన్న ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి భూమి పూజ చేసి, పనులు ప్రారంభించారు. తరువాతి కాలంలో కోర్ట–చనాఖా బ్యారేజీ, హట్టిఘాట్ పంప్హౌజ్, పెన్గంగ కాలువల పనులు ఊపందుకోవడంతో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో జాప్యం జరిగింది. అటు తరువాత పనుల్లో వేగం పెర్గడంతో మోటర్ల ఏర్పాటు, ట్యాంక్ల నిర్మాణం, పైప్లైన్ పనుల ఎట్టకేలకు పూర్తి అయ్యాయి. కానీ ఇప్పటి వరకు రైతుల చేన్లకు చుక్కా నీళ్ల కూడ అందించలేదు. దీంతో కోట్ల రూపాయాలు వెచ్చించి నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉత్సవ విగ్రహంలా మారింది.
700 ఎకరాల ఆయకట్టు…
ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కు సాంగ్వి గ్రామంలో 700 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా 75 హెచ్పీ సామర్థ్యం గల 3 మోటర్లు బిగించారు. విద్యుత్ కనెక్షన్ కోసం ప్రత్యేకంగా 250 కిలోవాట్ల ట్రాన్స్ఫార్మర్ సైతం ఏర్పాటు చేసారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వార తోడిన నీళ్లను నిల్వ ఉంచేందుకు వీలుగా కొత్త సాంగ్వి గ్రామ శివారులో ఒక ట్యాంక్, దీపాయిగూడ వాగు ప్రాంతంలో మరో ట్యాంక్ నిర్మించారు. అయితే మోటర్ల నుండి ట్యాంక్ల వరకు నీళ్లను పంపించేందుకు చేన్ల నుండి సిమెంట్ పైప్లైన్లు వేసారు. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయినప్పటికీ కూడ వెట్రన్కు పైప్లైన్ సహకరించడం లేదని స్థానికులు చెబుతున్నారు. నీళ్లను విడుదల చేసేందుకు ప్రయత్నించిన ప్రతీసారి సిమెంట్ పైప్లైన్లు పగిలిపోతున్నాయనీ, నీళ్లు ట్యాంక్లకు చేరడం లేదని రైతులు వాపోతున్నారు. సిమెంట్ పైప్లైన్లు పగిలిపోతుండటంతో చేన్లలో నీళ్లు చేరి, పంటలు మునుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సిమెంట్ పైప్లకు బధులుగా స్టీల్ పైప్లు వేస్తేగానీ ఈ సమస్య పరిష్కారం అయ్యే ఆవకాశం లేదని రైతులు చెబుతున్నారు. కానీ అధికారులు మాత్రం ఇప్పటి వరకు పైప్లైన్ మార్చేందుకు ఎలాంటి ప్రతిపాదనలు సిద్ధం చేయలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో రూ. 6.13 కోట్ల ప్రజాధనం నీటిపాలు అయ్యిందని, వెంటనే అవసరమైన చర్యలు తీసుకొని లిఫ్ట్ ప్రాజెక్ట్ను ప్రారంభించాలని రైతులు వేడుకుంటున్నారు.
——————————————————————-
లిఫ్ట్ ఇరిగేషన్ను ప్రారంభించాలి…
దాదాపు రూ. 6కోట్లతో నిర్మించిన సాంగ్వి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వృథాగా మారింది. ప్రాజెక్ట్ పూర్తి అయినప్పటికీ కూడ సిమెంట్ పైప్లైన్ తరుచుగా పగిలిపోవడంతో, ఇంత వరకు ప్రాజెక్ట్ను ప్రారంభించలేదు. అధికారులు స్టీల్ పైప్లైన్ కోసం ప్రతిపాదనలు పంపించి, కొత్త పైప్లైన్ వేయించాలి. 700 ఎకరాల ఆయకట్టు కలిగిన ఈ ప్రాజెక్ట్ను ప్రారంభిస్తే వందలాది రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంది.
–విఠల్ రెడ్డి, సర్పంచ్, సాంగ్వి
——————————————————————-