సిరా న్యూస్,విజయవాడ;
రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో అధికార వైసిపి అడుగులు వేస్తోంది. వై నాట్ 175 అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి వార్ డిక్లేర్ చేస్తే.. వై నాట్ పులివెందుల అంటూ తెలుగుదేశం పార్టీ జనసేన కూడా యుద్ధానికి సిద్ధం అంటోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు గేర్పే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. రానున్న ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడంతో వైసిపి ముఖ్య నేతలు అస్త్ర, శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఒకవైపు ఎన్నికల వ్యూహాలను రచించుకుంటూనే.. మరోవైపు సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు. గత కొన్నాళ్ల నుంచి రాజకీయంగా కీలక పదవులను అనుభవించిన ఎంతోమంది నేతలు.. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ జాబితాలో వైసీపీకి చెందిన సీనియర్ నేతలు ఉండడం గమనార్హం. వైసీపీలో సీనియర్ నేతలుగా చలామణి అవుతున్న పలువురు రానున్న ఎన్నికలు నేపథ్యంలో సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవే తమ చివరి ఎన్నికలు అంటూ ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారు. చివరి ఎన్నికలు అని చెబుతున్న వారిలో సీనియర్ నేతలు ఉండడం గమనార్హం. ఈ జాబితాలో సీనియర్ మంత్రులుగా కొనసాగుతున్న బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన కొడాలి నాని ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నేతలు తమ రాజకీయ భవిష్యత్తుపై వ్యాఖ్యలు చేస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆదివారం కళింగ కోమట్లతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు రానున్న ఎన్నికలే చివరివని, మరోసారి అవకాశాన్ని కల్పించాలని కోరారు. ఈ ఎన్నికల్లోనే తాను రిటైర్ కావాలని భావించాలని, జగన్, తన కుమారుడి ఒత్తిడితోనే పోటీలోకి మళ్ళీ దిగుతున్నట్లు పేర్కొన్న ధర్మాన.. వచ్చే ఎన్నికల నాటికి తాను రాజకీయాల్లో ఉండనని స్పష్టం చేశారు. పార్టీ కష్ట కాలంలో వదిలేసాను అన్న అపవాదు తనపై రాకూడదు అన్న ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నట్లు వివరించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో వైశ్యుల అభ్యున్నతికి ఎంతో కృషి చేశానని, చివరిసారిగా తనకు మరొక అవకాశాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా ధర్మాన విజ్ఞప్తి చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాజకీయాల్లో కొనసాగడం పై ధర్మాన చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తిని రేపాయి. వైసీపీలో సీనియర్ నేతగా ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇదే తరహాలో మాట్లాడడం గమనార్హం. సోమవారం సాయంత్రం విశాఖలో మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స.. తనకు రానున్న ఎన్నికలే చివరివని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల తర్వాత ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగం ఉన్నట్లు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఓటమి భయం ఉన్నవారే తరచూ నియోజకవర్గాలు మారుతారు అంటూ గంటాపై సెటైర్లు విసిరిన మంత్రి బొత్స.. 2029 ఎన్నికల నాటికి మాత్రం పోటీలో ఉండబోనని స్పష్టం చేశారు. వయసు పైబడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ నేతగా పేరుగాంచిన కొడాలి నాని కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. గడిచిన నాలుగు ఎన్నికల్లో విజయాలు సాధిస్తూ వస్తున్న కొడాలి నాని.. వచ్చే ఎన్నికల్లోను విజయమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రస్తుతం తనకు 53 ఏళ్లు వచ్చాయని, 2029 నాటికి 58 ఏళ్లు వస్తాయన్నారు. 58 ఏళ్ల వయసులో పోటీ చేయలేమని, ఈ ఎన్నికల తనకి చివరవని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైసీపీ నేతలు చేస్తున్న తాజా వ్యాఖ్యలు.. రాజకీయంగా సెంటిమెంట్ రగిలించేందుకే చేస్తున్నారా, లేక నిజంగానే ఎన్నికల బరిలో నుంచి తప్పించుకునే ఉద్దేశంతోనే అంటున్నారా అన్నది ఆ నేతలకే తెలియాల్సి ఉంది. వైసిపి ముఖ్య నేతలు ఈ తరహా ప్రకటనలు పట్ల టిడిపి, జనసేన నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు.రలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గం నుంచే పోటీచేస్తున్నానని మాజీమంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఎన్నికలే తనకు చివరివన్నారు.. ఆ తర్వాత తన కుమారుడు పోటీ చేస్తారన్నారు. నగరంలోని పేదలకు ఇంటిస్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాయి. దీంతో ఆయన ఒంగోలు వచ్చిన బాలినేనికి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఒంగోలు నియోజకవర్గ పరిధిలో పేదలందరికీ పట్టాలు ఇచ్చాక ఒంగోలు నుంచి పోటీచేస్తానని లేకపోతే చేయబోనని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు.నగర పాలక సంస్థ పరిధిలో వెంగముక్కలపాలెం, ఎన్.అగ్రహారం ప్రాంతాల్లో రైతుల నుంచి భూసేకరణ చేస్తున్నట్లు చెప్పారు బాలినేని. అందుకోసం గతంలో రూ.30కోట్లు ఇవ్వగా.. ప్రస్తుతం రూ.180 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వచ్చే నెల 10వ తేదీలోపు 25వేల మంది పేదలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు. గతంలో ఒంగోలు నుంచి ఎంపీగా మాగుంట, ఎమ్మెల్యేగా తాను పోటీచేస్తానని చెప్పానని.. మాగుంట సీటు విషయంలో చర్చలు కొనసాగుతున్నాయన్నారు. బాలినేని ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేశారు.
=========================
02 ఏ పార్టీ అయినా బలిజలకే ప్రాధాన్యం
తిరుపతి, మార్చి 13, (న్యూస్ పల్స్)
ఆధ్యాత్మిక నగరం తిరుపతి బలిజలకు సెంటిమెంట్గా మారింది. పొత్తుల చిక్కుతో తిరుపతి టికెట్ ఎవరికన్న దానిపై అయోమయం నెలకొంది. వైసీపీ ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ కు టికెట్ కేటాయించగా, ప్రత్యర్థిగా బలిజ సామాజిక వర్గం నుంచి అభ్యర్థి ఉండాలన్న డిమాండ్ను ఆ సామాజిక వర్గం బలంగా వినిపించే ప్రయత్నం చేస్తోంది. బలిజ సామాజిక వర్గం ప్రభావితం చూపే తిరుపతి అసెంబ్లీలో పట్టు సాధించాలని బలిజ సామాజిక వర్గం ప్రయత్నిస్తుంది.రాయలసీమలో అత్యంత ప్రాధాన్యత ఉన్న తిరుపతి లాంటి కేంద్రంలో బలిజ సామాజిక వర్గం తమ రాజకీయ ఆధిపత్యం ఉండాలని కోరుకుంటోంది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజారాజ్యం ఆవిర్భావం తిరుపతి వేదిక జరగా ఆ పార్టీ అధ్యక్షుడిగా చిరంజీవికి తిరుపతి రాజకీయ బిక్ష పెట్టింది. బలిజ సామాజిక వర్గం చిరంజీవిని సొంతం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బలిజ సామాజిక వర్గం నేత పట్టు సాధించలేకపోగా 2014 ఎన్నికల్లో తిరిగి బలిజ సామాజిక వర్గానికి తిరుపతి ఎమ్మెల్యే పీఠం దక్కింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలుతో బలిజలకు తిరుపతిలో ప్రాధాన్యత తగ్గిందన్న అభిప్రాయం చర్చగా మారింది. ఈ నేపథ్యంలో బలిజలకు 2024 సార్వత్రిక ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. 40 వేలకు పైగా ఓటర్లు ఉన్న తిరుపతి నుంచి పోటీ తీసేందుకు బలిజ సామాజిక వర్గంలో పోటీ తీవ్రంగానే ఉంది. టిడిపి అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆ పార్టీ ఇన్చార్జిగా ఉన్న సుగుణమ్మతో పాటు అర డజను మంది ఆశావాహులు బరిలో నిలిచారు. టిడిపి నుంచి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, కోడూరు బాలసుబ్రమణ్యం, ఊకా విజయ్ కుమార్, జెబీ శ్రీనివాస్ తో పాటు పలువురు టికెట్ ను ఆశిస్తున్నారు. అయితే పొత్తులో భాగంగా తిరుపతి లో పోటీకి టిడిపికి ఛాన్స్ ఉండదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.జనసేన బరిలో ఉంటే ఆ పార్టీ నుంచి టికెట్ను ఆశిస్తున్న వారిలో తిరుపతి జనసేన ఇన్చార్జ్ కిరణ్ రాయల్, చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ పోటీ పడుతున్నారు. తిరుపతిలో వైసీపీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా జనసేన ఇన్చార్జిగా కిరణ్ రాయల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటమే సాగుతోంది. గత 5 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తనకే అవకాశం దక్కుతుందన్న ఆశతో కిరణ్ రాయల్ టికెట్ కోసం ప్రయత్నిస్తుండగా జనసేన హై కమాండ్ ఆర్థికంగా బలమైన నేత కోసం ప్రయత్నిస్తోంది. పక్కా జిల్లా బలిజల కోసం పావులు కలుపుతోంది. ఇందులో భాగంగానే వైసీపీకి రాజీనామా చేసిన చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసుల పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరో ఒకరిద్దరి పేర్లను కూడా జనసేన పరిశీలిస్తుండడంతో తిరుపతిలోని స్థానిక బలిజలు ఏకమవుతున్నారు. టిడిపి నుంచైనా లేదంటే జనసేన నుంచైనా బరిలో ఉండాల్సింది బలిజలేనని, ఆ ఛాన్స్ స్థానిక బలిజలకే దక్కాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే బలిజ సేన ఆధ్వర్యంలో మన బలిజ మన తిరుపతి పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించ బోతున్నారు. ఎన్నికల్లోను ఏ పార్టీ అయినా స్థానిక బలిజలకే ఛాన్స్ ఇవ్వాలన్న డిమాండ్ బలిజ సంఘం నేతలు వినిపిస్తుండగా మరోవైపు టిడిపి జనసేన లోని బలిజ సంఘం నేతలకు ఆయా పార్టీల హై కమాండ్ నుంచి ఇప్పటికే పిలుపు వచ్చింది. స్థానిక బలిజలకే టికెట్ కేటాయించాలన్న డిమాండ్ ను పరిగణలోకి తీసుకుంటున్న టిడిపి, జనసేన అధిష్ఠానం స్థానిక నేతలతో భేటీకి అవకాశం ఇవ్వడం చర్చగా మారింది. తిరుపతి బలిజల డిమాండ్ మేరకే స్థానికులకు తిరుపతి టికెట్ దక్కుతుందా లేదంటే బలమైన బలిజ సామాజిక వర్గం అభ్యర్థి కోసం వేట కొనసాగిస్తున్న పార్టీలు ఇతర ప్రాంతాల వారికి అవకాశం కల్పిస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది..!
==============================
03 ప్రచార రధంలో రెండు బాక్సులు
నెల్లూరు, మార్చి 13, (న్యూస్ పల్స్)
ఏపీలో టీడీపీ, జనసేనతో పొత్తు ఖరారు కావటంతో ఏపీ బీజేపీ ఎన్నికల మూడ్లోకి వచ్చేసింది. ఇప్పటి వరకూ పొత్తులు ఉంటాయా, లేదా ఒంటరి పోరా అనే సందేహంలో కొట్టుమిట్టాడిన ఏపీ బీజేపీ నేతలు.. ఇక విజయమే లక్ష్యంగా కార్యాచరణ ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. ఓ వైపు కూటమిలోని ఇతర పార్టీలను సమన్వయం చేసుకుంటూనే తమదైన గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నాల్లో పడ్డారు. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పురంధేశ్వరి మ్యానిఫెస్టో రూపకల్పన కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను వివరించారు.మ్యానిఫెస్టో తయారీలో ప్రజలను భాగస్వామ్యం చేయనున్నట్లు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ప్రచార రథాల్లో ప్రజల అభిప్రాయ సేకరణ పత్రాలను బాక్స్లో ఉంచుతామని పురంధేశ్వరి తెలిపారు. “ప్రచార రథాలలో రెండు బాక్సులు ఉంటాయి. ఒక బాక్సులో కేంద్రంనుంచి మీరేమీ ఆశిస్తున్నారో అభిప్రాయాలు సేకరిస్తాం. మరో బాక్సులో రాష్ట్రం కోసం ఏం కావాలో అభిప్రాయాలు సేకరిస్తాం. కోటిమంది నుంచి అభిప్రాయాలు సేకరించడమే లక్ష్యం. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మ్యానిఫెస్టోలో చేరుస్తాం” అని పురంధేశ్వరి వివరించారు.జాతీయస్థాయి మేనిఫెస్టో, అదేవిధంగా రాష్ట్రస్థాయి కి విడివిడిగా ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తామన్న పురంధేశ్వరి.. ఏపీవ్యాప్తంగా 45వేల కుటుంబాల నుంచి అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇదే సమయంలో టీడీపీతో పొత్తుపైనా పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తు ఖరారైందనీ, ఎన్నిసీట్లు, ఎక్కడనుంచి పోటీ అనేది రెండు రోజుల్లో తేలిపోతుందని చెప్పారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసమే పొత్తులన్న పురంధేశ్వరి.. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు. అంతటి రాముడే ఉడత సాయం తీసుకున్నారన్న పురంధేశ్వరి.. రాముడు అంతటి వాడు సహకారం తీసుకోగా, బీజేపీ తీసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయానికైనా అందరూ కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.
===============
04 పీలేరులో మూడోసారి విజయం ఎవరది
తిరుపతి, మార్చి 13, (న్యూస్ పల్స్)
పీలేరు నియోజకవర్గానికి రాజకీయాల్లో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నియోజకవర్గంలో ప్రశాంత రాజకీయం జరుగుతుందని అన్ని పార్టీల నాయకులు చెప్పే మాట. ఈ నేపథ్యంలో రెండు పార్టీలకు చెందిన నాయకులు ఏ పార్టీ వైపు మగ్గు చూపుతారో వేచి చూడాలి ఉంది. ఒక నాయకుడు మూడోసారి విజయం సాధించాలని చూస్తుంటే… మరో నాయకుడు మూడోసారి అయిన విజేతగా నిలవాలని ఉన్నారు.పీలేరు నియోజకవర్గం 1965లో ఏర్పడింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా ప్రస్తుతం అన్నమయ్య జిల్లాకు విభజనలో వెళ్లింది. పీలేరు శాసన సభ నియోజకవర్గం రాజంపేట లోక్ సభ పరిధిలోకి వస్తుంది. ఇందులో పీలేరు, వాల్మీకిపురం (వాయల్పడు), గుర్రంకొండ, కలికిరి, కలకడ, కంభంవారిపల్లి మండలాలు ఉన్నాయి.ప్రస్తుతం ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి. రాష్ట్ర విభజనకు ముందు ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేశారు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డిపై గెలుపొందారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో అదే ప్రత్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పై రెండోసారి విజయం సాధించారు. రాబోయే ఎన్నికల్లో ఇప్పటి వరకు వైసీపీ అభ్యర్థి ప్రకటన చేయలేదు. ఆయన తరువాత ఆ స్థాయి నాయకులు లేరని.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సన్నిహితుడని.. తప్పకుండా ఆయనకే సీటు ఇస్తారని అంటున్నారు. ఆయనకే సీటు ఇస్తే మూడోసారి ఎమ్మెల్యే అవుతారా.. వాల్మీకిపురంలో సాయిబాబా ఆలయం నిర్మించిన ఎమ్మెల్యే… ట్రస్ట్ తరపున నిత్య అన్నదానం, వైద్య శిబిరాలు వంటి సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారని ప్రచారం ఉంది. గత 4 ఏళ్లుగా గ్రామస్థాయిలో ఆయన పేరు చెప్పి అనుచరులు కబ్జాలు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సుమారు వెయ్యి కోట్ల మేర ప్రభుత్వ భూముల అమ్మకాలు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా తీరుపై ప్రజలు అసహనం ఉందని అంటున్నారు. పీలేరు నియోజకవర్గంలో నల్లారి కుటుంబ అంటే తెలియని వారు ఉండరు. ప్రజలు అందరిని పేరు పెట్టి పిలిచి మరీ మాట్లాడే చనువుగా ఉంటారని అంటారు. వీరి కుటుంబం రాజకీయాల్లో చెరగని ముద్ర వేసింది. అయితే 2014 ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి సొంతంగా పార్టీ పెట్టి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో పీలేరు నుంచి కిషోర్ కుమార్ రెడ్డి ఓడిపోయారు. తరువాత టీడీపీలో చేరిన అదే పరిస్థితి ఎదురైంది. అయినప్పటికీ రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. మూడోసారి అయిన విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని ఇప్పటికే ప్రకటించారు.ఈ నియోజకవర్గంలో ముస్లింల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాష్ట్ర రాజకీయాలకు సంబంధం లేకుండా కేవలం నియోజకవర్గంలోనే రాజకీయం చేస్తారు. 2సార్లు గెలిచిన వైసీపీకి… ఈసారి టీడీపీ గట్టి పోటీ ఇస్తుందా అని చర్చ నడుస్తోంది. నియోజకవర్గంలో జనసేన ప్రభావం స్వల్పంగా ఉంటుంది. మరోవైపు బీజేపీతో పొత్తు అదే పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి ఉండటం కలిసి వస్తుందని టీడీపీ శ్రేణులు ఆశాభావంతో ఉన్నాయిు.
