సిరాన్యూస్, జైనథ్
రైతుల సమస్యల పరిష్కారానికి పోరాడుతాం
మాజీ ఎమ్మెల్యే జోగురామన్న
పార్టీ చేరికలపైనే పూర్తి దృష్టి సారించిన మంత్రులు.. రైతులు ఎదుర్కుంటున్న కష్టాలపై కన్నెత్తి చూడడం లేదని మాజీ మంత్రి, బీ.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న మండిపడ్డారు. ఇకనైనా రైతుల ఇబ్బందులను గుర్తించి వారికి గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలనీ, అన్నం పెట్టే అన్నదాతకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు. జైనథ్ మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. కాప్రి, ఉమ్రి, కరింజ తదితర గ్రామాల్లోని పంట క్షేత్రాలను పరిశీలించారు. పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. జలాశయాల్లో నీటి మట్టం అడుగంటడం, యాసంగి పంటకు అవసరమైన సాగు నీరు అందకపోవడంతో పంట నష్టం జరుగుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి, జొన్న తదితర పంట క్షేత్రాలను సందర్శించి రైతులకు ధైర్యం చెప్పారు. . ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ పంట నష్టం జరిగితే గత బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం ఎకరానికి పది వేల రూపాయల చొప్పున పరిహారం అందించినా, అప్పటి కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం పొలాలు బీడు వారి పంట నష్టం జరిగితే పట్టించుకునే నాథుడు లేడని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి కేవలం పార్టీ చేరికలపైనే దృష్టి సారించి.. సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని, ఇప్పటివరకు కనీసం ఒక పంట క్షేత్రాన్ని సందర్శించకపోవడం, రైతులకు భరోసా కల్పించకపోవడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే సైతం ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారని మండిపడ్డారు. రైతుల సంక్షేమం కోసం పార్టీలకు అతీతంగా ముందుకు వస్తామని స్పష్టం చేశారు. 24 గంటల విద్యుత్తు, రైతు బంధు కింద ఆర్ధిక సహాయం, పంట సాగుకు నీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. రైతు కూలీలకు సైతం పెట్టుబడి సహాయం అందిస్తామన్న హామీ సంగతేంటని ప్రశ్నించిన ఆయన.. అయిదెకరాల వరకు రైతుబందు నగదు జమ చేశామని చెప్తున్నప్పటికీ, రెండెకరాల వారికి కూడా చాలా మందికి రాలేదని అన్నారు. గతంలో అన్నదాతలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చి, పంట నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో నాయకులూ లింగారెడ్డి. రైతులు.తదితరులు పాల్గొన్నారు.