కోదండరాముని కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు

ఏప్రిల్ 16 నుండి 26 వరకు బ్రహ్మోత్సవాలు

17న శ్రీరామ నవమి, 22న కల్యాణోత్సవం

ఎన్నికల కోడ్ అమలు పక్కాగా పాటించాలి

జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు

సిరా న్యూస్,బద్వేలు;

ఒంటిమిట్ట శ్రీ సీతా సమేత కోదండరామ బ్రాహామోత్సవాలు, కల్యాణ మహోత్సవాన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికల కోడ్ అమలు పక్కాగా పాటిస్తూ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక టిటిడి కళ్యాణ మండపం సమీపంలోని పరిపాలన భవనం సమావేశపు హాలులో టీటీడీ ఈఓ ఏ.వి. ధర్మారెడ్డి, జేసి గణేష్ కుమార్, టీటీడీ జెఈఓ వీరబ్రహ్మం, కడప నగర కమీషనర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ లతో కలిసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవ ఏర్పాట్లపై జిల్లా అధికారులు, టీటీడీ అధికారులతో జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించి దిశా నిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 16వ తేదీ నుండి 26వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయన్నారు. అందులో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు సంయుక్తంగా, సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ఏప్రిల్ 15వ తేదీ లోపు శ్రీ కోదండ‌రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాల ప‌నులు పూర్తి చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. ప్రధానంగా ఈ ఏడాది బ్రహ్మోత్సవాల సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎక్కడా కూడా మోడల్ కోడ్ ఉల్లంఘన జరగకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అదేశలు జారీ చేశారు.
ఈ విషయంలో టిటిడి అధికారులు, రెవెన్యూ అధికారులు, ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా ఎప్రిల్ 22వ తేదీన జరిగే సీతారాములవారి కళ్యాణోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్ తదితర ప్రముఖులు వచ్చే అవకాశం ఉన్నందున.. భారీ భక్తజన సందోహం రావచ్చనే అంచనాతో అన్ని రకాల ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఆ మేరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జిల్లా యంత్రాంగం, టీటీడీ, పోలీస్ అధికారులు సంయుక్తంగా, నిర్దిష్ట ప్రణాళికలతో విధులను నిర్వర్తించాలన్నారు. రాములవారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు కళ్యాణ వేదిక ముందు ఏర్పాటు చేసిన ఒక్కో గ్యాలరీకి ఒకరిని ఇంఛార్జిగా నియమిస్తామన్నారు. ప్రసాదాల కౌంటర్ల వద్ద ఎక్కడా కూడా జనం తొక్కిసలాట జరుగకుండా అధికారులు, పోలీస్ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే కడప, రాజంపేట వైపు నుంచే ఆర్టీసీ బస్సులకు పార్కింగ్, అలాగే ఇతర జిల్లాలనుంచి ఎన్ని బస్సులు వస్తున్నాయో తెలుసుకుని పక్కాగా ప్లాన్ రూపొందించుకుని పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం ఎపిఎస్‌ ఆర్‌టిసి ద్వారా అదనపు బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కల్యాణ వేదిక వద్ద గ్యాలరీలు, పటిష్టమైన బ్యారికేడ్లు, సిసి కెమెరాలు ఏర్పాటు చేయాల‌న్నారు. భక్తుల కోసం వైద్య శిబిరాలు, ప్రథమ చికిత్స కేంద్రాలతో పాటు పారామెడికల్‌ సిబ్బంది, మందులు, అంబులెన్సులు, గ్లూకోజ్‌, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు కావాల్సిన అన్ని రకాల మౌలిక, కనీస వసతులను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలన్నారు. భద్రతా ఏర్పాట్లు, శానిటేషన్, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు, తాగునీరు, భక్తులకు అన్నప్రసాదాలు, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ కంట్రోల్, ఆర్టీసీ రవాణా సౌకర్యం, సూచిక బోర్డులు ఏర్పాటు, కంట్రోల్ రూం ఏర్పాటు, సీసీ కెమెరాలు, విద్యుత్, అగ్నిమాపక వాహనాలు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, 108 వాహనాలు, మెడికల్ డిపార్ట్మెంట్ నుండి స్పెషలిస్ట్ డాక్టర్లతో పాటు అత్యవసర మందులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, తాత్కాలిక మెడికల్ క్యాంపులు, అక్కడక్కడ హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు మొదలైన అన్ని అంశాలను ఎలాంటి కొరత లేకుండా ఏర్పాటు చేయాలని సంబందిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
22వ తేదీన సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 సమయంలో కల్యాణోత్సవం చేస్తున్నందున విద్యుత్ దీపాలంకరణతో పాటు అత్యంత పటిష్ట భద్రతా చర్యలను కూడా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా విద్యుదీకరణ, తోరణాలు, పుష్పాలంకరణ, స్వాగత ఆర్చిలు, ఎల్‌ఇడి బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న దృష్ట్యా ఎక్కడా కూడా రాజకీయ నాయకుల ఫోటోలు బ్యానర్లు, కటౌట్లపై కనిపించకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ శ్రీ సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభ‌వంగా నిర్వహించేందుకు టీటీడీ, జిల్లా యంత్రాగంతో స‌మ‌న్వ‌యం చేసుకుని ముంద‌స్తు ఏర్పాట్లు చేయాల‌న్నారు. కల్యాణానికి వ‌చ్చే భక్తులకు అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు, విరివిగా అందేలా ముంద‌స్తు ఏర్పాట్లు చేయాల‌న్నారు. కౌంట‌ర్ల‌లోను, గ్యాల‌రీల‌లో ఉన్న భ‌క్తులకు ప్ర‌సాదాల పంపిణీకి అవ‌స‌ర‌మైనంత మంది శ్రీ‌వారి సేవ‌కుల‌ను సిద్ధంగా ఉంచుకోవాల‌న్నారు. అనంతరం అనుబంధ శాఖల అధికారులతో ఏర్పాట్లకు సంబంధించిన అంశాల పై సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ ఏడాది భక్తులకు కావాల్సిన అన్ని రకాల వసతులను శాశ్వ‌త ప్రాతిపదికన నిర్మించిన‌ట్లు చెప్పారు. జిల్లా యంత్రాంగం తరపున వివిధ శాఖల అధికారులకు, టీటీడీ తరపున ఆయా విభాగాల అధికారులకు బాధ్యతలు అప్పగించామని చెప్పారు. వాటిని సమన్వయంతో పూర్తి చేసి కల్యాణోత్సవాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాల‌న్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు తితిదే అధికారులు, పోలీసు అధికారులు, జిల్లా అధికారులతో కలిసి కల్యాణ వేదిక, ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *