సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఎస్సీ, ఎస్టీలకు బాలూరి క్షమాపణలు చెప్పాలి
ఎస్సీ, ఎస్టీ సమాజానికి డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో అట్రాసిటీ కేసులు నమోదు చేస్తామని ఆదిలాబాద్ ఏఎంసీ మాజీ చైర్మెన్ మెట్టు ప్రహ్లాద్ హెచ్చరించారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి జోగు రామన్న హయాంలోనే ఎస్సీ, ఎస్టీలకు మార్కెట్ కమిటీ చైర్మెన్ పోస్టులు దక్కాయని, అది ఓర్వలేకనే బాలూరి గోవర్ధన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జోగు రామన్న మార్కెట్ పదవులు అమ్ముకున్నారని అరోపించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బాలూరి ఇలాంటి చౌకబారు ఆరోపణలు మానుకోవాలని, లేని పక్షంలో వెంటనే తన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేసారు. పార్టీ ఫిరాయింపులు, బ్లాక్ మెయిలింగ్లతో లక్షలు సంపాదించిన వ్యక్తిగా విమర్శలు మూటగట్టుకున్న వ్యక్తి బాలూరి గోవర్ధన్ రెడ్డి ఇలాంటి విమర్శలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు గుర్తింపు లేకపోవడంతోనే ఫ్రస్టేషన్లో నోటికివచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసారు. భవిష్యత్తులో ఇలాంటి ఆరోపణలు చేస్తే, తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మెన్ కుమ్ర రాజు, నాయకులు జగదీష్, విజ్జగిరి నారాయణ, రాజన్న, వేణు యాదవ్, పరమేశ్వర్, సతీష్, తదితరులు ఉన్నారు.