బిగ్ బాస్ శివాజీకి అమరావతి లింక్…

సిరా న్యూస్,విజయవాడ;
బిగ్ బాస్ సీజన్ 7లో ఫైనల్స్ దగ్గర పడుతున్నాయి. దీంతో హౌజ్‌లో కంటెస్టెంట్స్ ఎంత అలర్ట్‌గా ఉంటారో.. బయట వారికి ఓటు వేసేవారు కూడా అంతే అలర్ట్‌గా ఉండాలి. బిగ్ బాస్ ప్రేక్షకులు వేసే ఓట్లు.. కంటెస్టెంట్స్‌ను నామినేషన్స్ నుంచి తప్పించడానికి ఎంత ఉపయోగపడతాయో.. వారిని ఫైనల్స్ తీసుకెళ్లడానికి కూడా అంతే ఉపయోగపడతాయి. అందుకే బయట ఉన్న శివాజీ టీమ్ అలర్ట్ అయ్యారు. మామూలుగా తమ కంటెస్టెంట్‌ను సపోర్ట్ చేయడం, వారు ఏం చేసినా కరెక్ట్ అని చెప్పడం, ఓట్లు వేయమని అడగడం మాత్రమే పీఆర్ టీమ్స్ లక్ష్యం. కానీ శివాజీ టీమ్ మాత్రం దీనికి మరింత కొత్తదనాన్ని యాడ్ చేసింది.బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయినప్పటి నుంచే శివాజీ మీద ప్రేక్షకుల్లో పాజిటివ్ అభిప్రాయం ఏర్పడింది. మిగతావారంతా తమకు ఇచ్చిన టాస్క్‌ను రూల్ బుక్ ప్రకారం ఆడితే.. శివాజీ మాత్రం అందులో కొత్తదనాన్ని వెతికి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేవారు. దీంతో బిగ్ బాస్ ప్రేక్షకుల్లో ఆయనకు సపోర్ట్ బాగా పెరిగిపోయింది. సీజన్ మొదలయిన కొన్ని వారాల తర్వాత శివాజీలాంటి ఆటతీరు ఎవరూ కనబరచకపోవడంతో ఆయనే విన్నర్ అని కూడా చాలామంది ఫిక్స్ అయిపోయారు. కానీ ఇంతలోనే పల్లవి ప్రశాంత్, యావర్‌లతో సావాసం.. ఆయనకు హౌజ్‌లోనే కాదు.. బయట కూడా నెగిటివిటీ తెచ్చిపెట్టింది. శివాజీ ఆడే ప్రతీ ఆటలో వారికి ఫేవర్ చేస్తున్నట్టుగానే అనిపించేది. గత కొన్నివారాలుగా ఆయన ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. దీంతో ప్రేక్షకుల్లో నెగిటివిటీ మరింత పెరిగిపోయింది.బిగ్ బాస్ హౌజ్‌లో ఎవరూ పర్ఫెక్ట్ కాదు. అందరూ తమ తమ గేమ్ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తుంటారు. ఒకవేళ తమ గేమ్ వేరేవాళ్లకు నచ్చకపోయినా.. లేదా వారి ప్రవర్తనలో ఏమైనా లోపాలు ఉన్నా.. ఇతర కంటెస్టెంట్స్ చెప్తారు. శివాజీ కూడా ఇతర కంటెస్టెంట్స్‌లో ఉన్న లోపాలను అలాగే చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆయన చెప్పే పద్ధతి చాలామందికి నచ్చలేదు. నేనేం చేసినా కరెక్టే, నాకు చెప్పేంతవారు ఎవరూ లేరు అనే మనస్థత్వం శివాజీలో పెరిగిపోయిందనేది కొందరు ప్రేక్షకుల అభిప్రాయం. ఇతరులలో తప్పులు వెతికి చెప్పడం, తానేం చేసినా కరెక్ట్ అనుకోవడం ప్రేక్షకులకు నచ్చడం లేదు. అందుకే గత రెండు వారాల్లో ఆయన ఓటింగ్ శాతం కూడా చాలా తగ్గిపోయింది. దీంతో శివాజీ పీఆర్ టీమ్ అలర్ట్ అయ్యింది.
‘బిగ్ బాస్ షో చూస్తున్న, చూడకపోయినా ఈ నెంబర్‌(శివాజీ ‘బిగ్ బాస్’ ఓటింగ్ నెంబర్)కు మిస్డ్ కాల్ ఇవ్వండి. ఎందుకంటే నిరంతరం అమరావతి రైతులకోసం, ఆంధ్రప్రదేశ్ కోసం శ్రమించిన శివాజీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది’’ అంటూ వాట్సాప్, సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుంది. శివాజీకి ఓటు వేసే నెంబర్‌‌ను అందరికీ ఫార్వర్డ్ చేస్తోంది ఆయన టీమ్. బిగ్ బాస్‌లాంటి షోలో గెలవడానికి ఓట్లు వేయించుకోవడం కోసం రాజకీయాలను మధ్యలోకి లాగుతున్నారని చాలామంది ప్రేక్షకులు ఫీలవుతున్నారు. పైగా ఆయనకు రాజకీయపరంగా సపోర్ట్ ఉండడం కూడా పెద్ద ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు. ఈ మెసేజ్‌ను బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న బిగ్ బాస్ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని శివాజీని గెలిపించే ప్రయత్నం జరుగుతోందని అర్థం చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *