వ్యక్తి కేంద్ర రాజకీయాలకు మంగళమేనా

సిరా న్యూస్;

దేశంలో వ్యక్తి కేంద్రంగా పనిచేస్తున్న రాజకీయ పార్టీలు సంక్షోభ స్థితిని ఎదుర్కొంటున్నాయి. విశేష ప్రజాదరణ కల్గిన ఒక ‘బలమైన నేత’ లేదా కుటుంబాన్ని ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న రాజకీయ పార్టీల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ సిద్ధాంతాలు, క్షేత్రస్థాయి నుంచి నిర్మాణం వదిలిపెట్టి వ్యక్తిపూజతో ఒక నేత కేంద్రంగా పనిచేసిన పార్టీలు.. ఆ నేత బలహీనపడినా, లోకం నుంచి నిష్క్రమించినా ఒక్కసారిగా చతికిలపడుతున్నాయి. ఒక్క దశాబ్దకాలం వెనక్కి తిరిగి చూస్తే చాలు.. ఇందుకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్నాయి. శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, బిజూ జనతాదళ్, ఆర్జేడీ, అన్నాడీఎంకే.. ఆ మాటకొస్తే జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ కూడా ఆ జాబితాలో ఉంది. కొన్ని పార్టీల విషయంలో ఆయా నేతలకు రాజకీయ వారసులు లేకపోవడం కారణంగా కనిపిస్తుంటే, మరికొన్నింటి విషయంలో పేరుకు వారసులైనా రాజకీయ వారసత్వాన్ని కొనసాగించలేకపోవడం, నాయకత్వ లక్షణాలు లేకపోవడం కారణాలుగా కనిపిస్తున్నాయి.‘టైగర్’గా అందరూ పిలుచుకునే బాల్‌ థాకరే స్థాపించిన శివసేన వయస్సులో భారతీయ జనతా పార్టీ కంటే పెద్దది. 1966 జూన్ 19న ఏర్పాటైన ఈ పార్టీకి అర్థ శతాబ్దం కంటే ఎక్కువ చరిత్ర ఉంది. పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాకరే హయాంలో కేవలం మహారాష్ట్రలోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. అలాంటి పార్టీ ఇప్పుడు ఎన్నికల గుర్తునే కాదు, పార్టీ పేరును కూడా కోల్పోవాల్సి వచ్చింది. బాల్ థాకరే మరణానంతరం పార్టీని ఐకమత్యంగా ఉంచడంలో ఆయన కుమారుడు ఉద్ధవ్ థాకరే విఫలమయ్యారు. మొట్టమొదట థాకరే కుటుంబానికే చెందిన రాజ్ థాకరే వేరుపడి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఏక్‌నాథ్ షిండే చీలికతో పార్టీ అసలు గుర్తును, పేరును ఉద్దవ్ వదులుకోవాల్సి వచ్చింది. మొత్తంగా బాల్ థాకరే రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడంలో ఆయన తర్వాతి తరం నేతలు విఫలమయ్యారు. ఫలితంగా పార్టీ సైతం చీలికలు, పేలికలపై తన ప్రాభవాన్ని కోల్పోయిందిశివసేన తరహాలో మహారాష్ట్రలో ఊపిరి పోసుకున్న మరో పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధినాయకత్వంతో విబేధించి సొంత కుంపటి పెట్టుకుని శరద్ పవార్ ఏర్పాటు చేసిన పార్టీ ఇది. ఎంతో రాజకీయ చతురత కల్గిన ఆయన మహారాష్ట్రతో పాటు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు. రాష్ట్రంలో పార్టీ నాయకత్వం, యంత్రాంగం పూర్తిగా ఆయనపైనే ఆధారపడింది. ఆయన పేరుతోనే పార్టీకి ఓట్లు పడ్డాయి. పూర్తి వ్యక్తికేంద్రంగా రాజకీయాలు చేస్తూ వచ్చిన ఆ పార్టీలో సొంత కుటుంబం కారణంగానే సంక్షోభం ఎదురైంది. శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ పార్టీని చీల్చడమే ఎదురు దెబ్బ అనుకుంటే.. ఆ చీలిక వర్గమే అసలు పార్టీ అంటూ కేంద్ర ఎన్నికల సంఘం చెప్పడం మరో శరాఘాతంగా మారింది. శరద్ పవార్ కేంద్రంగా ఆయన చుట్టూ నడిచిన పార్టీ, గతేడాది నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన మరుక్షణం నుంచే బలహీనపడడం మొదలైంది. ఇది గమనించిన శరద్ పవార్ పునరాలోచించుకుని తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. పార్టీ నాయకత్వ బాధ్యతల్ని ఆశించిన మేనల్లుడు అజిత్ పవార్‌కు అవి దక్కకపోవడంతో తన వర్గం నేతలతో కలిసి చీలిక తీసుకొచ్చారు. శివసేన తరహాలోనే శరద్ పవార్ తన పార్టీ పేరును, ఎన్నికల గుర్తును కోల్పోవాల్సి వచ్చింది. అత్యధిక జనాభా, అత్యధిక సంఖ్యలో పార్లమెంట్ సీట్లు కల్గిన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల ఆశాజ్యోతిగా.. అందరూ ప్రేమతో నేతాజీ అని పిలుచుకునే ములాయం సింగ్ యాదవ్ స్థాపించిన సమాజ్‌వాదీ పార్టీ ఇప్పుడు గత వైభవాన్ని కోల్పోయింది. రాజ్యాధికారం పొందలేకపోయిన కులాలకు అధికారాన్ని అందించడమే లక్ష్యంగా కుల రాజకీయాలు చేసిన ఈ పార్టీ.. కాలక్రమంలో కేవలం యాదవులు, ముస్లింలకు మాత్రమే ప్రాధాన్యత కల్పించే పార్టీగా ముద్రను వేసుకుంది. వయోభారం, అనారోగ్యంతో పార్టీ పగ్గాలను తన కుమారుడు అఖిలేశ్ యాదవ్‌కు అప్పగించినప్పుడు పార్టీలో అంతర్గత విబేధాలు తలెత్తి ములాయం సోదరుడు శివ్‌పాల్ యాదవ్ వేరు కుంపటి పెట్టుకున్నారు. ఆ తర్వాత మళ్లీ అబ్బాయి అఖిలేశ్‌తో కలిసిపోయినా సరే.. పార్టీ గతంలో మాదిరిగా తన ప్రభావాన్ని చూపలేకపోతోంది. అఖిలేశ్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఎదుర్కొన్న 2017, 2022 అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2019 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా పరాజయాలను చవిచూడాల్సి వచ్చింది. ములాయం చేతిలో పార్టీ ఉన్నప్పుడు వెలుగు వెలిగిన ఆ పార్టీ, ఇప్పుడు ఉనికి చాటుకోడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన అఖిలేశ్ యాదవ్, వారసత్వంగా పార్టీని, రాజ్యాధికారాన్ని అందుకోగలిగారు తప్ప తన సొంత రాజకీయ చతురత, నైపుణ్యం, నాయకత్వ లక్షణాలతో ఏదీ సాధించలేకపోతున్నారు.ఇదే రాష్ట్రంలో దళిత, బహుజన వర్గాల్లో విశేష ప్రజాదరణ కల్గిన కాన్షీరాం ఏర్పాటు చేసిన బహుజన్ సమాజ్ పార్టీ కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. మాయావతి హయాంలో రాజ్యాధికారాన్ని కూడా సాధించింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే ప్రయత్నాలు జరిగాయి. కాన్షీరాం హయాంలో పార్టీలో ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని తయారు చేయగలిగారు. కానీ మాయావతి తానే సర్వస్వం అన్నట్టుగా వ్యవహరించడంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం లేకపోయింది. మాయావతి కేంద్రంగానే పార్టీ పనిచేయడం, ఆమె తప్ప ఆ పార్టీలో మరొక బలమైన నేత ఎవరూ లేకపోవడంతో.. ఇప్పుడు వారసత్వ సమస్యను ఎదుర్కొంటోంది. మాయావతి తర్వాత పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.సోషలిస్ట్ నేత జయప్రకాశ్ నారాయణ్ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిర్మించిన ఉద్యమం నుంచి ఉద్భవించిన నేతల్లో లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్, ములాయం సింగ్ యాదవ్, దేవెగౌడ సహా ఇంకా చాలామందే ఉన్నారు. ఆనాడు ఏర్పడ్డ జనతా పార్టీ తర్వాతి కాలంలో చీలికలు పేలికలు కాగా.. నాటి నేతలంతా తలా ఒక సొంత కుంపటి ఏర్పాటు చేసుకున్నారు. మొత్తంగా జనతా దళ్ (యునైటెడ్) పేరుతో నితీశ్ కుమార్, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పేరుతో లాలూ ప్రసాద్ యాదవ్ గత 3-4 దశాబ్దాలుగా బిహార్ రాజకీయాలను ఏలుతున్నారు. వాటిలో లాలూ చేతిలోని ఆర్జేడీ పూర్తిగా లాలూ కుటుంబ పార్టీగా మారిపోయింది. ఆ కుటుంబంలో అనేక మంది అనేక పదవులు అనుభవించారు. కుల – కుటుంబ రాజకీయాలు, అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయిన ఆ పార్టీలో లాలూకు వారసులుగా ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నప్పటికీ.. అంతర్గతంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.పదవులు, అధికారం తనకు, తన కుటుంబానికి లేదా తన కులానికి మాత్రమే దక్కాలి అనుకున్న ప్రాంతీయ, జాతీయ పార్టీలు క్రమక్రమంగా ప్రజలకు దూరమవుతున్నాయి. రాజ్యాధికారాన్ని దక్కించుకోలేకపోయిన అల్పసంఖ్యాక వర్గాలకు సైతం అధికారాన్ని అప్పగిస్తూ, నాయకత్వాన్ని తయారు చేస్తున్న బీజేపీ వంటి పార్టీలు ప్రజాదరణ పొందుతూ క్రమక్రమంగా బలపడుతున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *