విజయవాడ, (సిరా న్యూస్);
చంద్రబాబు పొలిటికల్ యాక్షన్ లోకి దిగనున్నారా? పవన్ కళ్యాణ్ తో కలిసి సంచలనం సృష్టించనున్నారా? పొత్తు తర్వాత ఇరు పార్టీల అధినేతలు తొలిసారిగా బహిరంగ సభలో పాల్గొనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. చంద్రబాబు అరెస్టుతో దాదాపు మూడు నెలలు పాటు రాజకీయ కార్యకలాపాలకు దూరమయ్యారు. ఇటీవలే ఆయనకు రెగ్యులర్ బెయిల్ లభించింది. కానీ ఈ నెల 28 వరకు కోర్టు షరతులు ఉన్నాయి. అటు తర్వాత ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారు. అయితే ఈ ఎంట్రీ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సంచలన వేదిక కావాలని భావిస్తున్నట్లు సమాచారం.తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ప్రకటించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టు తర్వాత నేరుగా జైలుకెళ్ళి పరామర్శించి వచ్చిన తర్వాత పవన్ పొత్తు ప్రకటన చేశారు. తక్షణం ఉమ్మడి కార్యాచరణ ప్రారంభమవుతుందని ప్రకటించారు. రెండు పార్టీల మధ్య సమన్వయం, ఉమ్మడి మేనిఫెస్టో తదితర నిర్ణయాలతో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత పవన్ నేరుగా కలిశారు. కీలక చర్చలు జరిపారు.పలు అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ లభించడంతో పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబు రాజకీయ వ్యూహాలకు సిద్ధపడుతున్నారు. డిసెంబర్ మొదటి వారంలో భువనేశ్వరి సంఘీభావ యాత్రలు ప్రారంభం కానున్నాయి. అదే సమయంలో జనసేన ని పవన్ తో కలిసి భారీ బహిరంగ సభలకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు ఓ మూడు సభలు నిర్వహించి.. ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. మేనిఫెస్టో పై విస్తృత ప్రచారానికి రెండు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. సూపర్ టెన్ పథకాలతో ప్రజల ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యాయి.