సిరాన్యూస్, భీమదేవరపల్లి
బీజేపీ అసలు స్వరూపం బయటపడ్డింది
* హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ కో ఆర్డినేటర్ డ్యాగల సారయ్య
బీజేపీ అసలు స్వరూపం బయటపడ్డిందని హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ కో.ఆర్డినేటర్ డ్యాగల సారయ్య అన్నారు. శుక్రవారం భీమదేవరపల్లి మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన బిజెపి నాయకుడు అనంత కుమార్ హెగ్డే, రాజస్థాన్ కు చెందిన బిజెపి నాయకురాలు జ్యోతి మిర్ధా ఇరువురు మాకు 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చి వేస్తామని బహిరంగ ప్రకటన చేశారన్నారు. ఆ ప్రకటనతో దేశంలోని ప్రజాస్వామికవాదులు, మేధావులు, ప్రజలు ముక్తకంఠంతో నిరసనలు వ్యక్తం చేయడంతో ఎన్నికల సందర్భంగా పార్టీకి నష్టం వాటిల్లుతుందనే ఉద్దేశంతో స్వయంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక అడుగు ముందుకు వేసి అంబేద్కరే మళ్లీ పుట్టిన రాజ్యాంగాన్ని మార్చలేడు అని ఆ వార్తలను సర్ధిచేసే ప్రయత్నం చేశారని తెలిపారు. కానీ నరేంద్ర మోడీ ప్రకటన తర్వాత అతని మంత్రివర్గంలోని మరొక మంత్రి గజేంద్ర సింగ్ శకావత్ రాజ్యాంగాన్ని మార్చితే తప్పేంటని మాట్లాడినారు, తర్వాత భారత హోం మంత్రి అమిత్ షా మేము అధికారంలోకి రాగానే ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని మాట్లాడి లౌకికవాదాన్ని కాలరాశారు. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వారి సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ వాళ్లు రాజ్యాంగం గురించి బహిరంగంగా మాట్లాడకండి మనం అధికారంలోకి రాగానే రాజ్యాంగాన్ని మార్చేద్దాం, దానికి ఎలాంటి సందేహం లేదని వాక్యానించారని తెలిపారు. ఈ రీతిగా బిజెపి నాయకులు వరుసగా రాజ్యాంగం గురించి లౌకికత్వం గురించి , రిజర్వేషన్ల గురించి మాట్లాడడం రాజ్యాంగాన్ని మార్చేటువంటి అంశము వారి ఎజెండాలో ఉన్నటువంటి అంశం బయటపడిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీలు రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు పొందుతున్న ఓబీసీలు కూడా ముక్తకంఠంతో బిజెపిని వ్యాఖ్యలను ఖండిస్తు రాబోయే ఎన్నికల్లో బీజేపీతో ఓటుతో బుద్ధి చెప్పుతూ ఉద్యమించాలని కోరారు. సమావేశంలో మహమ్మద్ షరీఫ్ఉద్దీన్, డాక్టర్ ఎదులాపురం తిరుపతి, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్, దళిత సంఘ నాయకుడు రేణికుంట్ల బిక్షపతి, మాసాని శంకరయ్య, మాడుగుల మోహన్,ముజ్జిగ సంపత్, మలమరి ఎల్లయ్య, వలబోజు వెంకన్న,వేముల జగదీష్ తదితరులు పాల్గొన్నారు