=========================
05 నెల్లూరులో చేతులు కలిపిన బొల్లినేని, కాకర్ల..
నెల్లూరు, మార్చి 13, (న్యూస్ పల్స్)
ల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం విషయంలో చంద్రబాబు వ్యూహం వర్కవుట్ అయ్యేలా ఉంది. స్థానికంగా వైరి వర్గాలుగా ఉన్న ఇద్దర్ని ఆయన ఒక దగ్గరకు చేర్చారు. పార్టీ గెలుపుకోసం పనిచేయాలని సూచించారు. కేవలం సూచనే కాదు, అందులో ఒకరికి పార్టీలో కీలక పదవి కూడా ఇచ్చారు. ఇంకేముంది ఆయన మెత్తబడ్డారు. టికెట్ తనకు రాకపోయినా పర్లేదంటూ సైలెంట్ అయ్యారు. దీంతో టికెట్ దక్కించుకున్న వారికి లైన్ క్లియర్ అయింది. చంద్రబాబు చాణక్యాన్ని నెల్లూరు జిల్లా నాయకులు మెచ్చుకుంటున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 2019లో వైసీపీ గెలిచింది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచినా కాలక్రమంలో ఆయన టీడీపీలో చేరారు. ఆల్రెడీ అక్కడ టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు పార్టీలోనే ఉన్నారు. అయితే గియితే వారిద్దర్లో ఒకరికి టికెట్ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ చంద్రబాబు అనూహ్యంగా అక్కడ ఓ ఎన్నారైని తెరపైకి తెచ్చారు. కాకర్ల సురేష్ అక్కడ టీడీపీ టికెట్ దక్కించుకున్నారు, ప్రచారం మొదలు పెట్టారు. వైసీపీనుంచి వచ్చి చేరిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ టికెట్ లేకపోవడంతో దిగాలు పడి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇక బొల్లినేని రామారావు మాత్రం తనకు టికెట్ రాకపోవడంతో అలకబూనారు, కాకర్ల సురేష్ ని ఓడించి తీరతానంటూ ప్రతిజ్ఞ చేశారు. అక్కడితో టికెట్ దక్కిన సంతోషం కూడా కాకర్లకు లేకుండా పోయింది. మాజీ ఎమ్మెల్యే, తనకంటే ముందు టీడీపీ అభ్యర్థిగా చెలామణి అయిన బొల్లినేనితో వైరం తనకు మంచిది కాదని ఆయన కూడా కాస్త సైలెంట్ గా ఉన్నారు. బొల్లినేనిపై ఎక్కడా మాట తూలలేదు, ఆయన్ను విమర్శించలేదు. దీంతో చివరకు పంచాయితీ చంద్రబాబు వద్దకు చేరింది. ఇక్కడ చంద్రబాబు తన చాణక్యాన్ని ప్రదర్శించారు. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకి టీడీపీ జాతీయ ఉపాధ్యక్ష పదవిని ఇచ్చారు. ఢిల్లీలో పార్టీ వ్యవహారాలు చక్కబెట్టాలని సూచించారు. ఆ పదవి వల్ల ఉపయోగం ఉన్నా లేకపోయినా బొల్లినేని కాదనలేకపోయారు. జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు చంద్రబాబుకు థ్యాంక్స్ చెప్పి ఉదయగిరికి వచ్చేశారు.ఇక ఉదయగిరిలో సీన్ మారింది. టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్.. బొల్లినేని రామారావుని కలసి అభినందనలు తెలిపారు. ఆయనకు పార్టీ జాతీయ ఉపాధ్యక్ష పదవి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆయనకున్న రాజకీయ అనుభవాన్ని జోడించి ముందుకు నడిపించాలని కోరారు. నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశం కూడా బొల్లినేని రామారావు ఆధ్వర్యంలో జరగడం విశేషం. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని 8 మండలాలకు సంబంధించిన కన్వీనర్ లు మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు జాతీయస్థాయిలో పదవి రావడం పట్ల నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తానన్నారు బొల్లినేని. తన అనుచరులు, అభిమానులు కూడా తనమాటపైనే ఉండాలని, పార్టీకోసం పనిచేయాలని ఆదేశించారు. ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిని గెలిపించి చంద్రబాబుకి ఆ విజయాన్ని బహుమతిగా ఇస్తామన్నారు. మొత్తానికి ఇద్దరు నేతలు చేతులు కలపడంతో ఈ కథ సుఖాంతమైనట్టు తెలుస్తోంది.
