సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ లో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
– బైక్ ర్యాలీతో హోరెత్తించిన బిఆర్ఎస్, సీపీఐ శ్రేణులు
– ప్రధాని నరేంద్ర మోడీ ఆదిలాబాద్ కు ఓట్ల కోసమే వస్తున్నారని విమర్శ
ఈనెల 4న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదిలాబాద్ కు వస్తున్న సందర్భంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ నాయకత్వంలో బిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నల్ల జెండాలతో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. సిపిఐ, ఇతర సంఘాల నాయకులతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ… పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండతంతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదిలాబాద్ కు వస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి ఆదిలాబాద్ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు. కేవలం ఓట్లు అడగడానికి మాత్రమే ప్రధానమంత్రి ఆదిలాబాద్ కు వస్తున్నారని ఇలాంటి ఓటు బ్యాంకు రాజకీయాలను బీజేపీ మానుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఆదిలాబాద్ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే వేల మంది యువతకు ఉపాదినిచ్చే సీసీఐ ఫ్యాక్టరీ వెంటనే పునః ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అదిలాబాద్-ఆర్మూర్ రైల్వే లైన్, ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ పనులు ప్రారంభించాలని అన్నారు. దీంతో పాటు ఆదిలాబాద్ కు గిరిజన యూనివర్సిటీ, టెక్స్ట్ టైల్ పార్క్ సైతం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.