పౌరుషాల సీమలో పవర్ ఎవరికి

సిరా న్యూస్,తిరుపతి;
గత ఎన్నికల్లో రాయలసీమలో జగన్ గెలుపు గురించి చెప్పాలంటే మాటలు చాలవు…రాష్ట్ర చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో జగన్ గుత్తాధిపత్యం చెలాయించారు. ఏకంగా 56 స్థానాల్లో 53 చోట్ల వైసీపీ జయకేతనం ఎగురవేసింది వైసీపీ. కడప, కర్నూలు జిల్లాల్లో ప్రత్యర్థుల ఖాతానే తెరవలేదంటూ వైసీపీ ఊచకోత ఏ రేంజ్‌లో సాగిందో అర్థమతువుంది. మొత్తం రాయలసీమలోనే గెలిచిందెవరంటే…ఒకటి చంద్రబాబు, మరొకటి ఆయన బావమరది నందమూరి బాలకృష్ణతోపాటు మరో సీనియర్ తెలుగుదేశం నేత పయ్యావుల కేశవ్‌ మాత్రమే. ఈసారి ఆ మూడు స్థానాలను సైతం కైవసం చేసుకుంటామని జగన్ ధీమా వ్యక్తం చేస్తుండగా…తెలుగుదేశం పూర్వ వైభవం సాధిస్తుందని చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు.కడప జిల్లాలో మొదటి నుంచి కాంగ్రెస్‌పార్టీదే హవా..వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఏకచత్రాధిపత్యంలో కాంగ్రెస్‌కు కంచుకోటగా తీర్చిదిద్దారు. అయినప్పటికీ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఏడుస్థానాలు గెలిచుకుని సత్తా చాటింది. ఆ తర్వాత కూడా కాంగ్రెస్‌కు దీటుగా జవాబిచ్చినా…గత ఎన్నికల్లో మాత్రం పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయింది. పదికి పదిస్థానాలు వైసీపీ ఖాతాలో పడ్డాయి. పులివెందుల నుంచి మరోసారి సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి( బరిలో దిగుతుండగా…టీడీపీ నుంచి పాత ప్రత్యర్థి బీటెక్ రవి పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ పోటీ నామమాత్రమే అయినప్పటికీ జగన్ మెజార్టీ ఎంత తగ్గిస్తే టీడీపీ అంత బలపడినట్లే లెక్క. ఇక్కడ వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి కూడా పోటీ చేస్తానంటూ చెప్పుకొస్తున్నారు. జిల్లాలో మరో కీలక నియోజకవర్గం కమలాపురం. ఇక్కడ నుంచి జగన్ మేనమామ రవీంధ్రనాథ్ రెడ్డి పోటీ చేస్తుండగా ఇదే స్థాన నుంచి నాలుగుసార్లు ఓటమి పాలైన పుత్తా నరసింహారెడ్డి ఇక పోటీ నుంచి విరమించుకుని ఆయన కుమారుడు చైతన్యరెడ్డిని ఈసారి పోటీకి దించారు. వరుస ఓటములతో సానుభూతి దక్కుతుందేమోనని పుత్తా కుటుంబం ఆశలుపెట్టుకుంది. కానీ ఈ నియోజకవర్గంలో వైఎస్‌ కుటుంబాన్ని కాదని వేరొకరు గెలవడమంటే అసాధ్యమనే చెప్పాలి. ఇక మరో ఆసక్తికర పోటీ కడప టౌన్‌లో కనిపిస్తోంది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉంటే కడపనగరంలో మొదటి నుంచి ఆ సామాజికవర్గానికే టిక్కెట్ కేటాయిస్తున్నారు . మూడు దశాబ్దాలుగా ముస్లింలే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుండంతో రెడ్డి సామాజికవర్గం గుర్రుగా ఉంది. దీంతో ఈసారి తెలుగుదేశం పార్టీ రెడ్డప్పగారి మాధవీరెడ్డిని బరిలోకి దింపి ప్రయోగానికి సిద్ధమైంది. వైసీపీనుంచి హ్యాట్రిక్ విజయం కోసం అంజాద్‌బాషాతహతహలాడుతున్నారు. రెడ్డి సామాజికవర్గం ఓట్లతోపాటు మహిళ సెంటిమెంట్‌ ఓట్లపై తెలుగుదేశం దృష్టిసారించింది.జమ్మలమడుగు) నుంచి వైసీపీ తరపును మరోసారి సుధీర్‌రెడ్డి పోటీలో నిలవగా…పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి కేటాయించే అవకాశం ఉంది. ఆ పార్టీ తరపున అమర్‌నాథ్‌రెడ్డిగానీ, ఆయన కుటుంబ సభ్యులు బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రొద్దుటూరు నుంచి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మరోసారి వైసీపీ తరపున బరిలో దిగుతుండగా….తెలుగుదేశం పార్టీ మాత్రం ఎవరూ ఊహించని విధంగా రాజకీయ కురువృద్ధుడు వరదరాజులరెడ్డికి టిక్కెట్ కేటాయించింది. 80ఏళ్ల వయసులో మరోసారి టిక్కెట్ సాధించి వరదరాజులురెడ్డి అందరినీ ఆశ్చర్యపరిచారు. 25 ఏళ్లపాటు ప్రొద్దుటూరుని ఏకఛత్రాధిపత్యంతో ఏలిన వరదరాజులురెడ్డి… గత రెండు దఫాలుగా ఆయన శిష్యుడే అయిన రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. 2019లో ఓడిపోయినప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్న ఆయన అనూహ్యంగా చంద్రబాబును మెప్పించి టిక్కెట్ సాధించారు. ఈ టిక్కెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉక్కు ప్రవీణ్‌రెడ్డి, లింగారెడ్డికి తీవ్ర నిరాశ ఎదురైంది.పౌరుషాల పురిటిగడ్డ కర్నూలు జిల్లాలోనూ గత ఎన్నికల్లో టీడీపీ ఖాతా తెరవలేదు. జగన్ ఒక్కఛాన్స్ దెబ్బకు ఆ పార్టీ నేతలంతా ఓటమిపాలైనా…జగన్ మోసాన్ని ప్రజలు తెలుసుకున్నారని….ఈసారి గెలుపు టీడీపీదేనని నేతలు దీమా వ్యక్తం చేస్తున్నారు. ఆళ్లగడ్డలో తరతరాలుగా రాజకీయ వైరం కలిగి ఉన్న ఆళ్లగడ్డలో మరోసారి భూమా, గంగుల కుటుంబాలు పోటీపడుతున్నాయి. తెలుగుదేశం నుంచి మాజీమంత్రి అఖిలప్రియ టిక్కెట్ దక్కించుకోగా…వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బ్రిజేంద్రరెడ్డి సమరానికి సై అంటున్నారు. కర్నూలు టిక్కెట్‌ను అనూహ్యంగా మాజీ ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్ దక్కించుకున్నారు. దీనికోసమే ఆయన తన ఉద్యోగానికి సైతం రాజీనామా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *