సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం;
చర్ల మండలం సుబ్బంపేట అడవిలో అడవి దొంగలు బరితెగిస్తున్నారు. ఎంతో విలువైన టేకు చెట్లను దొంగతనంగా నరికి స్మగ్లింగ్ చేయడమే తమ ఆదాయంగా మార్చుకుంటూ మూడు పువ్వులు ఆరు కాయలుగా వాళ్ళ వ్యాపారం విరాజిల్లు తోంది అనడం లో అతిశయోక్తి లేదనే అనిపిస్తుంది ఇక్కడి పరిస్థితులు చూస్తుంటే
వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని సుబ్బంపేట ఫారెస్ట్ బీట్ లో విలువైన టేకు చెట్లు అడవి దొంగల గొడ్డలి వేటుకు గురవుతున్నాయి. ఈ ఫారెస్ట్ బీట్ లో వారానికి ఐదారు టేకు చెట్లు మాయమవుతున్నాయని సమాచారం. ఎంతో విలువైన టేకు చెట్లను విచ్చలవిడిగా నరికి గోదావరి మీదుగా పినపాక నియోజకవర్గంలోని గ్రామాలకు తరలించి స్మగ్లర్లు సొమ్ము చేసుకుంటున్నా చర్యలు తీసుకోవలసిన అటవీశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉదాసీన వైఖరి ప్రదర్శించడం పట్ల స్థానికుల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అడవి దొంగలతో అటవీశాఖ అధికారులు చేతులు కలిపారా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప కలప అక్రమ రవాణా చేసే వారిపై అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో విలువైన అటవీ సంపదను రక్షించుకోవలసిన బాధ్యత కలిగిన అటవీశాఖ అధికారులు స్మగ్లర్లపై కొరడా ఝళిపించాలని స్థానికులు కోరుతున్నారు
======================