– శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణ
– డయల్ యువర్ ఈవోలో ఎవి.ధర్మారెడ్డి
సిరా న్యూస్,తిరుమల;
వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో ముందుగా భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఫిబ్రవరి 16న తిరుమలలో నిర్వహించిన రథసప్తమి ఉత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఉదయం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులు సప్తవాహనాలపై శేషాచలాధీశుని వైభవాన్ని తిలకించి తరించారు.
– లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదాలు, టి, కాఫీ, పాలు, అల్పాహారాలు అందించాం.
తిరుమలలో వేసవి ఏర్పాట్లు :
-వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టాం.
– ఏప్రిల్ నుండి జూలై వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ విఐపి బ్రేక్, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్ సేవలు, రూ.300 దర్శన టికెట్లు తగ్గించాం.
– తిరుమలలో దాదాపు 7500 గదులు ఉన్నాయి. వీటిలో 45 వేల మందికి సరిపడా వసతి అందుబాటులో ఉంది. దాదాపు 85 శాతం గదులు సామాన్య భక్తుల కోసమే కేటాయిస్తున్నాం.
– వేసవిలో తిరుమలకు తరలివచ్చే వేలాది మంది భక్తులకు అవసరమైనంత వసతి సౌకర్యం లేనందున భక్తులు తిరుపతిలో వసతి పొందాల్సిందిగా కోరడమైనది.
శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణ
– తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వద్ద ఉన్న పాత మ్యూజియంలో ఫిబ్రవరి 29వ తేదీ నుండి భక్తులకు నిత్యాన్నదానాన్ని ప్రారంభించాం.
శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం :
-శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం(చిన్నపిల్లల గుండె ఆసుపత్రి) ప్రారంభమైన రెండేళ్ల కాలంలోనే 12 గుండె మార్పిడి ఆపరేషన్లు, 2485 గుండె ఆపరేషన్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యబృందాన్ని అభినందిస్తున్నాను.
శ్రీ పద్మావతి జనరల్ ఆసుపత్రి :
– స్విమ్స్కు అనుబంధంగా ఉన్న శ్రీ పద్మావతి జనరల్ ఆసుపత్రిలో మార్చి 1వ తేదీ నుండి గైనకాలజీ, ఒబెస్ట్రిక్స్, పీడియాట్రిక్స్, ఆప్తమాలజీ, ఇఎన్టి, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ విభాగాలలో నగదు రహిత వైద్యసేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
తిరుమలలో ఉత్సవాలు :
– మార్చి 20 నుండి 24వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.
– మార్చి 8న గోగర్భ తీర్థంలో క్షేత్రపాలకుడికి మహాశివరాత్రి పర్వదినం.
– మార్చి 25న తుంబురుతీర్థ ముక్కోటి.
ఫాల్గుణ మాస కార్యక్రమాలు :
– ఎస్వీ వేదవిశ్వవిద్యాలయంలో మార్చి 20న అమలక ఏకాదశి, మార్చి 25న లక్ష్మీ జయంతి, ఏప్రిల్ 2న శీతలాష్టమి పూజ నిర్వహిస్తాం. వీటిని ఎస్వీబీసీలో ప్రసారం చేస్తాం.
టీటీడీ ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు :
– మార్చి 8వ తేదీ వరకు శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో.
– మార్చి 1 నుండి 10వ తేదీ వరకు – తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో.
– మార్చి 8 నుండి 16వ తేదీ వరకు –
హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో.
– మార్చి 9 నుండి 17వ తేదీ వరకు – తొండమాన్పురంలోని శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో.
– మార్చి 16 నుండి 24వ తేదీ వరకు – తరిగొండలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో.
ఫిబ్రవరి నెలలో నమోదైన వివరాలు :
దర్శనం :
– శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య – 19.06 లక్షలు.
హుండీ :
– హుండీ కానుకలు – రూ.111.71 కోట్లు.
లడ్డూలు :
– విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య – 95.43 లక్షలు.
అన్నప్రసాదం :
– అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య – 43.61 లక్షలు.
కల్యాణకట్ట :
– తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య – 6.56 లక్షలు.
==============================