జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
జయశంకర్ భూపాలపల్లి;
జిల్లాలో పదవతరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. పదవతరగతి పరీక్షల నిర్వహణ పై గురువారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశపు హాలులో విద్యా, రెవిన్యూ, పోలీస్, పంచాయతి రాజ్, సమాచార, మున్సిపల్, విద్యుత్, వైద్య, రవాణా, పోస్టల్, ఆర్టీసీ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్థేశించిన షెడ్యూలు ప్రకారం పదోతరగతి పరీక్షలు నిర్వహించుటకు కట్టుదిటమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. జిల్లాలో మార్చి 18 నుండి ఏప్రిల్ 02 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఉదయం.9:30 నుండి మధ్యహం12:30 వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 117 పాఠశాలల నుండి 1781 బాలురు, 1766 మంది బాలికలు మొత్తం 3547 మంది విద్యార్ధులు పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారని చెప్పారు. ఇందుకు గాను జిల్లా వ్యాప్తంగా 20 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏప్రిల్ 1, 2 తేదీల్లో ఓకేనషల్ థియరీ పార్టు 1, 2 పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి 11.30 గంటల వరకు జరుగుతాయని చెప్పారు.
పరీక్షల నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ద వహించాలని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సక్రమంగా పరీక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్దులు పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకునేందుకు రూట్లు వారిగా అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ప్రశ్న పత్రాలు తరలింపుకు రెండు రూట్లుగా విభజించినట్లు చెప్పారు. ప్రతి పరీక్షా కేంద్రంలో అవసరమైన మౌలిక వసతులను కల్పించాలని చెప్పారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు
ఓఆర్ఎస్ ప్యాకేట్స్, అత్యవసర మందులను సిద్ధంగా ఉంచాలని వైద్య శాఖ అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాలలో సురక్షిత త్రాగు నీరు ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ,ఫ్యాన్లు, లైట్లు, వెలుతురు సక్రమంగా వుండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. గాలి, వెలుతురు వుండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీ.సీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రశ్న పత్రాలు తరలింపులో ఎస్కార్ట్ వాహనం ఏర్పాటు చేయాలని చెప్పారు. పరీక్ష ప్రశ్నపత్రాలను భద్రపరచుటకు పోలిస్ స్టేషన్ల లో తగిన ఏర్పాట్లు చేయాలని, ప్రశ్నపత్రాలను పరీక్షా కేంద్రాల వద్దకు తీసుకువెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చే టప్పుడు పటిష్ట పోలీసు బందోబస్తు కల్పించాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాలలో మాస్ కాపీయింగ్ మరియు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టు దిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, పరీక్షా కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు.
రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ప్లైయింగ్ స్వ్వాడ్ లను ఏర్పాటు చేసి పరీక్ష జరుగుతున్న తీరు పై నిఘా వుంచాలనీ పేర్కొన్నారు.
విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయలు వారికి మనోధైర్యాన్ని కల్పించాలన్నారు.
పరీక్ష నిర్వహణ అనంతరం పరీక్ష ప్రశ్న పత్రాలను పోలీసు బందోబస్తు తో తరలించాలని సమాధాన పత్రాలను పకడ్బందీగా సీల్ చేసి పోస్టల్ ద్వారా తరలించే ప్రక్రియ చేపట్టాలని అన్నారు. రవాణా సౌకర్యాలు సరిగా లేని పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సరైన సమయంలో చేరుకునే విధంగా బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు కలెక్టర్ సూచించారు. పరీక్షా కేంద్రాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రం చేయాలని చెప్పారు. పరీక్షలు వ్రాసే విద్యార్థులు పాటించాల్సిన నియమ నిబంధనలపై పరీక్షా కేంద్రాల్లో ఫ్లెక్సీ లు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు ను తనిఖీ చేసి నివేదికలు అందచేయాలని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అదనపు ఎస్పీ నరేష్ కుమార్ , జిల్లా విద్యాశాఖ అధికారి
రాం కుమార్, డిపిఅర్ఓ శ్రీనివాసరావు , డి.ఎం.హెచ్.ఓ డా.మధుసూదన్, రవాణా అధికారి సమదాని, ఆర్.టి.సి, పోస్టల్ అధికారులు, తదితరులు పాల్గోన్నారు.