సిరా న్యూస్, జైనథ్:
రైతులను మోసం చేస్తే సహించేది లేదు
కల్లి బొల్లి మాటలతో కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేయ చూస్తే సహించేది లేదని బిఆర్ఎస్ నాయకులు సర్సన్ లింగారెడ్డి అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో నిలిచిపోయిన సోయా కొనుగోళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మద్దతు ధర ప్రకారం సోయా కొనుగోలు చేస్తామని హడావుడిగా సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, ఒక్క రోజులోనే కేంద్రాన్ని మూసివేయడం రైతులను మోసం చేయడమేనని అన్నారు. బిఆర్ఎస్ హయాంలో అధికారులు స్వయంగా రైతుల ఇండ్లకు వెళ్లి పంటలు కొనుగోలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. గతంలో రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మాయమాటలతో మోసం చేయడానికి ప్రయత్నిస్తోందని, గ్యారెంటీల అమలులో సైతం ఘోరంగా విఫలమైందని ఆయన దుయ్యబట్టారు. రైతులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని రైతుల పక్షాన పోరాడుతామని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట గిమ్మ ఎంపిటిసి కోల భోజన్న, నాయకులు మాదస్తు వెంకన్న, రైతులు, తదితరులు ఉన్నారు.