సిరా న్యూస్,అనంతపురం;
అనంతపురం నగర శివారులోని గుత్తి రోడ్డులో ఉన్న డంపింగ్ యార్డ్ను కమిషనర్ మేఘ స్వరూప్తో కలిసి ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పరిశీలించారు. గురువారం రాత్రి డంపింగ్ యార్డ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే అనంత.. శుక్రవారం ఉదయాన్నే అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలను డంపింగ్ యార్డ్ వద్ద పని చేసే సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అగ్నిమాపక శాఖ అధికారులతో మాట్లాడారు. ఇక్కడ ఒకేసారి మంటలు చుట్టూ వ్యాపించడం పట్ల వారు అనుమానం వ్యక్తం చేశారు. కాగా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, బయటి వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని కమిషనర్ మేఘ స్వరూప్ సూచించారు. మంటలు అదుపులోకి వచ్చాయని, అయితే కింది భాగంలో అగ్ని కీలలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడా మంటలు చెలరేగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డంపింగ్ యార్డ్ వద్ద ఎలాంటి పరిస్థితి ఉన్నా తమకు సమాచారం అందించాలని ఎమ్మెల్యే అనంత, కమిషనర్ మేఘ స్వరూప్ తెలియజేశారు.