=========================
06 రాపాక… యూ టర్న్…
కాకినాడ, మార్చి 13, (న్యూస్ పల్స్)
గత ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. కనీసం పవన్ పై కృతజ్ఞతా భావం చూపకుండా వైసిపిలోకి ఫిరాయించారు. గత ఐదేళ్లుగా వైసీపీ ఎమ్మెల్యే గానే చలామణి అయ్యారు. కనీసం జనసేన బీఫారంపై గెలిచానని కూడా ఆయనకు గుర్తులేదు. తన అధినేత పవన్ కాదు జగన్ అన్నట్టు ప్రవర్తించారు. జగన్ పై ప్రత్యేకతలు విమర్శిస్తే.. సొంత పార్టీ ఎమ్మెల్యేల కంటే వరప్రసాద్ ఎదుర్కొనేవారు. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపించేసరికి జగన్ రాపాకను సైడ్ చేశారు. రాజోలు అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదు. అమలాపురం ఎంపీగా పోటీ చేయాలని సూచించారు. దీంతో అయిష్టత గానే మొగ్గు చూపారు రాపాక. రోజులు గడుస్తున్న కొలది నాకు అమలాపురం టికెట్ వద్దు.. రాజోలే ముద్దు అంటూ తేల్చి చెబుతున్నారు. నాకు గానీ అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వకుంటే రాజోలు నియోజకవర్గం లో వైసీపీ ఓడినట్టేనని తేల్చి చెబుతుండడంతో వైసిపి అధినేత జగన్ మైండ్ బ్లాక్ అవుతోంది.గత ఎన్నికల్లో జనసేన 135కు పైగా స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. పవన్ అయితే రెండు చోట్ల పోటీ చేశారు. కానీ రెండు చోట్ల ఓడిపోయారు. ఇలా అధినేత ఓడిపోయినా రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ గెలుపొందారు. అయితే పార్టీకి ఒకే ఒక ఎమ్మెల్యేగా గుర్తింపు పొందినా..దానిని కూడా వదులుకున్నారు రాపాక. ఎన్నికల అనంతరం ఆరు నెలలకే వైసీపీ గూటికి చేరారు. తనను గెలిపించిన జనసైనికులను విడిచిపెట్టారు. తనకు వైసీపీలో గుర్తింపు ఉందని భావించారు. అటు జగన్ సైతం రాపాక వరప్రసాద్ ను ప్రోత్సహించారు. దీంతో తనకు ఎన్నికల్లో తిరుగు లేదని.. మరోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని రాపాక ధీమా వ్యక్తం చేశారు. అయితే ఆయన ఒకటి తెలిస్తే.. జగన్ మరోలా తలిచారు. రాజోలు టిక్కెట్ ఇవ్వనని తేల్చేశారు. అమలాపురం ఎంపీగా వెళ్లాలని సూచించారు. తొలుత అదో గౌరవం గా భావించిన రాపాక ఇప్పుడు అసలు విషయాన్ని గ్రహించారు. అమలాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే ఓటమి ఖాయమన్న సంకేతాలు గుర్తించారు. అందుకే రాజోలు అసెంబ్లీ టికెట్ కోసం పరితపిస్తున్నారు.తాజాగా వైసిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాపాక వరప్రసాద్ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు.2014,2019 ఎన్నికల్లో రాజోలు నుంచి వైసీపీ అభ్యర్థి ఓడిపోయిన విషయాన్ని గ్రహించారు. తనకు కాకుండా వేరే ఎవరికైనా సీటు ఇస్తే మరోసారి వైసిపి ఓడిపోవడం ఖాయం అని తేల్చి చెప్పారు. దీంతో ఇది వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. అదును చూసి రాపాక దెబ్బ కొట్టారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాపాక వరప్రసాద్ ధిక్కారస్వరం వినిపించినట్టేనని తెలుస్తోంది. ఆయన ఎంపీగా పోటీ చేయడం లేదని ఖాయం అయ్యింది.ఇటీవల టిడిపి టికెట్ నిరాకరించడంతో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వైసీపీలో చేరారు. ఇలా ఆయన చేరారో లేదో రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ను ఆయనకు కేటాయించారు. ఇది రాపాక వరప్రసాద్ కు మింగుడు పడలేదు. జనసేన ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న తాను నాయకత్వాన్ని విభేదించి వైసిపి గూటికి చేరుకుంటే ఇలా పక్కన పెడతారా? ఎంపీగా పోటీ చేయమంటారా? టిడిపి నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇస్తారా? అంటూ రాపాక వరప్రసాద్ చిందులు వేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాపాక వరప్రసాద్ చక్కగా వినియోగించుకున్నారు. ఏకంగా నాయకత్వానికి అల్టిమేట్ ఇచ్చారు. గొల్లపల్లి సూర్యారావు పోటీ చేస్తే ఓటమి ఖాయమని తేల్చేశారు. దీంతో వరప్రసాద్అమలాపురం ఎంపీగా పోటీ చేయనట్టే. ఆయనపై వైసీపీ హై కమాండ్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
=====================
07విపక్షాలకు ఇబ్బందులు తప్పవా
బీజేపీ బలం చూపేనా
విజయవాడ, మార్చి 13, (న్యూస్ పల్స్)
తెలుగుదేశం పార్టీతో బిజెపి పొత్తు కుదిరే పని కాదని విశ్లేషణలు వచ్చాయి. అసలు బిజెపి టిడిపి రూట్లోకి రాదని కూడా వైసిపి అనుకూల వర్గాలు చెప్పుకొచ్చాయి. ఒకవేళ పొత్తు కుదిరినా బిజెపిఎక్కువ సీట్లు కోరుతుందని.. పవర్ షేరింగ్ సైతం అడుగుతుందని.. తనకు కాకున్నా పవన్ అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తుందని వైసిపి అనుకూల మీడియా విశ్లేషించింది. అసలు టిడిపిని కలుపుకెళ్లేందుకు బిజెపి అగ్ర నేతలు ఇష్టపడడం లేదని కూడా తేల్చి చెప్పింది. వైసీపీ అంటేనే బిజెపికి అపార గౌరవం అని.. టిడిపికి డోర్స్ క్లోజ్ అయినట్టేనని రకరకాల ప్రచారం జరిగింది. వీటన్నింటిని తెరదించుతూ బిజెపి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది. పది అసెంబ్లీ సీట్లు, ఆరు పార్లమెంట్ స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో వైసిపి మాట చెల్లుబాటు కాకుండా పోయింది.ఇప్పటివరకు నేషనల్ మీడియా సంస్థలు ఏపీలో సర్వేలు చేశాయి. మెజారిటీ సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. కొన్ని సంస్థలు అయితే ఏకపక్షంగా వైసిపి గెలుపొందుతుందని తేల్చి చెప్పాయి. అయినా సరే బీజేపీ టిడిపి పొత్తుకు ఒప్పుకుందంటే సాహసం అనే చెప్పాలి. పైగా అన్ని విధాలా సహకారం అందించే జగన్ రూపంలో వైసిపి ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఏకపక్షంగా పార్లమెంట్ స్థానాలను గెలిచే ఛాన్స్ ఉంది. అయినా సరే బిజెపి పెద్దలు వైసీపీని పట్టించుకోకుండా టిడిపి తో పొత్తు పెట్టుకోవడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.సర్వే సంస్థలు తప్పుడు నివేదికలైనా ఇచ్చి ఉండాలి.లేకుంటేబిజెపి అగ్ర నేతలు సొంతంగా సర్వే చేయించి ఉండాలి.ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగి ఉండాలి.ఒక జాతీయస్థాయిలో మూడోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న బిజెపి.. గెలవాలనుకుంటున్న పార్టీతోనే కలుస్తుంది కానీ.. ఓడిపోయే పార్టీతో చేయి కలిపే ఛాన్స్ లేదు.వాస్తవానికి ఏపీలో పరిస్థితులపై బీజేపీకి స్పష్టమైన అవగాహన ఉంది.బిజెపి అగ్రనేతలు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. కొన్ని జాతీయ మీడియాలు చేసిన సర్వేలను వారు పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. కేంద్రానికి సైతం కొన్ని నిఘా సంస్థలు ఉంటాయి. వాటిపైన కేంద్రం ఆధారపడుతుంది.వాటి నివేదికల ఆధారంగానే కేంద్రం పొత్తులపై ఒక నిర్ణయం తీసుకుంటుందన్న అభిప్రాయం ఉంది.ఏపీలో విపక్షాలకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ఈపాటికే నిఘా సంస్థలు హెచ్చరించి ఉండేవి కదా? కానీ బిజెపి విపక్షాలతో కలవడం ఏమిటి? తనకు అన్ని విధాలా సహకరిస్తున్న జగన్ ఉండగా.. గత ఎన్నికలకు ముందు దారుణంగా దెబ్బతీసిన చంద్రబాబును నమ్మడం ఏంటి? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఆ మూడు పార్టీల మధ్య పొత్తు సవ్యంగా ముందుకు సాగుతోంది. సీట్ల సర్దుబాటు సైతం ఒక కొలిక్కి వస్తోంది. మొత్తానికైతే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఏపీ విషయంలో తీసుకున్న నిర్ణయం సైతం హాట్ టాపిక్ గా మారుతోంది. ఏపీలో గెలుపోటములను పరిగణలోకి తీసుకునే బిజెపి నిర్ణయం తీసుకొని ఉంటుందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ బలం ఎంత అంటే, పొరుగున ఉన్న తెలంగాణతో పోలిస్తే తక్కువే అన్నది మాత్రం నిర్వివాదంశం. ఏపీలో బీజేపీకి సైద్ధాంతికంగా బలమైన మద్దతుదారులు ఉన్నా, రాజకీయాల్లో సొంతంగా అభ్యర్ధులను గెలిపించుకునే స్థాయిలో మాత్రం లేదు. అందుకే కనీసం కార్పొరేటర్లుగా కూడా బీజేపీ అభ్యర్థులు పోటీ చేసి గెలిచే పరిస్థితులు లేవనే విమర్శ ఎదుర్కోవాల్సి వచ్చేది.బీజేపీ ఆవిర్భావం నుంచి నలభై ఏళ్లలో దేశంలో 2 పార్లమెంటు స్థానాల నుంచి సొంతంగా దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగినా ఏపీలో మాత్రం ఆ పార్టీ ఎందుకు ఎదగలేక పోయిందనే చర్చ పలు మార్లు చర్చకు వచ్చింది.ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నీడలో ఉండిపోవడం వల్లే ఏపీలో బీజేపీ ఎదగలేదనే విమర్శ ఉంది. 2018లో బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకున్నా తర్వాత మళ్లీ ఆ పార్టీతో జట్టు కట్టేది లేదని బీజేపీ ప్రకటించింది. అయితే అనూహ్యంగా 2024 నాటికి ఆ రెండు పార్టీలు మళ్లీ జట్టు కట్టాయి.2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులు 117 స్థానాల్లో పోటీ చేశారు. పోటీ చేసిన ప్రతిచోట డిపాజిట్లు కోల్పోయారు. రాష్ట్రంలో పోలైన ఓట్లలో బీజేపీకి కేవలం 0.85శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. 2019లో వామపక్షాలతో కలిసి పోటీ చేసిన జనసేనకు 7శాతం లోపు ఓట్లు వచ్చాయి.ఏపీల సొంతంగా ఎదగడానికి ఐదేళ్లలో బీజేపీ రకరకాల ప్రయత్నాలు చేసింది. ఏపీలో కమ్మ సామాజిక వర్గం టీడీపీకి, రెడ్లు వైసీపీ వైపు ఉండటంతో మూడో బలమైన సామాజిక వర్గం కాపుల్ని ఆకర్షించేందుకు వారికి రాష్ట్ర బాధ్యతలు అప్పగించింది. మొదట కన్నా లక్ష్మీనారాయణ, తర్వాత సోము వీర్రాజులకు బాధ్యతలు అప్పగించారు. ఐదేళ్ల తర్వాత అనూహ్యంగా దగ్గుబాటి పురందేశ్వరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.ఏపీ బీజేపీలో సిద్దాంతపరంగా ఆర్ఎస్ఎస్ అనుకూల బీజేపీ వర్గంతో పాటు టీడీపీ అనుకూల వర్గం ఒకటి, వైసీపీ అనుకూల వర్గం ఇంకోటి ఉన్నాయి. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే మళ్లీ 2019 ఫలితాలు పునరావృతం అవుతాయనే అవగాహన కూడా బీజేపీ పెద్దలకు ఉంది.అదే సమయంలో టీడీపీతో జత కలిసే విషయంలో కూడా బీజేపీ నేతల్లో బిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ఎన్డీఏలో మిత్రపక్షంగా లేకున్నా మోదీ మాట జవదాటని పార్టీగా నమ్మకాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమితో కలిసి పోటీ చేయడం ద్వారా బీజేపీ వీలైనన్ని పార్లమెంటు స్థానాలలను దక్కించుకోవాలని భావిస్తోంది.దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రాతినిథ్యం ఉండాలనే లక్ష్యంతోనే టీడీపీ-జనసేన కూటమితో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమైంది. గెలుపొటములు, సీట్ల సంఖ్యతో సంబంధం లేకుండా ఏపీలో గెలిచే స్థానాలన్నీ తమకే దక్కుతాయనే అంచనాతో బీజేపీ ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ సొంతంగా గెలిచే స్థానాలతో పాటు మిగిలిన పార్టీలు గెలిచే స్థానాలు కూడా తమ చెప్పు చేతల్లోనే ఉంటాయనే అంచనా బీజేపీకి ఉంది.
=================================
08 ఒకేసారి టీడీపీ అభ్యర్ధుల ప్రకటన
విజయవాడ, మార్చి 13, చ(న్యూస్ పల్స్)
టిడిపి అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఒకవైపు భాగస్వామ్య పక్షాలతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుపుతున్నారు. మరోవైపు సొంత పార్టీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. జనసేనతో పొత్తు కుదిరిన నేపథ్యంలో ఆ రెండు పార్టీల తొలి జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ 94 మందితో తొలి జాబితాను ప్రకటించింది. జనసేన, బిజెపికి కేటాయించిన సీట్లు పోను.. మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రానికి ఆ రెండు పార్టీలతో సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఒక కొలిక్కి రానుంది. దీంతో రెండు రోజుల్లో రెండో జాబితాను క్లియర్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో ఆశావహుల్లో ఒక రకమైన టెన్షన్ నెలకొంది.టిడిపి తొలి జాబితాలో చాలామంది సీనియర్లకు టికెట్లు దక్కలేదు.అనూహ్యంగా కొంతమంది జూనియర్లు టికెట్లు దక్కించుకున్నారు.టికెట్లు ప్రకటించని వారిలో పొలిట్ బ్యూరో సభ్యులు సైతం ఉన్నారు. అయితే తొలి జాబితాలో టికెట్లు దక్కని సీనియర్లను పిలిచి చంద్రబాబు బుజ్జగించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం మీ అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో చాలామంది సీనియర్లు మెత్తబడ్డారు. ఇప్పుడు రెండో జాబితాలో దాదాపు 50 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా వివిధ కారణాలతో టిక్కెట్లు ఇవ్వని వారికి పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకుగాను సీనియర్లతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు.మరోవైపు ఎంపీ అభ్యర్థులను సైతం ఖరారు చేసేందుకు చంద్రబాబు సిద్ధపడుతున్నారు. రెండో జాబితాలోనే ఎంపీ అభ్యర్థుల ప్రకటనకు కసరత్తు చేస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు రెండు, బిజెపికి ఆరు పార్లమెంట్ స్థానాలను కేటాయించిన సంగతి తెలిసిందే. మిగతా 17 నియోజకవర్గాల్లో అభ్యర్థులను చంద్రబాబు ఇప్పటికే పూర్తి చేశారు. ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టిడిపిలో చేరిక ఖాయమైంది. ఒంగోలు సీటును ఆయన కుమారుడు రాఘవరెడ్డికి కేటాయించే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఎంపీ అభ్యర్థులకు సంబంధించి చాలా చోట్ల ఆశావహులు అధికంగా ఉన్నారు. గుంటూరు లాంటి చోట్ల ఎన్నారైలు సైతం సిద్ధంగా ఉన్నారు. అటు పొత్తుకు కారణమైన బిజెపిలోని ప్రో టిడిపి నేతలు సైతం తమదైన రీతిలో పావులు కదుపుతున్నారు.అన్ని రకాల కసరత్తులు పూర్తిచేసి ఎల్లుండి టిడిపి రెండో జాబితా వెల్లడించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో పోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఆశావహులు టెన్షన్ తో గడుపుతున్నారు.
=======================
కలవరపెడుతున్న ఎర్ర సముద్రం
విశ్లేషణ)
ప్రపంచ నౌకా వాణిజ్యంలో కీలకమైన ఎర్ర సముద్రం ద్వారా ప్రయాణం సాగించే వాణిజ్య నౌకలపై హూతీ తిరుగుబాటుదారుల దాడులు అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలను తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా.. యుద్ధానికి దిగింది. యెమెన్లోని హౌతి తిరుగుబాటుదారుల స్థావరాలపై బాంబుల వర్షాన్ని కురిపించింది. సుదీర్ఘ విరామం తరువాత అమెరికా ప్రత్యక్ష యుద్ధానికి దిగడం, అది కూడా మధ్య తూర్పు దేశంపై కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బ్రిటన్ సహా వివిధ దేశాల సహకారంతో ఈ దాడులకు పూనుకుంది అమెరికా. బ్రిటన్, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, కెనడా, నెదర్లాండ్స్ దేశాలు.. ఈ దాడుల్లో అమెరికా సైన్యానికి తమవంతు సహాయ, సహకారాలను అందించాయి. త్వరలో భారత్ కూడా తన నిర్ణయాన్ని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడినట్టయింది. ఈ దేశంలోని హౌతి తిరుగుబాటుదారుల స్థావరాలపై వైమానిక దాడులను ప్రారంభించినట్లు ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. సముద్ర మార్గాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తోన్న హౌతి తిరుగుబాటుదారుల స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. కొద్ది రోజులుగా ఆసియా సహా పలు పాశ్చాత్య దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్నారు యెమెన్లోని హౌతి తిరుగుబాటుదారులు. యెమెన్కు ఆనుకుని ఉన్న ఎర్ర సముద్రంపై పట్టును సాధించారు. ఈ మార్గంలో తిరుగాడే నౌకలను తమ ఆధీనంలో తెచ్చుకుంటోన్నారు. సిబ్బందిని అపహరిస్తోన్నారు. ఇటీవలే భారత్కు చెందిన నౌకను కూడా హౌతీ రెబెల్స్ స్వాధీన పర్చుకున్న విషయం తెలిసిందే. ప్రపంచాన్ని చుట్టుముట్టిన ఆర్థిక మాంద్యానికి తోడు సరకుల రవాణా వ్యవస్థను హూతీలు దెబ్బ తీయడం వల్ల ద్రవ్యోల్బణం మరింతగా విజృంభిస్తుందని ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. సంక్షుభిత గాజాపై ఇజ్రాయెల్ యుద్ధానికి ప్రతీకారంగా ఎర్ర సముద్రంలో దాడులు చేస్తున్నామని హూతీలు ప్రకటించారు. హూతీలను నిరోధించి ఎర్ర సముద్రం ద్వారా నౌకా రవాణాను సురక్షితం చేయడానికి అమెరికా, యుకె మిలిటరీ దాడులను ఉధృతం చేసినా హూతీలు వెనక్కి తగ్గడం లేదు.ఎర్ర సముద్ర నౌకలపై దీర్ఘ కాల దాడుల ఫలితంగా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆయిల్, గ్యాస్, బియ్యం, గోధుమలు వంటి నిత్యావసరాల ధరలు మరింతగా పెరిగి పేద దేశాల్లో ఆకలి చావులు కూడా సంభవిస్తాయని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అయినా పెద్దన్నలా వ్యవహరించే అగ్ర రాజ్యాలు గాజా సంక్షోభాన్ని పరిష్కరించడానికి బదులు హూతీలపై దాడులు చేయడం అగ్నికి ఆజ్యం పోయడమేనని వారు అంచనా వేస్తున్నారు. హూతీల దాడుల ఫలితం ప్రస్తుతం కొన్ని దేశాలకే పరిమితమైనా మున్ముందు భారత్తో సహా అన్ని దేశాలు పెరిగే ధరలతో సతమతంకాక తప్పదని ఆర్థికవేత్తలు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నా పెద్ద దేశాల పాలకులు మేల్కోవడం లేదు. ప్రపంచ వాణిజ్యంలో కీలకమైన ఎర్ర సముద్రంలో ఇప్పటి దాకా 40 వాణిజ్య నౌకలపై దాడులు జరిగాయి.ఉద్యోగాలు చేయడమంటే ప్రాణాలతో చెలగాటమేనని నౌకల సిబ్బంది చెబుతున్నారు. నౌకల యజమానులు కూడా పెరిగిన కార్గో బీమా రేట్లతో ఎర్ర సముద్రం పేరు చెబితేనే వణికిపోతున్నారు. యూరపు, ఆసియా, ఆస్ట్రేలియాల మధ్య సూయజ్ కెనాల్, ఎర్ర సముద్రం ద్వారా ప్రయాణం దగ్గరి దారి అని ప్రపంచానికి తెలుసు. ఇలా కాకుండా మరో రూటులో ప్రయాణం మరింతగా ఖర్చులు పెంచుతుంది. ప్రపంచ వాణిజ్యంలో 15 శాతం నౌకాయానం ఎర్ర సముద్రం ద్వారానే జరుగుతుందంటే ఈ దారి ప్రాముఖ్యత ఏమిటో అర్థమవుతుంది. గడిచిన రెండు రోజులుగా హూతీ తిరుగుబాటుదారులు అమెరికా యుద్ధ నౌకలపై క్షిపణులు, డ్రోన్ల సాయంతో చేస్తున్న దాడులకు అమెరికా దళాలు ఎదురు దాడి చేసి డ్రోన్లను, క్షిపణులను ధ్వంసం చేశాయి. ఎంఎస్సి స్కై అనే వాణిజ్య నౌకపై కూడా హూతీలు భీకర దాడులు చేయడంతో సముద్రం మరింతగా ఎరుపెక్కింది.ఆ నౌక సిబ్బంది సాయం కోరడంతో భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ కోల్కతా ఎర్ర సముద్రానికి యుద్ధ ప్రాతిపదికగా చేరుకొని నౌకలోని 23మంది సిబ్బందిని కాపాడారు. ఇలాంటి సంఘటనలు అక్కడ నిత్యకృత్యంగా మారాయి. హూతీల దాడుల కారణమో మరేమిటో తెలియదు గాని ఎర్ర సముద్రం అడుగున నిర్మించిన మూడు డేటా కేబుల్స్ తెగిపోయి అంతర్జాతీయంగా 25శాతం డేటా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడినట్లు టెలికం సంస్థలు ప్రకటించాయి. ప్రపంచంలోని దిగ్గజ సంస్థలైన అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి కంపెనీలు లక్షల కోట్లతో ఈ కేబుల్స్ను నిర్మించాయి. ప్రపంచ కమ్యూనికేషన్కు కీలకమైన ఇంటర్నెట్కు ఈ కేబుల్సే కీలకం. ఇటీవలి కాలంలో ఇంటర్నెట్ అంతరాయాలకు కేబుల్స్ తెగిపోవడం కూడా ఒక కారణంగా టెలికాం సంస్థలు చెబుతున్నాయి. హూతీల దాడుల ప్రభావం ఇలా బహుముఖంగా వుండడం కూడా ప్రపంచాన్ని కలవరపరిచే అంశంగా చెప్పవచ్చు.ఇప్పటికే హూతీల దాడుల వల్ల ఒక ట్రిలియన్ డాలర్ల వాణిజ్యం దెబ్బ తిన్నదని అంచనా. దాడుల భయంతో కార్గో ఇన్సూరెన్స్ను కూడా కంపెనీలు 0.6 నుంచి 2 శాతానికి పెంచాయి. దీనివల్ల షిప్పింగ్ ఛార్జీలు కూడా 100 నుంచి 150 శాతం పెరిగాయి. ఎగుమతులు, దిగుమతుల వ్యయం పెరగడంతో అనేక దేశాల్లో నిత్యావసర వస్తువులతో పాటు వివిధ రంగాల వినియోగ వస్తువులు కూడా పెరుగుతున్నాయి. ఆర్థిక మాంద్యంతో ఉపాధి పోవడం, సరకుల ధరలు పెరగడంతో అన్ని వర్గాలకు జీవన వ్యయం భారంగా మారుతున్నది. యుద్ధాలను నివారించే ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు ఎర్ర సముద్రం సంక్షోభానికి తాత్కాలిక పరిష్కారాలు కనుగొనే బదులు అసలు మూలాన్ని గుర్తించి ఆ దిశగా శాశ్వత పరిష్కార ఆలోచించకుంటే అన్ని దేశాలకు మున్ముందు ఆర్థిక గండాలే.
=============================
09 జాగృతిపైనే కవిత దృష్టా…
హైదరాబాద్, మార్చి 13, (న్యూస్ పల్స్)
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పార్లమెంటు ఎన్నికల బరిలో ఉండటం లేదని స్పష్టమయింది. నిజామాబాద్ నుంచి గతంలో గెలిచిన కవిత.. ఓ సారి ఓడిపోయారు. ఈ సారి అక్కడే పోటీ చేసేందుకు గతంలో సన్నాహాలు చేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్క సారిగా వెనుకడుగు వేశారు. పోటీ గురించి మాట్లాడటం లేదు. అంతే కాదు నిజామాబాద్ బీఆర్ఎస్ వ్యవహారాలు కూడా చూసుకోవడంలేదు. పూర్తిగా తన తెలంగాణ జాగృతి సంస్థ బలోపేతంపైనే దృష్టి పెట్టారు. తాను చేసే కార్యక్రమాలు పూర్తిగా జాగృతి పేరు మీదనే నిర్వహిస్తున్నారు.లోక్ సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ అధినేత నిర్వహించిన కీలక సమావేశాల్లో సైతం ఆమె కనిపించలేదు. కవిత పార్లమెంటు ఎన్నికల్లో నిలబడాలంటే ఆమె సొంత నియోజకవర్గంగా చెప్పుకునే నిజామాబాద్ నుండే బరిలో దిగుతారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ఆమె ఉమ్మడి నిజామాబాద్ లోనే ఎక్కువగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ అక్కడ 9 అసెంబ్లీ సెగ్మెంట్లకు గానూ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. 2018 ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలవగా, యల్లారెడ్డిలో కాంగ్రెస్ గెలిచింది. అనంతరం ఆ ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా గులాబీ గూటికి చేరారు. కానీ ఈసారి కేవలం రెండు స్థానాలకే బీఆర్ఎస్ పరిమితం అయింది. 2018 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ 3 సీట్లు, కాంగ్రెస్ 4 సీట్లు గెలుచుకుంది. అంతేకాదు కామారెడ్డిలో సీఎం అభ్యర్థులు కేసీఆర్, రేవంత్ రెడ్డిలు సైతం బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. నిజామాబాద్ కి పసుపు బోర్డు కేటాయించడంతో స్థానిక ఓటర్లలో బీజేపీపై విశ్వాసం పెరిగిందన్న అభిప్రాయం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఆ ప్రభావం పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కి పాజిటివ్ అవ్వొచ్చు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ వ్యాప్తంగా పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉండే ఛాన్స్ ఉంది. ఈ సమీకరణాలన్నీ అంచనా వేసుకున్న తర్వాత పోటీకి దూరంగా ఉన్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆలోచనతో కేసీఆర్ టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చారు. ఆ సమయంలో కేసీఆర్కు జాతీయ రాజకీయాల్లో కవితే కీలకంగా వ్యవహరించారు. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కు ప్రచారం వచ్చేలా చేయడంలో కవితే కీలకంగా వ్యవహరించారు. తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు స్వరాష్ట్రంలో ఓటమి చవిచూడటంతో కారు పార్టీ డీలా పడింది. జాతీయ రాజకీయాల సంగతి పక్కన పెట్టినట్టే కనిపిస్తోంది. తెలంగాణలో అనుకూల ఫలితం వచ్చి ఉంటే కవిత ఎంపీగా పోటీ చేసేవారు . కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ లో బిజీగా ఉండేవారు.. కవిత కూడా రాష్ట్ర రాజకీయాల్లో కనిపించేవారు. దీంతో నాలుగు ఉద్యోగాల తాలూకా మారక ఎక్కువగా కనిపించేది కాదు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు మెదక్ నుంచి పోటీ చేయించడానికి కూడా కేసీఆర్ సిద్ధంగా లేరని అంటున్నారు. ఓటమి భయంతో కేసీఆర్ కూతుర్ని నిజామాబాద్ లో పోటీ చేయించడం లేదని, దమ్ముంటే పోటీ చేయించాలని రేవంత్ రెడ్డి భద్రాచలంలో సవాల్ విసిరారు. బీఆర్ఎస్ – బీజేపీ మధ్య లోపాయికారిక ఒప్పందం ఉందని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. లిక్కర్ స్కామ్ లో కవితని అరెస్ట్ చేయకపోవడానికి కూడా కారణం అదేనంటూ బలంగా వాదిస్తున్నాయి. ఇక అందులో భాగంగానే నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ కి మేలు చేకూర్చడానికి కవితని పోటీలో ఉంచడం లేదని అంటున్నారు. ఓ డమ్మీ క్యాండిడేట్ ని నిలబెట్టి, బీజేపీకి రహస్య మద్దతు ఇస్తారనే టాక్ నడుస్తోంది. దీన్ని రేవంత్ రెడ్డి హైలెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.మరో వపు కవిత బీఆర్ఎస్ తరపున కాకుండా.. తెలంగాణ జాగృతి తరపన రాజకీయ కార్యక్రమాలు చేపడుతున్నారు. మహిళల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్న జిఓ 3ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కవిత ఇతర భారత్ జాగృతి కార్యకర్తలతో కలిసి ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. తాజాగా అసెంబ్లీలో పూలే విగ్రహాం కోసం బీసీ సంఘాలతో కూడా జాగృతి తరపునే సమావేశం నిర్వహించారు. పైగా బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. పార్టీ తరపున నిజామాబాద్ లో ఇప్పుడు ప్రచారం చేయడం లేదు. లోక్ సభ ఎన్నికలు వస్తున్నందున అక్కడ నిలబడబోయే అభ్యర్తి కోసం కూడా కసరత్తు చేయడం లేదు. దీంతో రాజకీయం విషయంలో కవిత తన సొంత బాటను ఎంచుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. దీనికి కారణం రాజకీయ వ్యూహమా కాదా అన్నది ముందు ముందు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
===================
10 సీఎఎను వ్యతిరేకిస్తున్న బీజేపీయేతర రాష్ట్రాలు
న్యూఢిల్లీ, మార్చి 13, (న్యూస్ పల్స్)
లోక్సభ ఎన్నికల ముందు కేంద్రం దేశంలో పౌరసత్వ సవరణ(సీఏఏ) చట్టం తక్షణం అమలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు సోమవారం రాత్రి ప్రకటన చేసింది. ఎన్నికల ముందు సీఏఏ చట్టం అమలులోకి తీసుకురావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ చట్టానికి పార్లమెంట్లో 2019లోనే ఆమోదం లభించింది. అయితే అమలు చేయలేదు. దీనికి ప్రధాన కారణం విదేశాల నుంచి భారత్కు వచ్చిన అందరికీ భారత పౌరసత్వం కల్పించి ముస్లింలకు మాత్రం కల్పించొద్దని ఇందులో పేర్కొనడమే. దీనిపై ఆందోళనలు సైతం జరిగాయిదాదాపు ఐదేళ్లు అమలు చేయకుండా పెండింగ్లో పెట్టిన కేంద్రం.. 2024 పార్లమెంటు ఎన్నికల వేళ సీఏఏ అమలు చేస్తున్నట్లుల ప్రకటించింది. దీనిని కొందరు వ్యతిరేకిస్తున్నారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం అమలును తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం చీఫ్ విజయ్ స్పందించారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం అమలు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఈ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయొద్దని తమిళనాడు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ చట్టం అమలు చేస్తే అది దేశ ప్రజల మధ్య సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రజలంతా కలిసిమెలిసి జీవిస్తున్నవేళ ఇటువంటి వివాదాస్పద చట్టం అమలు చేయడాన్ని తప్పు పట్టాడు దళపతి.ఇదిలా ఉంటే సీఏఏ చట్టాన్ని అమలు చేయబోమని ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాలు ప్రకటించాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ముస్లింలను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించే ఈ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయడం లేదని తెలిపారు. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ సైతం సీఏఏ అమలును వ్యతిరేకిస్తున్నారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇస్తారని తెలిపారు. ఇక కాంగ్రెస్ కూడా ఈ చట్టం అమలును తప్పు పడుతోంది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయసింగ్ అన్నారు. ఎన్నికల బాండ్ల వ్యవహారం నుంచి దృష్టి మరల్చడానికే కేంద్రం సీఏఏ అమలు చేయాలని నిర్ణయించిందని ఆరోపించారు. ఐదేళ్లు పెండింగ్లో పెట్టి ఎన్నికల వేళ అమలు చేయడాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తప్పు పట్టారు.
=======================
11 బీజేపీకి గజకేసరి యోగం…
న్యూఢిల్లీ, మార్చి 13, (న్యూస్ పల్స్)
300 కు పైచిలుకు స్థానాల్లో విజయం సాధించి.. మూడోసారి అధికారంలోకి వస్తాం. ” ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి మొదలు పెడితే జేపీ నడ్డా వరకు ఇదే విషయాన్ని పదే పదే చెబుతున్నారు. ఇక స్థానికంగా ఉన్న నాయకుల మాటలకైతే ఇక లెక్కేలేదు. నిజంగా బిజెపి 300 కు మించి పార్లమెంటు స్థానాల్లో విజయం సాధిస్తుందా? ఆ పార్టీలో ఆ స్థాయిలో ఆత్మవిశ్వాసానికి కారణం ఏంటి? క్షేత్రస్థాయిలో బిజెపికి అంత సానుకూల పవనాలు ఉన్నాయా? అనే ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఎలాగైనా మాట్లాడుతారు. ఎందుకంటే అలా మాట్లాడకపోతే ప్రజలు తమకు ఓట్లు వేయరని నాయకుల నమ్మకం. ఈసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధిస్తామని చెబుతున్న బిజెపికి సంబంధించిన జాతకాన్ని ఒకసారి పరిశీలిస్తే.. భారతీయ జనతా పార్టీ ఏప్రిల్ 6 1980 ఉదయం 11: 45 నిమిషాలకు ఏర్పాటయింది.బిజెపి ఏర్పాటు నాటి సమయాన్ని బట్టి.. ఆ పార్టీకి సంబంధించిన రాశి, ఇతర గ్రహబలాలు మొదటి నుంచి ఒకింత ఆసక్తికరంగానే ఉన్నాయి. ఈ పార్టీ గెలుపు, ఓటములను తారుమారు చేయగలదు. ఈసారి ఎన్నికల్లో కూడా బిజెపికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయనే చెబుతున్నారు. బిజెపి జన్మ నక్షత్రం విభాగంలో లగ్నం, వారసుడు ఇద్దరు నాలుగో ఇంట్లో ఉన్నారు. ఇలా ఉంటే అది మతపరమైన వ్యవహారాలకు సూచిక. ప్రస్తుతం బిజెపి మతపరమైన వ్యవహారాలతోనే ప్రయోజనం పొందుతోంది. దీనివల్ల ఒక సెక్షన్ ప్రజల నుంచి దానికి ఆదరణ లభిస్తోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.. అయోధ్య రామ మందిర నిర్మాణం, ద్వారక అభివృద్ధి వంటి అంశాలను ఎన్నికల్లో బిజెపి ఉపయోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటివల్ల బిజెపి మరోసారి అధికారంలోకి వస్తుందని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తున్నారు.. మరోవైపు ఫిబ్రవరి 16న బీజేపీకి చంద్రుని ప్రధాన కాలంలో బుధుడు ఉపకారిగా ప్రవేశించడంతో గజకేసరి యోగం కలిగింది.గజకేసరి యోగం వల్ల పార్టీకి విజయం లభిస్తుందని తెలుస్తోంది. దీనివల్ల బిజెపి మరోసారి అధికారాన్ని దక్కించుకునే అవకాశం ఉందని, గెలుపు కోసం అది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుందని, ప్రజల్లో విశ్వాసాన్ని చూరగొనే పనులు చేపడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు.
================
12సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతున్న రోగులు
భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆసుపత్రిని మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరం తరలించి ఆ ఆసుపత్రి స్థానంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను గత కొద్ది ఏళ్ల క్రితం మంజూరు చేశారు. కానీ సిహెచ్సికి సరిపడా భవనాలను నిర్మించలేదు సరిపడా వైద్య సిబ్బందిని కూడా నియమించకపోవడం వల్ల ప్రస్తుతం సీమాంగ్ సెంటర్ భవనంలోనే అక్కడి వైద్య సిబ్బందితోనే వైద్య సేవలను అందిస్తున్నారు.ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్యకు సరిపడా వైద్య సిబ్బంది లేకపోవడంతో రోగులు చికిత్స పొందడానికి వేచి చూడాల్సిన దుస్థితి దాపురించింది.ప్రస్తుతం చర్ల మండలంలో విషజ్వరాలు వ్యాప్తి చెందుతున్న కారణంగా మండల కేంద్రంలోని ఈ ఆసుపత్రికి రోజుకు సుమారు 200 పైగా రోగులు వస్తున్నారు.వీరిలో అత్యధిక శాతం రోగులు మారుమూల గిరిజన గ్రామాలనుంచే వస్తూఉంటారు వారికి సరైన సౌకర్యాలు లేకపోవడంతో రోగులు 55 కిలోమీటర్ల దూరంలోని భద్రాచలం వెళ్తూ ఆర్ధికంగా నష్టపోతున్నారు.రోగ నిర్ధారణకు ఈ ఆసుపత్రిలో రక్త పరీక్షా కేంద్రం లేకపోవడం వల్ల మండల కేంద్రంలోని ప్రైవేటు రక్త పరీక్షా కేంద్రాలను ఆశ్రయించవలసి వస్తుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించి చర్ల మండల కేంద్రానికి మంజూరు చేసిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు సరిపడినంత మంది డాక్టర్లను, వైద్య సిబ్బందిని, శానిటేషన్ కొరకు కిందిస్థాయి సిబ్బందిని నియమించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
======================
13టీడీపీ కార్యకర్తలపై వైకాపా దాడి
ఇద్దరికి గాయాలు
నర్సరావుపేట
చదలవాడ అరవింద్ బాబు తన అనుచరులపై సీసాలతో వైసీపీ గోపిరెడ్డి వర్గీయులు దాడి చేసారని అయన ఆరోపించారు. నరేంద్ర మోడీ సభకు జన సమీకరణ కొరకు వార్డు వారిగా కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు.దానిలో భాగంగా 5 వార్డు క్రిస్టియన్ పాలెం వెళ్లిన అరవింద బాబు పై దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు టీడీపీ దళిత లకు తలకి తీవ్రంగా గాయాలయ్యాయి. గోపి రెడ్డి అరాచకాలను ఖండిస్తూ .అంబేద్కర్ విగ్రహం వరకు భారీగా కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని నినాదాలు చేశారు.
================
14ఫ్రీ హలీం తొక్కిసలాట, లాఠీ చార్జ్
హోటల్ యజమానిపై కేసులు నమోదు
హైదరాబాద్
మలక్ పేట ఫ్రీ హాలిమ్ హోటల్ ఓనర్ మొహమ్మద్ ఆయూబ్ ని అరెస్ట్ చేసిన మలక్ పేట పోలీసులు పల్లు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. మలక్ పేట ముసారం బాగ్ చౌరస్తా వద్ద ఫ్రీ హాలిమ్ అంటూ అజీబో హోటల్ ఓనర్ మొహమ్మద్ ఆయూబ్ సోషల్ మీడియా లో ప్రమోట్ చేసారు. రంజాన్ మొదటి ఉపవాస రోజున తన హోటల్ ప్రమోషన్ కోసం సోషల్ మీడియా మద్యమలలో సాయంత్రం 7గంటల నుండి 8గంటల వరకు ఫ్రీ హాలిమ్ అంటూ సోషల్ మీడియాలలో పోస్టులు పెట్టారు. ఫ్రీ హాలిమ్ అని సోషల్ మీడియాలలో వచ్చిన వీడియోలను స్పందిస్తూ వందలాది మంది యువత హోటల్ వద్ద కు చేరుకున్నారు. వందలాది మంది యువత రావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. శాంతిభద్రతలు అదుపు తప్పకుండా పోలీసులు యువతను చెదరగొట్టి అజీబో హోటల్ ముసువేయించారు… ఇంత రాదంతం చేసిన హోటల్ యజమాని మొహమ్మద్ ఆయూబ్ ను అరెస్ట్ చేసి నిందితుడు పై ఐపీసీ సెక్షన్ లు 341,290,188, 21/76 సిపి యాక్ట్ కింద బుక్ చేసి అరెస్ట్ చేశారు
================XXX