ఒంగోలు, (సిరా న్యూస్);
రానున్న ఎన్నికలలో ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఓటమి ఖరారైపోయిందని రాజకీయ వర్గాలు, సర్వేలూ బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. వైసీపీ ఓటమి తథ్యమన్న విషయం ఏపీలో ప్రజలకే కాదు.. వైసీపీ నేతలకు, పెద్దలకు కూడా అర్దమైపోయింది. సర్వేల ఫలితాలు, వైసీపీ అంతర్గత సర్వేలు, రహస్యంగా తెప్పించుకున్న ఇంటెలిజెన్స్ సర్వే, ప్రజలలో కనిపిస్తున్న అసంతృప్తితో తన ఓటమిని నిర్ధారించుకున్న వైపీసీ పెద్దలు ఇప్పుడు మాయ చేసి, కుట్రలు పన్నైనా గెలవాలని చూస్తోంది. అందుకోసం అవకాశాలను వెతుక్కుంటోంది. ఏపీలో పెద్ద ఎత్తున దోంగ ఓట్ల నమోదు, అసలు ఓట్ల తొలగింపు అంశంలో పెద్ద ఎత్తున గోల్ మాల్ జరిగిందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. దొంగ నోట్ల నమోదు, అసలు ఓట్ల నమోదు వ్యవహారంలో ఎన్నికల కమిషన్ ఏపీలో ఇద్దరు అధికారులను సస్పెండ్ కూడా చేసింది. అదలా ఉండగా, ఏపీలో అధికార వైసీపీ మరో కుట్రకు తెరలేపింది. అదే ఎన్నికల విధులలో తమకు అనుకూలంగా ఉండే అధికారుల నియామకం.నిజానికి ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీచర్లే కీలక బాధ్యతలు నిర్వహిస్తారన్న సంగతి విదితమే. అయితే ఈసారి ఏపీలో టీచర్లను ఎన్నికల విధుల నుండి తప్పించాలని వైసీపీ సర్కార్ ప్లాన్ చేసింది. ఇందు కోసం ప్రత్యేకంగా ఓ జీవోను కూడా తీసుకొచ్చింది. 2022 నవంబరు 29న విద్యా హక్కు చట్టంలోని నిబంధనలకు సవరణలు చేసి.. టీచర్లకు బోధన, విద్యా సంబంధిత అంశాలు మినహా ఎలాంటి బోధనేతర పనులు అప్పగించకూడదని జీవో తెచ్చింది. అలాగే ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకునే ఉద్యోగుల వివరాలను చెప్పాలని ఈసీ కోరగా.. వైసీపీ ప్రభుత్వం టీచర్ల మినహా.. ఇతర రంగాల ఉద్యోగులు, తాను నియమించుకున్న సచివాలయ ఉద్యోగులను కూడా ఎన్నికల ప్రక్రియలో పాలు పంచుకునేలా ప్రయత్నాలు చేసింది. దీంతో ఈసీ మరోసారి ప్రత్యేక ఉత్తర్వులను జారీచేసింది.