వాలంటీర్లపై చంద్రబాబు గురి..

సిరా న్యూస్,విజయవాడ;
ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల చుట్టూ రాజకీయం నడుస్తోంది. దాదాపుగా రెండున్నర లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారి ఓట్లు మాత్రమే కాదు.. వారు ఇతర ఓట్లను ప్రభావితం చేయగలరని అనుకుంటున్నారు. అందుకే అన్ని రాజకీయ పార్టీలు వాలంటర్లపై దృష్టి పెట్టాయి. వాలంటీర్లు తమకు పేటెంట్ అని వైఎస్ఆర్‌సీపీ గట్టిగా నమ్ముతోంది. కానీ ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసరికి వ్యూహాత్మక తప్పిదాలతో వాలంటీర్ల ఆదరణను కొనసాగింప చేసుకునేందుకు ఇబ్బదులు పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి వాలంటీర్లపై ఉన్న నమ్మకం అంతా ఇంతా కాదు. వాలంటర్లను నియమించినప్పటి నుండి ఆయన పార్టీ క్యాడర్ ను కూడా పట్టించుకోలేదని వాలంటీర్లకే ప్రాధాన్యం ఇచ్చారన్న అభిప్రాయం ఉంది. చివరికి వాలంటీర్లకు రాజకీయ భవిష్యత్ ను ఇస్తానని కూడా ప్రకటించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం జరిగిన మంచిని చెప్పాలని వాలంటీర్లకు దిశానిర్దేశం చేశారు కానీ..క్యాడర్ విషయంలో జగన్ పెద్దగా పట్టించుకోలేదు. ఆ అసంతృప్తి పార్టీ క్యాడర్ లో ఉందని అనిపించినప్పటికీ ఆయన తగ్గలేదు. వాలంటీర్లే నా సైన్యం అని వైసీపీ అధినేత బహిరంగంగా ప్రకటించుకున్నారు. పార్టీ క్యాడర్, నేతల గురించి ఏ పార్టీ అధ్యక్షుడు అయినా ఎక్కువగా చెప్పుకుంటారు. కానీ జగన్ మాత్రం వాలంటీర్ల గురించి చెబుతూంటారు. అది ఆ వ్యవస్థకు ఆయన ఇస్తున్న ప్రాధాన్యత అనుకోవచ్చు. వాలంటీర్ల విషయంలో కొన్ని వివాదాస్పద నిర్ణయాలను వైసీపీ తీసుకుంటోంది. ఎన్నికల కోడ్ ఉన్నందున వాలంటీర్ల వ్యవస్థను ఈసీ అంగీకరించదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే పించన్ పంపిణీని వాలంటీర్లతో వద్దని చెప్పినందున ఆ వ్యవస్థే లేదన్నట్లుగా వైసీపీ నేతలు మట్లాడుతున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ కూడా వాలంటీర్ల వ్యవస్థ రద్దయిపోయిందన్నట్లుగా మాట్లాడుతున్నారు. తాను మళ్లీ సీఎం అవగానే మొదటి సంతకం పెడతానంటున్నారు. దీంతో వాలంటీర్ల వ్యవస్థ రద్దయిపోయిందా అన్న డౌట్స్ వస్తున్నాయి. అదే సమయంలో.. కొన్ని చోట్ల రాజీనామాలకు పట్టుబడుతున్నారు వైసీపీ నేతలు. వాలంటీర్లు రాజీనామా చేసి వైసీపీకోసం ప్రచారం చేయాలని అంటున్నారు. కానీ పెద్దగా రాజీనామాలు చేయడం లేదు. రెండున్నరక లక్షల మంది వాలంటీర్లలో ఐదు వేల మంది రాజీనామాలు చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. వాలంటీర్ల విషయంలో చంద్రబాబు వ్యూహాత్మక రాజకీయం చేస్తున్నారు. వాలంటీర్లందరికీ చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. ప్రజలకు సేవ చేసేలా ఉండే వాలంటీర్లకు ఎలాంటి సమస్యా ఉండదని అంటున్నారు. అంతే కాదు.. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల నెలకు రూ. యాభై వేల వరకూ సంపాదించుకునేలా ఏర్పాట్లు చేస్తామని ఇంతకు ముందు హామీ ఇచ్చారు. తాజాగా ఉగాది రోజున.. వాలంటీర్ల గౌరవ వేతనం పదివేలు చేస్తామని ప్రకటించారు. వైసీపీ నేతలు చెప్పినట్లుగా చేయవద్దని ఆయన షరతు పెట్టారు. వారు చెప్పింది విని మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు. రాజీనామా లు చేసిన వాలంటీర్లకు అసలు చాన్స ్ఉండదు. వాలంటీర్లలో చాలా మంది వైసీపీ కార్యకర్తలే. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే చెబుతూంటారు. స్వయంగా సీఎం జగన్ కూడా చెబుతూంటారు. ఐదు వేల రుపాయల గౌరవ వేతానికి వాలంటీర్లు చేరారు. రెండున్నర లక్షల మంది యువత ఐదేళ్లుగా అదే పని చేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో ఐదు వేల రూపాయలతో ఇంటి అద్దె కూడా కట్టుకోలేరు. వాలంటీర్ గా పని చేస్తూ ఇతర ఉద్యోగాలు చేయలేరు. ఎందుకంటే.. పెన్షన్ల పంపిణీనే కాదు.. ఆస్తి పన్ను వసూలు దగ్గర నుంచి ప్రభుత్వానికి చెందిన ప్రతీ పనిని వాలంటీర్లే చేస్తున్నారు. అందుకే వారు కూడా.. తమ భవిష్యత్ కు భ రోసా కోరుకుంటున్నారు. వారి కోరికలోనూ తప్పులేదు. ఏళ్ల తరబడి సేవ చేసుకుంటూ ఉంటే కుటుంబాలను ఎలాపోషించాలన్న టెన్షన్ వారికి ఉంటుంది. ఐదేళ్లు కష్టపిన తమకు ఎన్నికలకు ముందు సీఎం జగన్ ఏదో ఓ దారి చూపిస్తారని అనుకున్నారు. చివరికి రాజీనామాలు చేయిస్తూండటం.. వారిలో అసంతృప్తిని పెంచుతోంది. అందుకే ఇటీవల తమ డిమాండ్లు పరిష్కరించాలని సమ్మె కూడా చేశారు. మరో వైపు చంద్రబాబు బంపర్ ఆఫర్లు ఇస్తూ పోతున్నారు. ఈ క్రమంలో వాలంటీల్లో ఎంత శాతం మారినా అది టీడీపీకే అడ్వాంటేజ్ అవుతుంది. చివరికి వచ్చే సరికి వాలంటర్ల విషయంలో వైసీపీ తప్పటడుగులు వేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
=================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *