సిరా న్యూస్,ముంబై;
దేశంలో డిజిటల్ లావాదేవీలు భారీగా కొనసాగుతున్నాయి. డిజిటల్ మోసాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా బ్యాంకుల ప్రతినిధులతో ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివేక్ జోషీ సమావేశం నిర్వహించారు. ఆర్థిక వ్యవహారాలు, రెవెన్యూ, టెలికాం, ఐటీ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాతోపాటు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. డిజిటల్ మోసాలు, వాటిని ఎదుర్కోవడంలో తలెత్తుతోన్న సవాళ్లకు సంబంధించి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ప్రెజెంటేషన్ ఇచ్చింది.డిజిటల్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు బ్యాంకులు తమ వ్యవస్థలను పటిష్ఠపరచుకోవాలని వివేక్ జోషీ సూచించారు. ఆధార్ ఆధారిత పేమెంట్లలో మోసాలు, సమాచార భద్రతపై దృష్టి సారించాలని రాష్ట్రాలను అలర్ట్ చేశారు. వ్యాపారుల కేవైసీ ప్రామాణీకరణంపైనా ఈ సమావేశంలో చర్చించామన్నారు. మరోవైపు ఇటీవల యూకో బ్యాంక్ నుంచి ఖాతాదారుల అకౌంట్లలో రూ.820 కోట్ల నగదు జమ అయింది. వెంటనే స్పందించిన అధికారులు.. ఖాతాదారుల నుంచి రూ.649 కోట్ల వరకూ రికవరీ చేశారు. అయితే, ఇది సాంకేతిక సమస్య కారణంగా జరిగిందా? లేక హ్యాకింగ్ కోణం ఉందా? అన్న విషయంపై బ్యాంకు నుంచి స్పష్టత రాలేదు. దీనిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర దర్యాప్తు సంస్థలను సంప్రదించినట్లు యూకో బ్యాంక్ తెలిపింది.ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సైబర్ మోసాలను అరికట్టడానికి వివిధ ఏజెన్సీల మధ్య మెరుగైన సమన్వయం ఎలా ఉండాలనే దానిపై కూడా చర్చించారు. డిజిటల్ మోసాలను అరికట్టేందుకు, అనుమానాస్పద లావాదేవీల కారణంగా ప్రభుత్వం 70 లక్షల మొబైల్ నంబర్లను సస్పెండ్ చేసినట్లు ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి మంగళవారం తెలిపారు. ఆర్థిక సైబర్ భద్రత మరియు పెరుగుతున్న డిజిటల్ చెల్లింపు మోసాలకు సంబంధించిన సమస్యలపై చర్చించడానికి జరిగిన సమావేశంలో జోషి మాట్లాడుతూ, ఈ విషయంలో వ్యవస్థను మరియు ప్రక్రియలను బలోపేతం చేయాలని బ్యాంకులను కోరినట్లు చెప్పారు.