సిరాన్యూస్, జైనథ్
రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని
* రైతు బంధు సమితి మాజీ జిల్లా కో ఆర్డినేటర్ రోకండ్ల రమేష్
* జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు వినతి
అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతన్నలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రైతు బంధు సమితి మాజీ జిల్లా కో ఆర్డినేటర్ రోకండ్ల రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం అదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కి వినతిపత్రం అందించారు. రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను అందులో ప్రస్తావించారు. యాసంగి నుండి 500 బోనస్ ఇవ్వాలని కోరారు. అకాల వర్షాలు, వడగండ్ల వాన కారణంగా జరిగిన పంట నష్టం తీవ్రతను వివరిస్తూ రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు మాజీ రైతుబందు సమితి జిల్లా కో ఆర్డినేటర్ రోకండ్ల రమేష్ మాట్లాడుతూ అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి 25 వేల రూపాయల చొప్పున పరిహారం అందించాలని కోరారు. శనగ, మొక్కజొన్న పంటలను గిట్టుబాటు ధరలతో కొనుగోలు చేయాలన్నారు. రైతు బంధు కింద పెట్టుబడి సహాయం అందించడంతో పాటు రైతు బీమా అమలు చేయాలనీ పేర్కొన్నారు. అన్నదాతలు ఎదుర్కుంటున్న ఇబ్బందులను పరిష్కరించని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు.కార్యక్రమంలో బీఆర్ ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు విజ్జగిరి నారాయణ, ఎంపీపీ లు గండ్రత్ రమేష్, మార్శెట్టి గోవర్ధన్, రైతు బంధు లింగ రెడ్డి, కుమ్ర రాజు, మెట్టు ప్రహ్లాద్, దాసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.