ఎవరి దారి వారిదే…

సిరా న్యూస్,విజయనగరం;
ఉమ్మడి విజయనగరం జిల్లా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇక్కడ అందరూ సీనియర్లే ఉన్నారు. టిడిపినే నమ్ముకొని పనిచేస్తున్న వారే. 2019 ఓటమి తరువాత కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ పార్టీని నిలబెట్టారు. పార్డీ కూడా అలాంటి వారిని గుర్తించి నియోజకవర్గం ఇంచార్జ్‎లుగా నియమించింది. వారంతా తమ తమ క్యాడర్‎తో నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. ఈ క్రమంలోనే ఎన్నికల సమయం వచ్చింది. దీంతో పార్టీ అధిష్టానం టిక్కెట్ల కసరత్తు పూర్తిచేసి ఆశావహులకు షాక్ ఇస్తూ కొత్త పేర్లు తెర మీదకి తెచ్చింది. దీంతో ఇప్పుడు వారంతా అసమ్మతి రాగం వినిపిస్తూ తమ సత్తా ఏంటో చూపిస్తామని జబ్బలు చరుస్తున్నారు. వారిలో గజపతినగరం ముందు వరుసలో ఉంది. గజపతినగరం నియోజకవర్గంలో ఇన్చార్జిగా డాక్టర్ కేఏ నాయుడు టిక్కెట్ తనదేనని ధీమాగా ఉండేవారు. ఒక సారి 2006 బై ఎలక్షన్‎లో, మరోసారి 2009 లో ఎంపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 2014లో తిరిగి ఎమ్మెల్యే గా గెలుపొందారు. 2019 ఎమ్మెల్యే‎గా పోటీచేసి ఓటమి పాలయ్యారు‌. తొలి నుంచి పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేశారు. నియోజకవర్గాన్నే నమ్ముకొని ఉన్న కేఏ నాయుడుని కాదని ఇక్కడ కొండపల్లి శ్రీనివాసరావు అనే కొత్త నేతను పరిచయం చేసింది అధిష్టానం. దీంతో కేఏనాయుడు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఎలాగైనా మార్చాలని పట్టుబడుతూ పార్టీ పెద్దలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఇక నెల్లిమర్ల నియోజకవర్గానికి వస్తే ఇక్కడ టీడీపీ ఇంచార్జగా కర్రోతు బంగార్రాజు కొనసాగుతున్నారు. ఈయన పార్టీ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టారు. అయితే ఇక్కడ పొత్తులో భాగంగా జనసేనకి టిక్కెట్ కేటాయించింది టిడిపి. ఇప్పుడు కర్రోతు బంగార్రాజు రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడింది. టిక్కెట్టు ప్రకటించిన దగ్గర నుండి బంగార్రాజు అసంతృప్తిగానే ఉన్నారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి పార్టీ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసి నష్టపోయనని వాపోతున్నాడు. నెల్లిమర్ల కాకపోతే ఏదో ఒకచోట నుండి తనకు టిక్కెట్టు ఇవ్వాలని అధిష్టానంపై కర్రోతు ఒత్తిడి తెస్తున్నారు. అలాగే కురుపాం నియోజకవర్గంలో ఆశావహుల వర్గం ప్రతినిధిగా దత్తి లక్ష్మణరావు కూడా పట్టు వదలని విక్రమార్కుడులా టిక్కెట్టు కోసం ప్రయత్నాలు సాగించారు. తన వర్గంలో ఉన్న ముగ్గురు మహిళలలో ఎవరో ఒకరికి టిక్కెట్ ఇవ్వాలని అధిష్టానం దగ్గర అనేక ప్రయత్నాలు చేశారు. అయినా ప్రయోజనం లేకపోగా తాను వ్యతిరేకించిన తోయక జగదీశ్వరికి టిక్కెట్ దక్కడంతో ఇక్కడ కూడా లక్ష్మణరావు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. ఇక్కడ రెండు వర్గాలు కలిసి పనిచేసేలా కనిపించటం లేదు. సాలూరులో కూడా టిడిపి అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణికి, మాజీ ఎమ్మేల్యే బంజ్ దేవ్ కి ఏ మాత్రం పొసగడం లేదు. ఇక్కడ కూడా ఎవరి దారి వారిదే అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఇలా టిడిపి, జనసేన టికెట్ల ప్రకటన తరువాత అత్యధిక నియోజకవర్గాల్లో అసంతృప్తులే అధికంగా ఉన్నారు. ఇక పార్వతీపురంలో కూడా సేమ్ సీన్. ఇక్కడ కొత్తగా వచ్చిన బోనెల విజయచంద్రకు సీటు కేటాయించడంతో పాత నేతలు ససేమిరా సర్చుకుపోయేది లేదు. తాడో పేడో తే అంటున్నారు. ఇలా దాదాపు అధిక నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ఎలా ముందుకెళ్తుందో అని క్యాడర్ లో అయోమయం నెలకొంది. జిల్లా క్యాడర్ లో నెలకొన్న ఈ అయోమయానికి పార్టీ ఏవిధంగా ఫుల్ స్టాప్ పెడుతుందో వేచి చూడాల్సి ఉంది.
==============================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *