సిరా న్యూస్,హైదరాబాద్;
పట్టుదలతో ప్రయత్నిస్తే… ఏదైనా మన సొంతం అవుతుందని నిరూపించాడు మంచిర్యాల జిల్లాకు చెందిన ప్రవీణ్ అనే యువకుడు. నైట్ వాచ్ మెన్ గా పని చేస్తూనే… ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదించాడు. తాజా వెల్లడించిన గురుకుల ఫలితాల్లో టీజీటీ, పీజీటీతో పాటు జూనియర్ లెక్చరర్ ఉద్యోగానికి కూడా ఎంపికయ్యాడు. ఇప్పుడు ప్రవీణ్ ప్రస్థానం… సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ప్రవీణ్ కు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సూపర్ బ్రదర్ అంటూ పోస్టులు చూస్తున్నారు.ప్రవీణ్ ది మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొన్కల్ గ్రామం. ఓయూ క్యాంపస్ లో ఎంకాం, బీఈడీ, ఎంఈడీ పూర్తి చేశాడు. ప్రవీణ్ తల్లిదండ్రులు స్వగ్రామంలో పని చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తండ్రి మేస్త్రీ పని చేస్తుండగా… తల్లి బీడీ కార్మికులు. వారికి భారంగా కావొద్దని భావించిన ప్రవీణ్… ఓయూ క్యాంపస్ లో ఉన్న ఈఎంఆర్ సీలో నైట్ వాచ్ మెన్ గా చేరాడు. గత ఐదేళ్లుగా అక్కడ పని చేస్తూనే…. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నాడు. తన ఖర్చులు తల్లిదండ్రులకు భారం కావొద్దని భావించిన ప్రవీణ్… నైట్ వాచ్ మెన్ గా చేరాడు.ఇక ప్రవీణ్ ఎలాంటి కోచింగ్ లేకుండానే సొంతంగానే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యాడు. యూట్యూబ్ లోని కంటెంట్ ను సేకరిస్తూ తన సాధనకు మరింత పదును పెట్టాడు. 2018లో డీఎస్సీ పరీక్ష రాసిన ప్రవీణ్,,, కేవలం అర మార్కుతో ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత గ్రూప్ 2 కోసం కూడా చదివాడు. అయితే గురుకుల ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన ప్రవీణ్… ఏకంగా మూడు ఉద్యోగాలకు ఎంపికై తనకు తానే సాటి అని చాటిచెప్పాడు.ప్రవీణ్ మూడు ఉద్యోగాలకు ఎంపిక అవ్వటం పట్ల అతను వాచ్ మెన్ గా పని చేసిన EMRC ప్రాంగణం డైరెక్టర్ పి రఘపతి హర్షం వ్యక్తం చేశారు. అక్కడ పని చేస్తున్న ఇతర సిబ్బంది కూడా ప్రవీణ్ కు అభినందనలు తెలిపారు.