సిరా న్యూస్, జైనథ్:
29న కోర్ట ఓంకారేశ్వర ఆలయంలో ప్రాణప్రతిష్ఠాపన
+ ఉత్తర వాహిని పెన్గంగ తీరంలో నూతన ఆలయం
+ విగ్రహ ప్రతిష్ఠాపనకు సర్వం సిద్ధం
+ 28, 29 తేదీల్లో ప్రత్యేక పూజలు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని కోర్ట గ్రామంలో ఉత్తర వాహిని పెన్గంగ నదీతీరంలో వెలిసిన అతి ప్రాచీన శ్రీ ఓంకారేశ్వర ఆలయం ఎంతో ప్రసిద్ధి గాంచింది. ప్రతీ శివరాత్రికి వేలాదిగా భక్తులు తరలివచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఉత్తర దిక్కున ప్రవహించే పెన్గంగ నదీ తీరంలో వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఓంకారేశ్వర ఆలయం పక్కన ప్రస్తుతం నూతనంగా నిర్మించిన ఆలయంలో విగ్రహా ప్రతిష్ఠాపన చేపట్టనున్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు.
రెండు రోజుల పాటు ప్రత్యేక పూజలు…
ఆలయంలో నూతనంగా ప్రతిష్టించనున్న ఒంకారేశ్వర విగ్రహానికి ప్రాణప్రతిష్ఠాపన కోసం 28న గోపూజ, గురువందనము, గణపతి పూజ, పుణ్యావాచనము, దీక్షా«ధారణము, ఋత్విక్ వర్ణనము, యాగశాల ప్రవేశం, అంకురార్పన, ప్రతిష్ఠాంగదేవతా ఆహ్వానం, యజ్ఞ కుండ సంస్కారం, గణపతి హోమం, మంగళ హారతి, జల, ధాన్య, పుష్ప, శయ్యాధివాసములు, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ వంటి పూజాధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాగా 29న నిత్యపూజలు, యంత్రస్థాపన, వ్రిగ్రహాప్రతిష్ఠాపన, బలిహరణం, పూర్ణాహుతి, ఇత్యాది పూజలు నిర్వహించనున్నట్లు ప్రతిష్ఠాపకులు దూబే సాయికృష్ణ శర్మ తెలిపారు. 29న విగ్రహాప్రతిష్ఠాపన కోసం భక్తులంత పెద్ద ఎత్తున తరలివచ్చిన, స్వామి వారి కృపకు పాత్రులు కావాలని గ్రామస్తులు కోరుతున్నారు.