సిరా న్యూస్, ఆదిలాబాద్:
స్వేచ్చగా ఓటు హక్కును వినియోగించుకోవాలి
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లంత స్వేచ్చగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఐ డి సాయినాథ్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంతో పాటు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఎస్సై పురుషోత్తం, సీఆర్పీఎఫ్ సీఐ సూరజ్, పోలీసులు, కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామాల్లో కవాతు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రతీ ఒక్కరు సహకరించాలని కోరారు. స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి తాము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రతీ ఒక్కరు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. బెల్ట్షాప్లు నిర్వహించడం, అనవసర గొడవలకు పాల్పడటం వంటి చర్యలు చేస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. సమాజంలో శాంతిభద్రతలను పెంపొందించడమే లక్ష్యంగా తామంత పనిచేస్తున్నామని, ప్రజలు నిశ్చింతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.