సిరా న్యూస్, కళ్యాణదుర్గం
ప్రభుత్వ ఆస్తులు తాకట్టుపెట్టే హక్కు లేదు
పరిశ్రమలు లేవు.. ఉన్న పరిశ్రమలు వెనక్కి
* వైసీపీ హయంలో మహిళలపై అరాచకాలు
* నిజం గెలవాలి కార్యక్రమంలో నారా భువనేశ్వరి
* మూడు కుటుంబాలకు పరామర్శ
* ప్రాణాలర్పించే కార్యకర్తలు టీడీపీకి మాత్రమే: టిడిపి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు
సచివాలయాన్ని కూడా తాకట్టుపెట్టి ఈ ప్రభుత్వం చివరకు ప్రజలను అడుక్కునే స్థాయికి తీసుకెళ్తుందని టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఆమె పర్యటించారు.చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక కళ్యాణదుర్గం మండల పరిధిలో మృతి చెందిన ముగ్గురు కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శించారు. ముందుగా ఎం.కొండాపురం గ్రామానికి రాగా కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఘన స్వాగతం పలికారు. వందలాదిగా కార్యకర్తలు నాయకులు తరలివచ్చారు. గత ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన మరణించిన నారాయణప్ప కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. నారాయణప్ప చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడారు మీ కుటుంబానికి పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఆ తర్వాత ముద్దినాయనపల్లిలో పార్టీకార్యకర్త తలారి శ్రీరాములు కుటుంబాన్ని పరామర్శించారు. ఏడాది సెప్టెంబర్ 11వ తేదీన శ్రీరాములు గుండెపోటుతో మరణించారు. ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం చేసి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం ఎం.కొత్తూరు గ్రామంలో పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గత ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన పోతురాజుల పోతన్న మరణించారు. ఆ కుటుంబాన్ని పరామర్శించి 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు మీ కుటుంబానికి ఎప్పుడూ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత కళ్యాణదుర్గంలో ప్రజా వేదిక వద్దకు నారా భువనేశ్వరి వచ్చారు. అక్కడ వందలాదిగా తరలివచ్చిన మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలన్న ఉద్దేశంతో చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో నిర్బంధించారని అన్నారు. జైల్లో ఆ కష్ట సమయంలో తెలుగు ప్రజలంతా మాకు అండగా ఉన్నారన్నారు. అయితే చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక 206 ప్రాణాలు కోల్పోవడం తమను తీవ్రంగా కలచి వేసిందన్నారు. తమ కుటుంబం పై చూపిన ప్రేమను ఎప్పటికీ మరువలేమన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించారని ఆ సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించి మనం ఉన్నామనే ధైర్యం ఇవ్వాలని సూచించినట్లు తెలిపారు. అందుకే ఎప్పుడూ బయటికి రాని నేను కూడా ప్రజల మధ్యకు వచ్చానన్నారు. మీరు ఉన్నారన్న ధైర్యంతోనే అడుగులు ముందుకు వేశానని ఈ సందర్భంగా భువనేశ్వరి అన్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల మహిళలపై అరాచకాలు జరుగుతున్నాయని కొన్ని సంఘటనలో గురించి భువనేశ్వరి వివరించారు. కేవలం మీరు అడిగినందుకు మహిళ కళ్లు పీకేసారని… మరికొన్ని చోట్ల దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టు సమయంలో మహిళలు పోరాడుతుంటే పోలీసులు వారిని నిర్దాక్షణంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. వైసిపి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఒక పరిశ్రమ కూడా రాలేదని.. అమర్ రాజా బ్యాటరీస్ లాంటి పరిశ్రమలు కూడా ఈ ప్రభుత్వ అరాచకాలకు తట్టుకోలేక వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ అరాచక ప్రభుత్వం పోవాలంటే ఓటు అనే ఆయుధం మాత్రమే మన వద్ద ఉందని గుర్తు చేశారు మీరు ఓటు వేసే సమయంలో ఎవరికి వేస్తున్నామన్నదిఆలోచించుకోవాలన్నారు. మరోవైపు కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్చార్జ్ సురేంద్రబాబు మాట్లాడుతూ పార్టీ కోసం ప్రాణాలర్పించే కార్యకర్తలు ఒక తెలుగుదేశానికి మాత్రమే ఉన్నారని అన్నారు. మరో 50 రోజులు అలుపెరగకుండా పనిచేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన అన్ని మండలాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.