వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో టీచర్ హత్య…

సిరా న్యూస్, మెదక్:

వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో టీచర్ హత్య…

భార్య అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో పక్కింటిలో ఉంటున్న టీచర్‌ను టైలర్‌ గా పనిచేస్తున్న వ్యక్తి కొట్టి చంపేశాడు.ఆ విషయం ఎవరికీ తెలియకుండా, శవాన్ని మెదక్ జిల్లాలోని చేగుంట నుండి కారులో తీసుకెళ్లి హైదరాబాద్ లో ప్రగతినగర్ చెరువులో పడేశారు.తండ్రి కనిపించక పోవడంతో టీచర్ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, దర్యాప్తు ప్రారంభించిన చేగుంట పోలీసులు సుమారు నెలరోజుల పరిశోధన తర్వాత మిస్సింగ్ కేసును చేధించారు. టీచర్‌ పక్కింట్లో ఉండే వ్యక్తే ఈ హత్యచేశాడని గుర్తించారు.భార్యతో దూరంగా ఉంటున్న టీచర్.మెదక్ జిల్లాలోని మాసాయిపేటలో హిందీ పండిట్‌గా పనిచేస్తున్న మోతుకూరి నాగరాజు (53), గత కొంత కాలంగా చేగుంటలో టైలర్‌గా పని చేస్తున్నవంగ సత్యనారాయణ అలియాస్ సతీష్ పక్కింటిలోని పెంట్ హౌస్‌లో నివాసం ఉంటున్నాడు.నిజామాబాద్ నివాసి అయినా నాగరాజు, గత కొంతకాలంగా వేర్వేరు కారణాలతో భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో నాగరాజు సతీష్ భార్య వంగ స్వాతి (35) తో సన్నిహితంగా ఉంటున్నాడు. అది గమనించిన సతీష్ వారి ప్రవర్తన పై అనుమానం పెంచుకున్నాడు. తన భార్య తనతో సరిగ్గా ఉండాలంటే, నాగరాజుని ఎలానైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు.

బావమరిది సహాయం కోరిన సతీష్…

ఇదే విషయాన్ని తన భార్య తమ్ముడు, బావమరిది అయిన వర్కాల మల్లేష్ తో పంచుకున్నాడు. తాను కూడా హ‍త్యకు సహకరిస్తాని హామీ ఇవ్వటంతో పాటు తన స్నేహితుడైన జిల్లా సునీల్ గౌడ్ సహాయం కూడా తీసుకుందామని చెప్పాడు.ఈ ఏడాది మార్చి 28న నిందితులు నాగరాజుని తన ఇంట్లోనే కొట్టి చంపి, ఆ మరుసటి రోజు అద్దెకారులో తీసుకెళ్లి ప్రగతి నగర్ లోని చెరువులో పడేశారు. ఉన్నట్టుండి నాగరాజు కనిపించక పోవడంతో నాగరాజు కుమారుడు వంశీ ఏప్రిల్ 1న చేగుంట పోలీసులకు ఫిర్యాదు చేసారు.ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నాగరాజు పక్కింట్లో ఉన్న సతీష్‌పై అనుమానంతో ఏప్రిల్ 21న పోలీస్ స్టేషన్ పిలిపించారు.ఈ విషయం తెలిసిన స్వాతి తీవ్ర ఒత్తిడిలో గత ఆదివారం తన ఇంటిలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.ఆ మరుసటిరోజే పోలీసులు ప్రగతి నగర్ లోని చెరువు నుండి కుళ్లిపోయిన స్థితిలో ఉన్న నాగరాజు శవాన్ని వెలికితీశారు. పోస్టమార్టమ్ పూర్తిచేసిన తర్వాత, సతీష్, మల్లేష్, సునీల్ గౌడ్, ముగ్గురు నిందితులని పోలీసులు అదుపులోకి తీసుకొని మంగళవారం రోజు మెదక్ కోర్టులో ప్రవేశపెట్టారు.మెదక్ జిల్లా జడ్జి నిందితులను ముగ్గురిని కూడా రిమాండ్ కు తరలించారు. తల్లి ఆత్మహత్య చేసుకోవడం, తండ్రి జైలుకు వెళ్లడంతో సతీష్, స్వాతి పిల్లలిద్దరూ అనాధలయ్యారు. ఎంతో క్లిష్టమైన కేసుని త్వరగా ఛేదించినందుకు, మెదక్ ఎస్పీ బాలస్వామి రామాయంపేట ఇన్స్పెక్టర్ బి వెంకటేశం, చేగుంట సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ బాలరాజు సిబ్బందిని అభినందించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *