సిరా న్యూస్,ఎమ్మిగనూరు;
కర్నూలు జిల్లా భగీరథ ఉప్పర/సగర సంఘం ఆధ్వర్యంలో సగరులు బయలుదేరి వెళ్లారు. దేశమంతా సగరులను ఒకే పేరుతో పిలవాలని,సగరులను కూడా రాజకీయంగా గుర్తించాలని ఢిల్లీ వేదికగా వీరు నినదించనున్నారు. భారతదేశంలో సగరులు 20 నుండి 25 కోట్ల మంది దాకా ఉన్నా సగరులకు ఎక్కడా రాజకీయ ప్రాతినిధ్యం లేదు. అరిచే వాడిది, కర్ర ఉన్నవాడిదే పెత్తనం అన్నట్లుగా ఉంటున్న సందర్భంలో మేము సైతం అంటూ వీరు హస్తిన వేదికగా పోరాటానికి సిద్ధమయ్యారు.భారతదేశం నలుమూలల నుండి ఈనెల 29న లక్షలాది మంది సగరులు హాజరయ్యే ఢిల్లీ రాంలీలా మైదానం సభకు చేరుకొని తమ హక్కుల కోసం వీరు నినదించనున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సగరులు ఉన్నా రాజకీయ పార్టీలు గుర్తించడం లేదని, ఓట్లు వేయడానికి తప్ప రాజకీయాలకు పనికిరామా అని వీరు ప్రశ్నిస్తున్నారు. ఇంకా మమ్మల్ని గుర్తించకపోతే ఇక సాగదు, సహించమని సగరులు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నుండి దాదాపు 100 మంది దాకా ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీకి వెళ్లిన వారిలో కర్నూలు జిల్లా భగీరథ ఉప్పర సగర సంగం జిల్లా అధ్యక్షుడు బి.సత్యన్న, ప్రధాన కార్యదర్శి యూకే వీరేంద్ర, సంఘం నాయకులు ఏపీ వీరన్న, రామచంద్ర, ఎమ్మిగనూరు సగర సంగం ప్రెసిడెంట్, టౌన్ బ్యాంక్ చైర్మన్ యుకె రాజు, సంగం మాజీ అధ్యక్షుడు డి రాముడు తదితరులు ఉన్నారు.