అన్ని వేళ్లు కేజ్రీ వైపే

సిరా న్యూస్;
ఢిల్లీ మద్యం పాలసీ కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇప్పటివరకు పలువురిని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడం ఈ కేసులోనే కీలక మలుపుగా మారింది. కొద్దిరోజుల పాటు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళింది. ఇంకేముంది రాజకీయ పైరవీలతో కేసును నీరు గార్చారని.. నిందితులు మొత్తం సేఫ్ అనే వ్యాఖ్యలు వినిపించాయి. ఈ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చారు. అప్పట్లో శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, అభిషేక్, బుచ్చిబాబు వంటి వారంతా అప్రూవర్లుగా మారారని ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ప్రకటించారు. వారు చెప్పిన వివరాల ఆధారంగా కవితను పద మార్లు విచారించారు. తర్వాత ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లారు. నళిని చిదంబరం కేసును ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. సుప్రీంకోర్టు కూడా కవితకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో.. ఈడీ సైలెంట్ అయిపోయింది. ఆలోగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రావడం.. ఆ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓడిపోవడంతో ఈడీ రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ కేసును తవ్వడం మొదలుపెట్టింది. చడిచప్పుడు లేకుండా హైదరాబాద్ వచ్చింది. కవిత ఇంట్లోకి సైలెంట్ గా వెళ్లిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించడంతో.. కవితను అరెస్టు చేసి తీసుకెళ్లింది.ఈ ఢిల్లీ లిక్కర్ కేసు విచారణకు రావాలని ఈడీ అధికారులు 9 సార్లు సమన్లు జారీ చేసినా.. ఆయన హాజరు కాలేదు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. గురువారం సాయంత్రం కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్న ఈడీ బృందం.. ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. పదవిలో ఉండగా అరెస్టయిన తొలి ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ రికార్డుల్లోకి ఎక్కారు. ఆయన అరెస్ట్‌తో ఆప్ భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. అయితే, అరెస్టయినా ఆయనే ప్రభుత్వాన్ని నడుపుతారని ఆప్ ప్రకటించింది.ఈడీ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన కొద్ది గంటలకే కేజ్రీవాల్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తొమ్మిదిసార్లు ఈడీ సమన్లు జారీచేసినా… ఆయన హాజరుకాలేదు. మనీల్యాండరింగ్ కేసులో ఇటీవల ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే, తన రాజీనామాను గవర్నర్ ఆమోదించే వరకూ అరెస్ట్ మెమోపై ఆయన సంతకం చేయలేదు. అరెస్ట్‌‌కు ముందు ఆయన రాజీనామా చేసి.. తన వారసుడిగా చంపై సోరెన్‌కు పగ్గాలు అప్పగించారు.ఈ క్రమంలోనే కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తారని.. గత కొన్ని రోజుల నుంచి ఆప్ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ సహా పలువురు నేతలు కూడా పేర్కొంటున్నారు. అన్నట్టుగానే గురువారం రాత్రి కేజ్రీవాల్ నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారుల బృందం రెండున్నర గంటల తర్వాత ఆయనను అరెస్ట్ చేస్తున్నట్లు కేజ్రీవాల్ భార్యకు సమాచారం అందించారు. అరెస్ట్ తర్వాత ఈ ఢిల్లీ మద్యం కేసు గురించి ఈడీ అధికారులు సంచలన విషయాలు వెల్లడించారు.ఢిల్లీ మద్యం పాలసీ విధానం 2022 రూపకల్పన చేసే సమయంలో కొందరు వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అప్పటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కలిసి కుట్ర చేశారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌ను కుట్రదారుగా ఈడీ అభివర్ణించింది. ఈ కేసులో సౌత్ గ్రూప్‌కు లబ్ధి చేకూర్చేలా ఢిల్లీ మద్యం పాలసీ విధానం 2022 ను రూపొందించారని ఈడీ ప్రధాన ఆరోపణ చేస్తోంది.మద్యం పాలసీ విధానంలో మార్పులు చేర్పులు చేసిన దానికి ప్రతిఫలంగా సౌత్ గ్రూప్ ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్ల ముడుపులు ఇచ్చిందని పేర్కొంది. వాటిని 2022 గోవా అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ వినియోగించుకుందని పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఈడీ అధికారులు సౌత్ లాబీగా పేర్కొంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ చేసిన కొందరు నిందితులు.. మరికొందరు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేరు ఉందని.. ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సందర్భంగా నోట్‌లో చేర్చారు.ఇక ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితుల్లో ఒకరైన విజయ్ నాయర్ తరచూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కార్యాలయానికి వెళ్లేవారని.. ఎక్కువ సమయం అక్కడే గడిపేవారని ఈడీ వెల్లడించింది. లిక్కర్ పాలసీ గురించి సీఎం కేజ్రీవాల్‌తో చర్చించినట్లు మద్యం వ్యాపారులకు విజయ్ నాయర్ చెప్పినట్లు ఈడీ ఆరోపణలు చేసింది. ఇందులో భాగంగానే ఇండో స్పిరిట్ యజమాని సమీర్ మహేంద్రు.. సీఎం కేజ్రీవాల్‌ను కలిసేందుకు విజయ్ నాయర్‌ని పంపినట్లు తెలిసింది. సౌత్ లాబీలో గతంలో నిందితుడిగా ఉండి ఇప్పుడు అప్రూవర్‌గా మారిన వైఎస్సార్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ్.. తన తండ్రి మద్యం పాలసీ గురించి తెలుసుకోవడానికి కేజ్రీవాల్‌ని కలిసినట్లు విచారణలో చెప్పినట్లు తెలిసింది.ఇక మరో ఆప్ కీలక నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మాజీ సెక్రటరీ సీ అరవింద్ ఈడీకి డిసెంబర్ 2022 లో ఒక స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. మనీష్ సిసోడియా నుంచి మంత్రుల బృందం పంపిన నివేదికకు సంబంధించిన డ్రాఫ్ట్‌ను తాను పొందినట్లు అరవింద్ తెలిపారు. సిసోడియా ఫోన్ చేసి తనను సీఎం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లమని చెప్పారని.. అయితే ఆ సమయంలో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ కూడా అక్కడే ఉన్నారని.. ఆ సమయంలో తాను డాక్యుమెంట్ కూడా చూశానని చెప్పారు. మంత్రుల బృందం సమావేశంలో సూచించిన ప్రతిపాదనలు ఆ డాక్యుమెంట్‌లో లేకపోవడంతో తాను ఆశ్చర్యపోయానని.. అయితే ఆ డాక్యుమెంట్ మంత్రుల బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగానే తయారు చేయమని కోరినట్లు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *