సిరా న్యూస్,నెల్లూరు;
: ఏపీలో కొన్ని నియోజకవర్గాలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇవన్నీ కీలక నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలే. రాష్ట్రంలో పేరు మోసిన నాయకులు, వాయిస్ ఉన్న నేతలు పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో ఎలాగైనా ఓడించాలని ప్రత్యర్థి పార్టీలు కంకణం కట్టుకున్నాయి. అందుకే వీలైనంత సమయాన్ని ఎక్కువగా ఆ నియోజకవర్గాల ప్రచారానికి కేటాయించాలని అధినేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం జగన్ మేం సిద్ధం అంటూ బస్సు యాత్ర చేపడుతున్నారు. రోజుకు ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో యాత్ర ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబు సైతం రోజుకు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ సైతం తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటన పూర్తి చేశారు. జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.గత ఎన్నికల్లో టిడిపి గెలిచిన 23 అసెంబ్లీ స్థానాలను జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హిందూపురం, ఉరవకొండ, కుప్పం, గుంటూరు వెస్ట్, చీరాల, పరుచూరు, పాలకొల్లు, పిఠాపురం, నరసాపురం, పెద్దాపురం, విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాలు, ఇచ్చాపురం, టెక్కలి.. ఇలా చాలా నియోజకవర్గాలను జగన్ టార్గెట్ చేశారు. గత ఎన్నికల్లో అంతటి ప్రభంజనంలో సైతం అక్కడ టిడిపి అభ్యర్థులు గెలిచారు. అందుకే ఈసారి ఒకటికిరెండుసార్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మిగతా నియోజకవర్గాల కంటే ఎక్కువ సమయాన్ని కేటాయించాలని భావిస్తున్నారు.అటు చంద్రబాబు సైతం కొన్ని నియోజకవర్గాలను టార్గెట్ చేసుకుంటున్నారు.పులివెందుల, పుంగనూరు, నగిరి, చిలకలూరిపేట, మచిలీపట్నం, గుడివాడ, పెనమలూరు, కాకినాడ సిటీ, రాజమండ్రి సిటీ, గాజువాక, పలాస, చీపురుపల్లి వంటి నియోజకవర్గాల విషయంలో చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ప్రత్యేక వ్యూహాలను సైతం అమలు చేస్తున్నారు. అటుపవన్ కళ్యాణ్ సైతం చాలా నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. జనసేన పోటీ చేయబోయే 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అదే సమయంలో తనపై వ్యక్తిగత దాడి చేసే వైసిపి నేతల నియోజకవర్గాల్లో సైతం పవన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.మే 13 ఎన్నికల పోలింగ్ జరగనుండడంతో.. మే 11 వరకు ఎన్నికల ప్రచారం చేసుకునే వీలుంటుంది. ఈ లెక్కన దాదాపు 41 రోజుల సమయం ఉంది. అందుకే తమ వారి కంటే.. తమను ఇబ్బంది పెట్టిన నేతలు పోటీ చేయబోయే నియోజకవర్గాలపైనే అధినేతల ఫోకస్ ఉంది.