పారాచూట్ లీడర్స్ కే టిక్కెట్లు

సిరా న్యూస్,విజయవాడ;
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఏపీ పాలిటిక్స్ రసవత్తరంగా మారతున్నారు. కండువా మారిస్తే టికెట్‌ గ్యారంటీ. పారాచూట్‌ నేతలు భారీ సంఖ్యలో జనసేనలో ల్యాండ్‌ అవుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను తన్నుకు పోతున్నారు. వలస నేతల దెబ్బకు ఒరిజినల్‌ నేతలు పులుసులో పడ్డారు. దిగుమతి అవుతున్న నేతలతో పాత లీడర్లు పరేషాన్‌ అవుతున్నారు.కండువా మార్చెయ్‌.. టికెట్‌ పట్టెయ్‌. ఈ ఫార్ములా జనసేనలో బాగా వర్కవుట్‌ అవుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా టీడీపీ నుంచి జనసేనలో చేరుతున్న నేతలకు టికెట్‌పై అభయం దొరుకుతోంది. వైసీపీ నుంచి కూడా జనసేన లోకి జంప్‌ కొట్టి ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు దక్కించుకున్నారు కొందరు నేతలు. పొత్తులో భాగంగా 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లను జనసేనకు కేటాయించారు. జనసేన నుంచి చాలామంది నేతలు కర్చీఫ్‌ వేసుకుని కూర్చున్న స్థానాల్లో కూడా టీడీపీ, వైసీపీ నుంచి దిగుమతి చేసుకున్న నేతలే టికెట్లు దక్కించుకున్నారు. జనసేనకు కేటాయించిన రెండు ఎంపీ స్థానాల్లో ఒకటి వైసీపీ నుంచి వచ్చి జనసేన కండువా కప్పుకున్న నేతకే దక్కింది. అంటే ఎంపీ సీట్లలో 50 శాతం పారాచూట్‌ నేతలకే దక్కాయి. ఇక జనసేనకు కేటాయించిన 21 అసెంబ్లీ స్థానాల్లో కూడా మూడో వంతుకు పైగా సీట్లను టీడీపీ, వైసీపీ నుంచి వచ్చిన పారాచూట్‌ లీడర్సే దక్కించుకున్నారు. ఇది మొదటినుంచి జనసేననే నమ్ముకున్న నేతలకు మింగుడు పడకపోయినా, పొత్తు ధర్మం వాళ్లను చిత్తు చేస్తోంది.టీడీపీ నుంచి అవనిగడ్డ అసెంబ్లీ టికెట్ ఆశించారు మండలి బుద్ధప్రసాద్. కానీ పొత్తులో ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. దీంతో టీడీపీ నుంచి జనసేనలో చేరిన మండలికి లైన్‌ క్లియర్‌ అయిందని సమాచారం. ఇక పాలకొండలో కూడా సేమ్‌ సీన్‌ కనిపిస్తోంది. పాలకొండ అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. దీంతో నిమ్మక జయకృష్ణ..టీడీపీని వీడి జనసేన కండువా కప్పుకున్నారు. ఆయనకు టికెట్‌ రావడం లాంఛనమే అంటున్నారు. అంతకుముందు సైకిల్‌ దిగి జనసేన కండువాను కప్పుకున్న పులపర్తి రామాంజనేయులు.. భీమవరం జనసేన అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇక వైసీపీ నుంచి జనసేనలో చేరిన ఆరణి శ్రీనివాసులకు తిరుపతి అసెంబ్లీ టికెట్‌ దక్కింది.ఏపీ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన విశాఖ సౌత్‌ సీటు కూడా పారాచూట్ నేతకే దక్కింది. వైసీపీని వీడి జనసేన కండువా కప్పుకున్న వంశీకృష్ణకు టికెట్‌ దక్కింది. ఇక వైసీపీ నుంచి జనసేనలో చేరిన పంచకర్ల రమేష్‌ బాబు పెందుర్తి అసెంబ్లీ టికెట్‌ దక్కించుకున్నారు. రైల్వే కోడూరు జనసేన అభ్యర్థి డాక్టర్‌ యనమల భాస్కర రావు కూడా వైసీపీ నుంచి పవన్‌ పార్టీలోకి దిగుమతి అయిన నేత. ఇక దశాబ్దానికి పైగా వైసీపీతో కొనసాగిన బాలశౌరి…జనసేన నుంచి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.టీడీపీ, వైసీపీ నుంచి జనసేనకు అభ్యర్థులు సప్లయ్‌ అవుతున్నారు. పారాచూట్‌ నేతలకు టికెట్ గ్యారంటీ స్కీమ్‌.. గ్లాసు నేతలను పరేషాన్‌ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *