సిరాన్యూస్, కడెం
కవ్వాల్ టైగర్ గ్రామాల తరలింపు
* 142 కుటుంబాలకు పునరావాసం
కవ్వాల్ టైగర్ రిజర్వు నుంచి గ్రామాల తరలింపునకు రంగం సిద్ధమైంది. నిర్మల్ జిల్లా కడెం మండలం మైసంపేట, రాంపూర్ గ్రామాలను కోర్ ఏరియా వెలుపల ఉన్న ఇదే మండలంలోని కొత్త మద్దిపడగకు తరలించనున్నారు. ఈ గ్రామంలోనే వారికి పునరావాసం కల్పించనున్నారు. ఈ మేరకు రెండు పడక గదుల (డబుల్ బెడ్రూం) ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయింది. మైసంపేట, రాంపూర్ వాసుల్ని రాష్ట్ర ప్రభుత్వం తేదీ నిర్ణయించగానే నెల రోజుల్లోగా ధర్మాజిపేటకు తరలించనున్నట్లు అటవీశాఖ వర్గాలు తెలిపాయి. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే కవ్వాల్ నుంచి మరికొన్ని గ్రామాల్ని, అమ్రాబాద్ టైగర్ రిజర్వులోని పలు గ్రామాల్ని తరలించేందుకు (రీలొకేషన్) అటవీశాఖ కసరత్తు చేస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి..
పెద్దపులుల కోసం గ్రామాల్ని రీలొకేషన్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారి. పెద్దపులులు స్థిర నివాసం ఏర్పరచుకోవడం, వాటి సంచారానికి ఆటంకం కలగకుండా ఉండేందుకు అటవీశాఖ కొద్ది సంవత్సరాలుగా చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి. కవ్వాల్ కోర్ ఏరియాలో 37 గ్రామాలుండగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన మైసంపేట, రాంపూర్ గ్రామాల్ని తొలిదశలో రీలొకేషన్కు తీసుకున్నారు. కొత్త మద్దిపడగ కవ్వాల్ టైగర్ రిజర్వు పరిధిలోనే ఉన్నా.. ఈ ప్రాంతం పెద్దపులులు ప్రధానంగా సంచరించే కోర్ ఏరియాకు వెలుపల ఉంటుంది. ఆ రెండు గ్రామాలకు దాదాపు 25 కి.మీ.ల దూరం. అయితే రక్షిత అటవీప్రాంతం కావడంతో 276.50 ఎకరాల అటవీప్రాంతాన్ని డీనోటిఫై చేశారు. అందులో 6.88 ఎకరాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. 5.48 ఎకరాలు సామాజిక అవసరాలకు, 264.14 ఎకరాలను వ్యవసాయభూమిగా పంచేందుకు కేటాయించారు. సామాజిక అవసరాల్లో భాగంగా – కమ్యూనిటీ సెంటర్, అంగన్వాడీ కేంద్రం, వాటర్ట్యాంకు, అంతర్గత రహదారులు వంటి సదుపాయాలను కల్పిస్తున్నట్లు అటవీశాఖ వర్గాలు తెలిపాయి.
ప్రాజెక్టు వ్యయం: రూ.24.10 కోట్లు
2 గ్రామాల్లో కుటుంబాలు: 142
ఆప్షన్-1 (పునరావాసం లేకుండా కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం) తీసుకున్న కుటుంబాలు: 48
ఆప్షన్-2 (ఇంటి నిర్మాణంతో పాటు కుటుంబానికి 2.81 ఎకరాల భూమి) తీసుకున్న కుటుంబాలు: 94
సౌకర్యాలు కల్పించాలి : గ్రామస్తులు
మైసంపేట గ్రామానికి చెందిన 74 కుటుంబాలు రీ లోకేషన్ వన్ లోకి చేరుకున్నారు. వారికి సరైన సౌకర్యాలు కల్పించలేదని వాపోతున్నారు. మట్టి లెవలింగ్ కానీ డ్రైనేజీ వ్యవస్థ కాని సరిగా నల్లలు కూడా పనిచేయడం లేదని వాపోతున్నారు. ఎండాకాలం కాబట్టి నీటి కష్టాలు చాలా ఉన్నాయని తెలుపుతున్నారు. ఇంటి చుట్టూ మట్టి కూడా చదురు చేయలేదని కనీసం సిసి కూడా వేయలేదని గ్రామస్తులు తెలియజేస్తున్నారు.