అడ్డగోలుగా కన్వరేషన్ జోన్ అడ్డగోలుగా కార్యకలాపాలు

సిరా న్యూస్,హైదరాబాద్;
పర్యావరణ పరిరక్షణ కోసం హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లో 12 జోన్లు ఏర్పాటయ్యాయి. 41 శాతం వ్యవసాయం మాత్రమే చేయాలన్న తలంపుతో కన్జర్వేషన్ జోన్‌గా ప్రకటించారు. కొందరు రియల్టర్లు తక్కువ ధరకే భూములు వస్తున్నాయంటూ ఆ జోన్ పరిధిలో వందలాది ఎకరాలు కొనుగోలు చేశారు. ఇప్పుడేమో గుట్టుచప్పుడు కాకుండా ఆ భూముల్లో వెంచర్లు వేస్తున్నారు. దొడ్డిదారిన ప్లాట్లను అమ్మేస్తూ రూ.కోట్లు కూడగట్టుకునేందుకు ప్లాన్ సిద్ధం చేశారు.హెచ్ఎండీఏ, రెవెన్యూ అధికారులను మెప్పించి అనుమతులు లేకుండానే ప్లాట్ల దందాను నడిపిస్తున్నారు. మేడ్చల్ జిల్లా రాజబొల్లారంలో కన్జర్వేషన్ జోన్‌లో ప్లాట్లు చేస్తున్నారు. తెరవెనుక కొందరు లీడర్లు, అధికారులు ఉన్నట్లు సమాచారం. అందుకే హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌‌కు మంగళం పాడుతూ.. ఎలాంటి చర్యలు లేకుండా వ్యాపారాన్ని సాగిస్తున్నారు. హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం సకల సౌకర్యాలు కల్పించామంటూ మార్కెటింగ్ చేస్తున్నారు. ఐతే అనుమతులు ఎందుకు తీసుకోలేదని ఎంక్వయిరీ చేస్తే అది పూర్తిగా కన్జర్వేషన్ జోన్‌లో ఉందని తేలింది.నేటి ఫామ్ ల్యాండ్.. రేపటి విల్లా ప్లాట్ భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేది. ఐటీ, ఫార్మా, యూనివర్సిటీలు, హాస్పిటల్స్, రీసార్టులన్నీ అందుబాటులో ఉండే ప్రాంతం. ఒకే ఒక్క ప్లాట్ కొనండి. రీసేల్ చేస్తే మల్టిపుల్ ఆదాయం వస్తుంది. ప్రతి 200 గజాల ప్లాట్ లో మూడు మామిడి చెట్లు, మూడు జామ, మూడు సపోటా, మూడు ఆరెంజ్, మూడు దానిమ్మ చెట్లను పెట్టిస్తాం. త్వరపడండి అంటూ విష్ణు తేజ ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థ మేడ్చల్ మండలం రాజబొల్లారంలో విష్ణుతేజ ఎన్‌క్లేవ్ పేరిట భారీ వెంచర్ వేశారు.ఇందులో 40, 30 ఫీట్ల రోడ్లు వేశారు. ఫుట్‌పాత్‌‌లు, పార్కులు, ఎలక్ట్రిసిటీ సదుపాయం, వీధి దీపాలు, గ్రాండ్ ఎంట్రెన్స్ ఆర్చ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఓవర్ హెడ్ ట్యాంక్ వంటి ఏర్పాటు చేశారు. ప్రతి ప్లాట్ కి నీటి కనెక్షన్, ప్లాట్ నంబర్లు, లే అవుట్ మొత్తానికి కంపౌండ్ వాల్స్, హెచ్ఎండీఏ నిబంధనలకు అనుగుణంగా అభివృద్ధి చేశారు. ఇన్ని చేసినా అనుమతులు మాత్రం పొందలేదు. హెచ్ఎండీఏకి దరఖాస్తు కూడా చేసుకోలేదు. రెరా పర్మిషన్ రాలేదు. ఐతేనేం..? ప్లాట్ల దందా జోరుగానే నడుస్తున్నది. ఇప్పటికే సగానికి పైగా అమ్మేశారు.మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం రాజబొల్లారం సర్వే నం.259, 260, 261, 262, 263, 264, 275 లలో సుమారు 11 ఎకరాల్లో నాలా కన్వర్షన్ చేశారు. విష్ణు‌తేజ ఎన్ క్లేవ్ పేరిట లేఅవుట్ చేసి ప్లాట్లు అమ్మేస్తున్నారు. ధరణి పోర్టల్‌లో క్యాడస్ట్రల్ మ్యాప్ మాత్రం ఈ గ్రామానికి 169 సర్వే నంబర్ల వరకే చూపిస్తున్నాయి. మొత్తం 386 ఉండగా సగం మాత్రమే కనిపిస్తున్నాయి. ఇప్పుడీ వెంచర్‌‌కు సంబంధించిన సర్వే నంబర్లు కూడా లేవు. ఐతే ఇన్ని సదుపాయాలు కల్పిస్తూనే నివాస స్థలాలుగానే బ్రోచర్లు పంపిణీ చేస్తున్నారు. ఇందులో 75 శాతం ప్లాట్లు అమ్మేసినట్లు మార్కెటింగ్ సిబ్బంది చెప్పారు. ఈ వెంచర్‌లో ప్లాట్ కొనుగోలు చేసిన వారు ఇండ్లు ఎట్లా నిర్మిస్తారు? గజం రూ.18 వేలు వెచ్చించి స్థలాన్ని కొనుగోలు చేస్తే అనుమతులు రాకపోతే అమ్ముకోవడం ఎట్లా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. కన్జర్వేషన్ జోన్ లోని స్థలాల్లో విల్లాలు నిర్మించేందుకు ఎవరు అనుమతులు ఇస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
మేడ్చల్ జిల్లా రాజబొల్లారం సర్వే నం.259 లోని 10.38 ఎకరాలు, 264లోని 10.38 ఎకరాలు, 267లోని 5.16 ఎకరాలపై ఓఎస్ నం.774/2011 ఆధారంగా కోర్టు స్టే కొనసాగుతోంది. అందుకే వీటిని పీవోబీ నిషేధిత జాబితాలో నమోదు చేసినట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ అధికారిక వెబ్‌‌సైట్‌లోనే దర్శనమిస్తుండడం గమనార్హం. ఓ వైపు సదరు సర్వే నంబర్లన్నీ పీవోబీలోనే కొనసాగిస్తూ వాటిని ప్లాట్లుగా రిజిస్ట్రేషన్లు చేస్తూనే ఉన్నారు. హెచ్ఎండీఏ అనుమతి పొందకపోయినా లే‌అవు‌ట్‌లోని ప్లాట్ల నంబర్లతో సహా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. 2021 నుంచి పదుల సంఖ్యలో లావాదేవీలు జరిగాయి. బెంగుళూరుకు చెందిన వాళ్లు కూడా కొనుగోలు చేశారు. మరి అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తే ఇంటి నిర్మాణాలకు ఎవరు అనుమతి ఇస్తారన్న అనుమానాలు తలెత్తకుండా ఇది గ్రామ పంచాయతీ లే‌అవుట్ అంటూ వినియోగదారులను మభ్యపెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *