వారం రోజుల్లో 305 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు
వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్
సిరా న్యూస్,పెద్దపల్లి;
రైతులు పండించిన ధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పెద్దపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డు లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ యాసంగి పంట ధాన్యం కొనుగోలు చేసేందుకు వీలుగా జిల్లాలో ప్రణాళిక బద్దంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామని, జిల్లాలో వరి కోతల ఆధారంగా మరో 7 రోజులలో పూర్తిగా 305 ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. యాసంగి సీజన్ కు సంబంధించి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసామని, ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవసరమైన ప్యాడి క్లీనర్లు, తేమ శాతం మీటర్లు, టార్ఫాలిన్లు, డిజిటల్ వెయింగ్ యంత్రాలు, మొదలైన సామాగ్రి సిద్ధం చేశామని, వేసవి దృష్ట్యా ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద త్రాగునీరు, నీడ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. రైతుల వద్ద నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోగా చెల్లింపులు జరిగే విధంగా ఏర్పాట్లు చేశామని, రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టుకుని నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకుని రావాలని కలెక్టర్ కోరారు. చివరి గింజ వరకు నాణ్యమైన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. పెద్దపల్లి మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా సహకార అధికారి శ్రీమాల, జిల్లామార్కెటింగ్ అధికారి ప్రవీణ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ శ్రీకాంత్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ సుల్తానాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. సుల్తానాబాద్ లో ధాన్యం కొనుగోలు ప్రారంభ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి శ్రీమాల, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ శ్రీకాంత్, సంభందిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.