సిరాన్యూస్, ఆదిలాబాద్
కాంగ్రెస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ దాఖలు
* ఆత్రం సుగుణను ఆదరించి గెలిపించాలిః ఎమ్మెల్యే వెడ్మ
* తెలంగాణలో 15 ఎంపీ సీట్లు సాధించడమే తమ లక్ష్యం
* ఐదు న్యాయ సూత్రాలు, ఆరు గ్యారంటీలతో ముందుకు సాగుతున్నాం
* పేదబిడ్డను గెలిపించుకోవాలి
తెలంగాణ వ్యాప్తంగా 15 ఎంపీ సీట్లు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, తప్పకుండా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవబోతున్నామని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ తరపున బోథ్, ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జీలు ఆడే గజేందర్, కంది శ్రీనివాసరెడ్డితో కలిసి నామినేషన్ వేశారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఆర్ఓ కార్యాలయంలో ఈ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఈ నామినేషన్ పత్రాలను స్వీకరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ వద్ద ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ…తెలంగాణలో 17 స్థానాలకుగాను 15 స్థానాలను కైవసం చేసుకోవడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహారచనతో ముందుకుకెళ్తోందని అన్నారు. తప్పకుండా ఈ ఎన్నికల్లో ఆదిలాబాద్ స్థానంలో గెలవబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జిల్లా చరిత్రలోనే కాంగ్రెస్ పార్టీ మొదటి సారిగా ఒక మహిళకు, అందులోనూ ఆదివాసీ బిడ్డకు అవకాశం కల్పించిందని అన్నారు. ఆత్రం సుగుణను తమ ఆడపడుచుగా భావించి ఆదరించాలని, భారీ మెజార్టీతో ఆమెను విజయతీరాలకు చేర్చాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ మతం పేరుతో, దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ భిన్నత్వంలో ఏకత్వంలా అందరూ కలిసిమెలిసి ఉండాలని, ఈ ప్రాంతాన్ని సమిష్టిగా అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పంతో ముందుకు సాగుతోందని అన్నారు. గతంలో ఆరు గ్యారంటీలు, నేడు ఐదు న్యాయసూత్రాలతో ఎన్నికల బరిలోకి దిగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారన్న నమ్మకంతో ఉన్నామన్నారు. ప్రతిఒక్కరూ ఆత్రం సుగుణను ఆదరించి పార్లమెంట్కు పంపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆత్రం సుగుణ కుటుంబం పేద కుటుంబమని, అనేక సమస్యలపై పోరాటాలు చేసిన కుటుంబమని తెలిపారు. అందుకే ఆమె సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశమిచ్చిందని పేర్కొన్నారు. ఈ ప్రాంతవాసులు పార్టీని తప్పకుండా గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డి.శ్రీలేఖ, న్యాయవాది అప్రోజ్, మరో మద్దతుదారు కరీంఖాన్ పాల్గొన్నారు.