సిరాన్యూస్, ఆదిలాబాద్
ప్రతి పోలింగ్ బూత్ నుంచి 50శాతం లీడ్ రావాలి : ఎమ్మెల్యే పాయల్ శంకర్
* బీజేపీ టిఫిన్ బైటక్ సమావేశం
రాబోయే ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్ నుంచి 50శాతం లీడ్ రావాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శనివారం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీని సంస్థగతంగా పటిష్టపరిచేందుకు టిఫిన్ బైటక్ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. అందులో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని 274వ పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి కార్యకర్తల బలం భారతీయ జనతా పార్టీకి ఉందన్నారు. నిబద్ధత, దేశభక్తి, క్రమశిక్షణ ఇవి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల లక్షణాలు అని అన్నారు. కేవలం భారతీయ జనతా పార్టీలోనే బూత్ స్థాయి కార్యకర్త ఇచ్చే సలహాలు కూడా పరిగణలోకి తీసుకోబడుతుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్ నుండి 50 శాతానికి పైగా ఓట్లు సాధించే దిశగా కార్యాచరణ చేసేందుకు కార్యకర్తల నుండి నాయకుల నుండి సలహాలు వారి వారి అభిప్రాయాలను ఈ టిఫిన్ బైటక్ ద్వారా సేకరించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో పట్టణ పోలింగ్ బూత్ స్థాయి నాయకులు తదితరులు, కార్యకర్తలు పాల్గొన్నారు.