సిరా న్యూస్,రంగారెడ్డి;
నిర్మాణంలో ఉన్న ఓ ఇల్లు కూల్చివేత పనులు చేస్తుండగా, ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల కూకట్పల్లి మూసాపేటలో మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్, తన పాత ఇంటిని బుధవారం కూల్చివేశారు. కూల్చివేతకు ముందు రోజే ఆ ఇంటిలో అద్దెకు ఉన్న అందరినీ ఇల్లు ఖాళీ చేయించారు. ఉదయం పాక్షికంగా కూల్చివేత పనులు చేపట్టగా, భోజన విరామ అనంతరం ఇంటిని పూర్తిగా కూల్చివేశారు. అయితే ఆ ఇంటిలో స్వామి రెడ్డి అనే వ్యక్తి అద్దెకు ఉండేవాడు. నిన్న మధ్యాహ్నం మద్యం మత్తులో ఖాళీ చేయించిన ఇంటికి వచ్చి అక్కడే నిద్ర పోయాడు. అతడు లోన ఉన్న విషయం తెలియకుండా ఇంటిని పూర్తిగా కూల్చివేయటంతో, స్వామి రెడ్డి శిథిలాల కింద పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృత దేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు .