ఎన్నికలను ముంచెత్తుతున్న ఫేక్…

సిరా న్యూస్;

భారత అత్యున్నత ప్రజాస్వామ్యం అని ఎందుకు అంటామంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుందనే. భారత ప్రజాస్వామ్యానికి ఎన్ని రకాల అవలక్షణాలు ఉన్నా ప్రజల చైతన్యంతో ఎప్పటికప్పుడు మన గలుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు అతి పెద్ద సవాల్ ఫేక్ న్యూస్ రూపంలో వస్తోంది. సోషల్ మీడియా ప్రజాస్వామ్యానికి పెను ముప్పుగా మారుతోంది. ఎలాంటి అథంటికేషన్ లేకుండా ఫేక్ న్యూస్ ప్రచారానికి ఇది ఆయుధంగా మారింది. సోషల్ మీడియా రూపం మారిపోతోంది. ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీల సోషల్ మీడియా సైన్యాలు.. తప్పుడు వార్తలు, మార్ఫింగ్ ఫోటోలు, నకిలీ వీడియో పోస్టులతో హల్ చల్ చేస్తున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు.. ఇప్పుడు ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీల సోషల్ మీడియా వింగ్‌లు విశ్వరూపం చూపిస్తున్నాయి. ఒకరు చేసిన దానికి మరొకరు కౌంటర్ గా ఫేక్ పోస్టులు వైరల్ చేసుకుంటున్నారు. ఇటీవల ఇది పెరిగిపోయింది. సోషల్ మీడియాలోని ఫేస్ బుక్, వాట్సాప్ , ఇతర ప్లాట్ ఫామ్స్ లో ప్రధాన ప్రత్యర్థి పార్టీల అభ్యర్దులపైన, కార్యకర్తల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, వ్యక్తిగత ఆరోపణలకు, దూషణలకు దిగుతూ తద్వారా సదరు రాజకీయ పార్టీల మధ్య ఉద్రిక్తతలను, ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్న సందర్భాలు కూడా పెరిగిపోతున్నాయి. నిజానికి సోషల్ మీడియా అనేది సమాచార వ్యాప్తికి అత్యంత సులభమైన, తక్కువ ఖర్చు మాధ్యమం. అయితే ఇదే అది పెద్ద సవాలుగా మారింది. ఫేక్ న్యూస్ పై దేశం, సమాజం మొత్తం సీరియస్‌గా ఆలోచించాలి. ఫేక్ న్యూస్ కోసం ప్రత్యేక అకౌంట్లను, వెబ్ సైట్లను సృష్టిస్తున్నారు. అనేక పత్రికలు కూడా ఫేక్ న్యూస్‌ వార్తలను ప్రచురిస్తున్నాయి. మిగతా రాష్ట్రాల్లో రాజకీయం వేరు..ఎన్నికలు వస్తే చాలు ఫేక్ న్యూస్ వెల్లువలా సోషల్ మీడియాలో వెల్లువెత్తుతోంది. ప్రముఖ సంస్థల పేర్లు వాడుకుని డీప్ ఫేక్ వీడియోలు చేయడం దగ్గర్నుంచి కొత్త కొత్త టెక్నాలజీని వాడుకుని ప్రజల్లో గందరగోళం గురి చేయడం వరకూ రాజకీయ పార్టీ దేన్నీ వదులుకోవడం లేదు. దీని వల్ల ఎన్నికలు ప్రభావితం అవుతున్నాయని తెలిసినా ఒక్కటంటే ఒక్క వ్యవస్థ కూడా చర్యలు తీసుకోలేకపోతోంది. 2020లో దుబ్బాక ఉపఎన్నిక జరిగింది. రేపు పోలింగ్ జరుగుతుందనగా.. కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్‌లో చేరిపోయారని ఓ ప్రముఖ చానల్ లో వచ్చిందన్నట్లుగా ఓ వీడియో వైరల్ చేశారు. అది ఫేక్ అని అందరికీ తెలిసే సరికి పోలింగ్ అయిపోయింది . నమ్మిన వారు చాలా మంది తమ ఓటింగ్ ప్రయారిటీ మార్చుకున్నారు. ఇది ఒక్క ఉదాహరణే ఎప్పుడు .. ఎక్కడ ఎన్నికలు జరిగినా లెక్కలేన్ని ఫేక్ పోస్టులు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా కేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరో సర్వే అంటూ ఓ తెలుగు మీడియా చానల్ లో సర్వే వచ్చిందని వీడియో వైరల్ అయింది. అది డీప్ ఫేక్ వీడియోగా తేల్చి ఆ చానల్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రముఖ సంస్థలకు ఉన్న విశ్వసనీయతను ఇలా రాజకీయ పార్టీల సానుభూతిపరులు తమకు అనుకూలంగా మల్చుకునేందుకు ఏ మాత్రం ఆలోచించడం లేదు. తర్వాత ఎలాంటి పరిణామాలు చర్యలు ఉండవు కాబట్టి.. ఫేక్ అని తెలిసినా సరే ప్రజల్లోకి పంపుతున్నారు. దాన్ని నమ్మేవారు ఉంటారు. వాళ్లే టార్గెట్. రాజకీయ పార్టీలకు కావాల్సింది అదే. తాము ఏమీ చెప్పినా నమ్మేవారిని రాజకీయ పార్టీలు సృష్టించుకుంటున్నాయి. ఏపీలో రాజకీయం వేరు. రేపే ఎన్నికలన్నంత హడావుడి.. ఫలితాలొచ్చిన తర్వాతి రోజు నుంచే ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ కూడా విశ్రాంతి తీసుకోదు. ఆయా పార్టీల కార్యకర్తలూ అంతే. అయితే.. ఇక్కడ సమస్య అంతా… రాజకీయ పార్టీల స్ట్రాటజీ వల్లనే వస్తోంది. తమకు వ్యతిరేకం అయినా…ప్రత్యర్థి పార్టీపై అవాస్తవాలు చాలావేగంగా ప్రచారం చేసి.. ఎక్కువ మంది నమ్మేలా చేయగలిగితే..చాలని అనుకుంటున్నాయి. ఇందు కోసం.. ఆన్ లైన్ టీముల్ని నియమించుకుంటున్నాయి. ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. స్పష్టంగా కనిపిస్తున్న విషయాలను కూడా వక్రీకరిస్తున్నారు. ఫలితంగా ప్రజలు కూడా అసలు నిజలేంటో అంచనా వేసులేకపోతున్నారు. తమ రాజకీయ అభిప్రాయాలకు అనుగుణంగా ఉన్న వార్తను.. నమ్మి సంతృప్తి పడుతున్నారు. కానీ వారికి అసలు నిజం తెలియడం లేదు. తెలిసిన నమ్మలేనంతగా రాజకీయ పార్టీలు ఆ విషయానికి మసిపూసి మారేడు కాయ చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. తెలంగాణా ఎన్నికలు 2023కి ముందు, ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు కూడా ఈ టెక్నాలజీకి బలైపోయాడు. ప్రముఖ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.సీఎం కేసీఆర్ రాజకీయ పార్టీ భారత రాష్ట్ర సమితి పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడి డీప్‌ఫేక్ పరువు నష్టం కలిగించే, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినట్లు ఇందులో చూపిస్తోంది. ఆయన మాత్రమే కాదు, డీప్‌ఫేక్‌లు ఈ ఎన్నికల సీజన్‌లో ఒక పోల్ ప్రాక్టీస్‌గా మారాయి. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇవి కామన్ గా మారుతున్నాయి. సోషల్ మీడియాలో ట్సప్ గ్రూపులలో ఇలాంటి వివాదాస్పద పోస్టింగులు చేస్తూ, వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ, రాజకీయ, వర్గ ఘర్షణలు లేవనెత్తుతూ పరపతికి భంగం కలిగేలా వ్యవహరిస్తుంటేవాట్సాప్ గ్రూపుల అడ్మిన్లను కూడా బాధ్యులను చేస్తామనిపోలీసులు హెచ్చరిస్తున్నారు. తమ తమ గ్రూపులలో వివాదాస్పద పోస్టులను తొలగించాలని, పోస్ట్ చేసిన వ్యక్తులను హెచ్చరించి గ్రూపునుంచి తొలగించాలని, ఆ సమాచారాన్ని స్ధానిక పోలీసులకు తెలియ చేయాలని, లేకపోతే సదరు వాట్సాప్ గ్రూపుల అడ్మిన్లను బాధ్యులను చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కానీ సమస్యకు పరిష్కారం ఇలాంటి హెచ్చరికలు కాదు.. మూలాల నుంచి సమస్యను పెకిలించాలి. సోషల్ మీడియాపై ఆంక్షలు విధిస్తే.. ఫ్రీడం ఆఫ్ స్పీచ్ కు సమస్యలు వస్తాయి. అలా అని ఇలా సోషల్ మీడియాను వదిలేస్తే.. ఫేక్ న్యూస్ తో జీవితాల్ని..దేశాన్ని ఆగం చేస్తున్నారు. దీనికి పరిష్కారం కనిపెట్టాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *