సిరాన్యూస్, ఆదిలాబాద్
కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకే రైతు దీక్ష : మాజీ మంత్రి జోగురామన్న
6న ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ఎదుట రైతు దీక్ష
అన్నదాతలకు బూటకపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో మాత్రం నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తోందని, రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తే సహించే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగురామన్న స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుతో కలిసి ఆయన మాట్లాడారు. అన్నదాతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనల మేరకు ఈనెల ఆరవ తేదిన స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ఎదుట రైతు దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. రైతులంతా పార్టీలకు అతీతంగా దీక్షలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఎకరానికి పదిహేను వేల రూపాయల రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్ధిక సహాయం తదితర హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం బుట్టదాఖలు చేస్తోందని మండిపడ్డారు. సోనియా గాంధీ జన్మదినం నుండి అమలు చేస్తామన్న రుణమాఫీ హామీ నాలుగు నెలలైనా అమలు కాలేదని గుర్తు చేశారు. పంటలను బోనస్ తో కొనుగోలు చేస్తామన్న మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, అదేవిధంగా మూడు లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాలను మంజూరు చేయాలనీ డిమాండ్ చేశారు. పుష్కలమైన సాగు నీరు ఉన్నప్పటికీ వాటి సరఫరాలో మాత్రం ప్రభుత్వం చేతులేత్తేసిందని, బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ పర్యటనల సమయంలోనే సాగు నీరు వదలడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. వ్యవసాయానికి నిరంతరం విద్యుత్తు సరఫరా చేయకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ లు, మోటర్లు మరమ్మత్తులకు గురై రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని ధ్వజమెత్తారు. వ్యవసాయ రంగంలో ప్రత్యేక బడ్జెట్ విధానం అమలు చేస్తామన్న ప్రభుత్వ హామీని గుర్తు చేశారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25 వేల రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అన్నదాతలకు అండగా బీఆర్ఎస్ నిలబడుతుందని స్పష్టం చేశారు. సమావేశంలో పట్టణ అధ్యక్షులు అజేయ్, విజ్జగిరి నారాయణ, కుమ్రా రాజు, ఎంపీపీ రమేష్, రమేశ్వర్, ఆశ్రాఫ్, సతీష్, రాజన్న, వేణు గోపాల్ యాదవ్, కొండ గణేష్., లక్ష్మిణ్, బుమన్న. కరుణ తదితరులు పాల్గొన్నారు