బద్వేల్ అసెంబ్లీ బిజెపికి ఇవ్వడంతో షాక్ నుంచి బయటపడలేక పోతున్నా టిడిపి

బిజెపి అభ్యర్థికి టిడిపి సహకారం అందిస్తుందా ?

టిడిపిలో చేరిన వైకాపా నాయకులు కార్యకర్తలు తిరిగి సొంతగూటికి వెళతారా ?

అన్ని అనుమానాలే

టిడిపి యువనేత రితేష్ కుమార్ రెడ్డి పాదయాత్ర బూడిదలో పన్నీరేనా ?

తెలుగుదేశం పార్టీలో నిరాశ

సిరా న్యూస్,బద్వేలు;
బద్వేలు తెలుగుదేశం పార్టీకి ఊహించని విధంగా షాక్ తగిలింది. ఆ పార్టీ నాయకులు కార్యకర్తలకు కోలుకోని విధంగా రాజకీయంగా దెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీ పుట్టిన తరువాత ఇటువంటి షాక్ ఎప్పుడు కూడా ఏ ఎన్నికల్లోను కూడా తగల్లేదు. 2024 ఎన్నికల్లో మాత్రం ఈ షాక్ తగిలిందని చెప్పాలి. బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుతం ఏడు మండలాల్లో తెలుగుదేశం పార్టీ ఎంతో బలంగా ఉంది. పార్టీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆమె కుమారుడు పార్టీ యువ నేత రితేష్ కుమార్ రెడ్డి గత మూడు మాసాలుగా నియోజకవర్గం లోని ఏడు మండలాల్లో ఉధృతంగా ప్రచారం చేస్తూ పార్టీని బలోపేతం చేశారు. వీరికి తోడు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బొజ్జ రోశన్న ఏడు మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు ఎంతో మద్దతు ఇచ్చి పార్టీని మరింత బలోపేతం చేశారు. ఇది ఎవరు కూడా కాదనలేని సత్యం. అంతేగాక పార్టీ యువ నేత రితేష్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో సుమారు 320 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి పార్టీని మరింతగా బలోపేతం చేశారు. ఇదే సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విజయమ్మ రితేష్ కుమార్ రెడ్డి నాయకత్వంపై ఎంతో నమ్మకంతో ఏడు మండలాల్లో వైకాపా నాయకులు కార్యకర్తలు వందల సంఖ్యలో ఆ పార్టీని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. వీరిలో మండలాధ్యక్షులు సర్పంచులు మాజీ సర్పంచులు మాజీ జెడ్పిటి సభ్యులు వైకాపాలో కీలక నేతలు కార్యకర్తలు ఉన్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో బద్వేలు అసెంబ్లీ స్థానం పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించడంతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆశ్చర్యపోయారు. బిజెపి బద్వేలు అసెంబ్లీ అభ్యర్థి ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా అభ్యర్థికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సహకారం అందిస్తారా అనే అనుమానం ? రాజకీయ పరిశీలకుల్లో ఏర్పడింది. వాస్తవానికి బద్వేలు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో బిజెపి పార్టీ అంతగా లేదు. ఆ పార్టీ నాయకులను కార్యకర్తలను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. నాయకులు కార్యకర్తలు బలంగా లేని పార్టీకి బద్వేలు అసెంబ్లీ టికెట్ కేటాయించడంపై రాజకీయ పరిశీలకులు విశ్లేషకులు ఆశ్చర్య పోతున్నారు. బిజెపి అభ్యర్థికి తెలుగుదేశం జనసేన పార్టీలు సహకారం అందించడం డౌటే. ఇలాంటి పరిస్థితుల్లో బద్వేలు అసెంబ్లీలో అభ్యర్థి విజయావకాశాలు ఎలా ఉంటాయని అనేది శేష ప్రశ్న. గత మూడు మాసాలుగా బద్వేలు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఊహించని స్థాయిలో ప్రచారం చేసి ప్రజలను ఆకట్టుకుంది బద్వేల్ పట్టణంలో అయితే వీధి వీధిలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను మరి మరి అడిగారు అలాగే ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు ఇప్పుడు సైకిల్ గుర్తుకు కాకుండా కమలం గుర్తుకు ఓట్లు వేయాలని ఎలా అడగాలో అర్థం కావడం లేదని తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అంటున్నారు. బద్వేల్ అసెంబ్లీ విషయంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం మరోసారి ఆలోచన చేసి పార్టీ ఇంచార్జి బొజ్జ కు తెలుగుదేశం టికెట్ ఇస్తే బద్వేలు అసెంబ్లీలో పార్టీ జెండా ఎగురవేస్తామని ఎంతో నమ్మకంగా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు చెబుతున్నారు. ఈ విషయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పునరాలోచన చేయాలని వారంతా ముకుమ్మడిగా కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *