సిరాన్యూస్, ఆదిలాబాద్
సీఎం బీజేపీలో చేరే అవకాశం: కేటీఆర్
* పార్లమెంట్ లో తెలంగాణ గొంతుక వినబడాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యం
* పార్లమెంట్ నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో త్వరలోనే పెను మార్పులు రానున్నాయని, స్వయంగా ముఖ్యమంత్రే బీజేపీ పార్టీలో చేరే అవకాశం ఉందని బీ.ఆర్.ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అర చేతిలో వైకుంటం చూపి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని మాత్రం విస్మరిస్తోందని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ తరపున పని చేస్తున్నారో, ప్రధాని మోడీ తరపున పని చేస్తున్నారో స్పష్టం చేయవలసిన అవసరముందని అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని గాయత్రి గార్డెన్స్ లో మంగళవారం నిర్వహించిన పార్లమెంట్ నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తల జయజయ ధ్వానాల నడుమ సమావేశానికి హాజరైన కేటీఆర్కు మాజీ మంత్రి, బీ.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న, ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు తదితరులు సాదరంగా స్వాగతం పలికారు. సమావేశంలో భాగంగా పలువురు నేతలు కేటీఆర్ ను శాలువాలతో ఘనంగా సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. వేలాదిగా సభకు తరలివచ్చిన కార్యకర్తల జై తెలంగాణ, జై కెసిఆర్, జై కేటీఆర్నినాదాలతో సభ ప్రాంగణం మారుమోగింది. బూత్ స్థాయి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన నేతలు… పార్లమెంట్ ఎన్నికల్లో గులాబి జెండా ఎగిరే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త నడుం బిగించాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల ముందుంచి… గత బీ.ఆర్.ఎస్ ప్రభుత్వ హయంలో చేసిన అభివృద్ధిని వివరించాలని సూచించారు. ఈ సందర్భంగా శ్రేణులను ఉద్దేశించి బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ… బీ.ఆర్.ఎస్ అధికారంలో ఉన్న సమయంలో పదవులు అనుభవించిన వారు పార్టీని వీడినా… ఎటువంటి ప్రమాదం లేదని, పార్టీకి కార్యకర్తలే బలమని అన్నారు. ఉద్యమ సమయంలోనూ కార్యకర్తలే పార్టీ వెన్నంటి నడిచిన విషయాన్నీ గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల వేళ అనేక హామీలు ఇచ్చి వంద రోజుల్లోనే వాటిని నెరవేరుస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ… ప్రస్తుతం వాటి అమలులో నిర్లక్ష్య వైఖరి వహిస్తోందని మండిపడ్డారు. రెండు లక్షల రుణ మాఫీపై తాజాగా ముఖ్యమంత్రి కొత్త కథ చెప్తున్నారని అన్నారు. విద్యుత్తు, సాగునీరు, రైతుబందు సహాయం, పంటల కొనుగోలు వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని ఆక్షేపించారు. బీ.ఆర్.ఎస్ ప్రభుత్వ హయంలో రైతన్నలను కడుపులో పెట్టుకుని చూసుకున్నామని, ప్రస్తుతం వారంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేండ్ల కాలంలో రైతుబందు ఆర్ధిక సహాయం కింద 70 వేల కోట్ల రూపాయలను 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత బీ.ఆర్.ఎస్ ప్రభుత్వానికే చెల్లిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తూనే కరవు తీసుకువచ్చిందని, కరెంటు, మంచినీటి వసతి లేక తిరిగి పాత పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. పదేళ్ళలో చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోవడమే ఓటమికి ప్రధాన కారణమని విశ్లేషించారు. దేశంలోనే అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనని, ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇచ్చామని గుర్తు చేశారు. కరోనా తర్వాత ఎదురైన ఆర్ధిక ఇబ్బందులను నిలదొక్కుకుని ప్రభుత్వ సంక్షేమ పతకాలను సమర్ధంగా అమలు చేయడంతో ఉద్యోగులకు వేతనాల విడుదలలో కొంత ఆలస్యం జరిగిందని వివరించారు. తండాలు, గూడల్లో జరిగిన విష ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయామని, ప్రస్తుతం ఆ పరిస్థితి పునరావృతం కావోద్దని హితభోద చేశారు. ప్రజలంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై తీవ్ర అసంతృప్తి తో ఉన్నారని, గ్రామాల్లో ఈ విషయాలపై చర్చించిన బాధ్యత శ్రేణులపై ఉందని సూచించారు. గెలిచిన తొలి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం మాటపై నిలబడాలని అన్నారు. గతంలో టేట్ పరీక్షకు నాలుగు వందల ఫీజు ఉంటె గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ నేతలు.. ప్రస్తుతం రెండు వేల ఫీజు ఎందుకు వసూలు చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఆదివాసిల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేలా బృహత్తర పథకాలు, కార్యక్రమాలను అమలు చేశామని వివరించారు. అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ప్రజలకు చేసిందేమీ లేదని, ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్ట్, సీసీఐ పునరుద్ధరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలను నిలిపివేసిన పార్టీకి ఎందుకు వోటు వేయాలని ప్రశ్నించారు. బీజేపీ, బీ.ఆర్.ఎస్ ఒక్కటేనని దుష్ప్రచారం చేసిన వారికి సరైన రీతిలో సమాధానం చెప్పాలని, బీజేపీలో బడా నేతలను ఓడించింది బీ.ఆర్.ఎస్ అభ్యర్తులేనని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్థాయికి తగ్గ వ్యాఖ్యలు చేయడం లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధానిపై విమర్శలు చేస్తుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం ప్రధానిని బడే భాయ్ అంటూ పొగడ్తలతో ముంచేత్తుతున్నారని అన్నారు. రేవంత్ రెడీ ఎవరి కోసం పని చేస్తున్నారో స్పష్టం చేయవలసిన అవసరముందన్నారు. అధికారం ఎన్నటికీ శాశ్వతం కాదన్న ఆయన… కార్యకర్తల్లో పోరాట పటిమ తగ్గలేదని, గ్రామాల్లో ఇప్పటికీ కార్యకర్తలు పటిష్టంగా ఉన్నారని తెలిపారు. ఎంపీ ఎన్నికలతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గ్రామగ్రామాన గులాబి జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. దేశానికి బీజేపీ తోనే అసలు ప్రమాదం పొంచి ఉందని, తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తామంటూ ఆ పార్టీ నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ గొంతుక పార్లమెంట్ లో వినబడాలంటే బీఆర్ ఎస్ తోనే సాధ్యమని, ప్రజల కోసం బీఆర్ ఎస్ నిరంతర పోరాటం సాగిస్తుందని పునరుద్ఘాటించారు.సమావేశంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఎమ్మెల్సీ దండె విట్టల్, నిర్మల్ జెడ్పీ చైర్మన్ విజయ లక్ష్మి, ఉమ్మడి జిల్లా పార్టీ సీనియర్ నాయకులు బాల్క సుమన్, రమాదేవి, విలాస్, కిరణ్, శ్యామ్ సుందర్, సుభాష్, కొమరం భీం మనవడు సోనేరావు తదితరులు పాల్గొన్నారు.