న్యూ డిల్లీ ,(సిరా న్యూస్);
చైనాలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్కడ నెలకొన్న తాజా పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశారు చైనాలో కేసుల పెరుగుదల వల్ల భారత్కు వచ్చే ప్రమాదమేమీ లేదని స్పష్టం చేశారు. అయితే, ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రజారోగ్యం, ఆసుపత్రి సంసిద్ధత చర్యలను వెంటనే సమీక్షించాలని ఆదేశించారు.చైనా పరిస్థితులు ఇక్కడ సంభవిస్తే తీసుకోవాల్సిన చర్యలు, ఇతర ఏర్పాట్లపై సమీక్ష చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించారు. ఆసుపత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్ సదుపాయాలు, టెస్టింగ్ కిట్లు వంటివి తగినన్ని అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, ఇన్ ఫ్లుయెంజా వైరస్లతో బాధపడేవారి నమూనాలను ల్యాబ్స్కు పంపించాలని సూచించారు. మూడేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి కి పుట్టినిల్లయిన చైనా లో మరో కొత్త వైరస్ వ్యాప్తి ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. చైనాలో మైకోప్లాస్మా న్యుమోనియా ఇన్ఫ్లుయెంజా కేసులు ఒక్కసారిగా పెరిగిన విషయం తెలిసిందే. అక్కడి బడుల్లో ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. బీజింగ్, లియోనింగ్ నగరాల్లోని దవాఖానలు బాధిత చిన్నారులతో కిక్కిరిసిపోతున్నాయి. అక్కడ తాజా పరిస్థితులు మునుపటి కరోనా సంక్షోభాన్ని గుర్తుకుతెస్తున్నాయి.